Piyush Chawla: ఐపీఎల్ ప్రారంభం నుంచి  సుమారు 14 సీజన్ల పాటు నిరాటంకంగా వివిధ ఫ్రాంచైజీలకు ఆడిన టీమిండియా వెటరన్ స్పిన్నర్  పీయూష్ చావ్లా.. 2022లో  ఇదే ఐపీఎల్‌లో కామెంట్రీ బాధ్యతలు నిర్వర్తించినా ఈ ఏడాది మాత్రం స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇచ్చాడు.  ఐపీఎల్-16 లతో అత్యధిక వికెట్లు తీసిన టాప్ - 5 బౌలర్లలో చావ్లా ఒకడు.  ఈ సీజన్‌లో ముంబై తరఫున ఆడిన చావ్లా.. 16 మ్యాచ్‌లలో 22 వికెట్లు తీసి ముంబై ఇండియన్స్ విజయాలలో కీలక పాత్ర  పోషించాడు.  ఐపీఎల్ సీజన్ ముగిసిన తర్వాత  సేదతీరుతున్న  చావ్లా.. ABP Liveకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు.  ఈ సందర్భంగా చావ్లా.. తన ఐపీఎల్ జర్నీ,  కమ్‌బ్యాక్, ముంబై టీమ్ ఇచ్చిన సపోర్ట్, తన కష్టానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఈ వివరాలన్నీ అతడి మాటల్లోనే...


చెత్తబంతులతోనే వికెట్లు.. 


‘ఈ సీజన్‌లో నేను చెత్త బంతులు వేసి  కూడా వికెట్లు  పడగొట్టా.  నేను వేసే గూగ్లీలు,  రెగ్యులర్  రాంగ్ డెలివరీస్ కు  బ్యాటర్లు ఇట్టే పసిగట్టి పరుగులు రాబట్టేవారు.  కానీ నేను ఈసారి  రాంగ్ డెలివరీలనే కాస్త వేరియేషన్ జోడించి  విసిరా. వాటిని అంచనా వేయడంలో బ్యాటర్లు బోల్తా కొట్టారు. పలితాలు మీ కళ్ల ముందున్నాయి.  


నా కొడుకు కోసమే తిరిగొచ్చా.. 


నేను ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున ఆడుతున్నప్పుడు అద్విక్ (చావ్లా కొడుకు)  మ్యాచ్‌లు చూసేందుకు వచ్చేవాడు. అప్పుడు అతడికి 3 ఏండ్లు.  మ్యాచ్ గురించి పెద్దగా అర్థం కాకున్నా అక్కడుండే వాతావరణాన్ని బాగా ఇష్టపడేవాడు. కానీ ఇప్పుడు   అద్విక్‌కు గేమ్ అర్థమవుతోంది.   నేను మాత్రం ఆడటం లేదు. 14 ఏండ్లు ఐపీఎల్ ఆడి నా కొడుకు ఆటను అర్థం చేసుకునే టైమ్‌లో నేను ఆడటం లేదని బాధ ఉండేది.  అప్పుడు నా కుటుంబం నన్ను ప్రోత్సహించింది.  ఇప్పుడిప్పుడే నీ కొడుకు ఆటను అర్థం చేసుకుంటున్నాడు  అతడికి నీ ఆటతో మరింత పుష్ ఇవ్వుమని నన్ను ప్రోత్సహించారు. అలా నా కమ్‌బ్యాక్ జరిగింది.. నేను కఠిన ట్రైనింగ్ తీసుకుని  ముంబై ఇండియన్స్‌లోకి వచ్చా.. 


 






బౌలింగ్ స్ట్రాటజీ.. 


పవర్ ప్లే, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం సవాల్‌తో కూడుకున్నది. మిడిల్ ఓవర్స్ లో మనం ఫ్రీగా బౌలింగ్ చేయొచ్చు. కానీ  పవర్ ప్లే, డెత్ ఓవర్లలో అలా చేయడం కుదరదు. చాలా ఒత్తిడితో పాటు ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ వంటివి అడ్డంకులుగా మారుతాయి. నేను కేకేఆర్ లో ఉన్నప్పుడు పవర్ ప్లే లో కూడా   ఒకటి లేదా రెండు ఓవర్లు వేసేవాడిని. ముంబైలో కూడా ఇదే  సూత్రాన్ని అప్లై చేసి సక్సెస్ అయ్యా. 


కామెంట్రీపై.. 


లాస్ట్ ఈయర్ (2022) నేను వేలంలో అమ్ముడుపోలేదు. ఏం చేద్దామా..? అని  ఆలోచిస్తుండగా స్టార్  స్పోర్ట్స్ వచ్చి కామెంట్రీ చేయమని అడిగింది.  ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తానని నేను అందుకు అంగీకరించా.  ఆ క్రమంలో నేను చాలా నేర్చుకున్నా. 


ముంబై, రోహిత్ మద్దతు.. 


ఐపీఎల్ - 2023కి గాను ముంబై ఇండియన్స్ నన్ను రూ. 50 లక్షలకు దక్కించుకుంది. వాస్తవంగా చెప్పాలంటే  ముంబై ఇండియన్స్ నాకు చాలా మద్దతుగా నిలిచింది.  వేలంలో  తీసుకున్న తర్వాత టీమ్ మేనేజ్‌మెంట్ నన్ను  దక్షిణాఫ్రికాకు ట్రైనింగ్ కు పంపింది. ఆ తర్వాత నేను దేశవాళీ క్రికెట్ ఆడా. విజయ్ హజారే, సయీద్ ముస్తాక్ అలీ ట్రోఫీతో పాటు ముంబైలో నిర్వహించే డీవై పాటిల్ లీగ్ కూడా ఆడాను.  ఐపీఎల్-16 కు  నెలరోజులు ముందుగానే  ముంబై క్యాంప్ లో చేరా.  టీమ్ మేనేజ్‌మెంట్ తో పాటు ముంబై సారథి రోహిత్ శర్మ కూడా నాకు మద్దతుగా నిలిచాడు.  మేమిద్దరం కలిసి జూనియర్లుగా ఆడేప్పటి నుంచే మంచి స్నేహితులం.  సారథిగా  రోహిత్ చాలా సపోర్టివ్. కొన్నిసార్లు అతడు తన టీమ్ మేట్స్ కోసం సారథినన్న విషయాన్ని కూడా మరిచిపోతాడు. మరీ ముఖ్యంగా టీమ్ లో సరిగ్గా ఆడని ప్లేయర్లతో రోహిత్ ప్రత్యేకంగా  కూర్చుని వారితో మాట్లాడతాడు.  వారికి మద్దతుగా నిలుస్తాడు. 


డబ్ల్యూటీసీ ఫైనల్స్‌పై..


టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు రావడం గ్రేట్ అచీవ్‌మెంట్. ఈ ఏడాది భారత్ విజేతగా నిలుస్తుందని నేను భావిస్తున్నా..’ అంటూ  చావ్లా తన అనుభవాలు పంచుకున్నాడు.