ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో భారత్ ముందు భారీ లక్ష్యం నిలిచింది. ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో ఎనిమిది వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. దీంతో భారత్ విజయానికి రెండో ఇన్నింగ్స్‌లో 444 పరుగులు చేయాల్సి ఉంది. ఓవల్‌లో ఇప్పటి వరకు అత్యధిక లక్ష్యఛేదన 263 పరుగులు మాత్రమే. అది కూడా 1902లో జరిగింది. కాబట్టి ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాలంటే అద్భుతం జరగాల్సిందే.


173 పరుగుల తొలి  ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్‌కు ఆదిలోనే సిరాజ్, ఉమేశ్ లు డబుల్ స్ట్రోక్ ఇచ్చారు.  డేవిడ్ వార్నర్ (1) ను సిరాజ్ ఔట్ చేయగా ఉస్మాన్ ఖవాజా (13) ను ఉమేశ్ పెవిలియన్ పంపాడు. ఈ ఇద్దరూ వికెట్ కీపర్ భరత్‌కే క్యాచ్ లు ఇచ్చారు.


24 పరుగులకే ఓపెనర్లను కోల్పోయినా టీమిండియా  మళ్లీ పట్టు విడిచింది. స్టీవ్ స్మిత్ (47 బంతుల్లో 34, 3 ఫోర్లు) తో కలిసి  మార్నస్ లబూషేన్ మూడో వికెట్‌కు 62 పరుగులు జోడించాడు.  అయితే స్మిత్‌ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. జడ్డూ వేసిన 30.1 వ ఓవర్లో  స్మిత్ భారీ షాట్ ఆడబోయి శార్దూల్‌కు క్యాచ్ ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ (18) కూడా  ఎక్కువసేపు నిలువలేదు. హెడ్ వికెట్ కూడా   జడ్డూకే దక్కింది. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది.


నాలుగో రోజు ఆస్ట్రేలియాకు మూడో ఓవర్లోనే ఎదురు దెబ్బ తగిలింది. క్రీజులో నిలదొక్కుకున్న మార్నస్ లబుషేన్‌ను (41: 126 బంతుల్లో, నాలుగు ఫోర్లు) ఉమేష్ యాదవ్ పెవిలియన్ బాట పట్టించాడు. ఆ తర్వాత కామెరాన్ గ్రీన్ (25: 95 బంతుల్లో, నాలుగు ఫోర్లు), అలెక్స్ క్యారీ (66 నాటౌట్: 105 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు ఆరో వికెట్‌కు 43 పరుగులు జోడించారు. కామెరాన్ గ్రీన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన రవీంద్ర జడేజా వీరి భాగస్వామ్యాన్ని విడదీశాడు. కానీ అలెక్స్ క్యారీ, మిషెల్ స్టార్క్ (41: 57 బంతుల్లో, ఏడు ఫోర్లు)  మరో వికెట్ పడకుండా సెషన్‌ను ముగించారు.


లంచ్ తర్వాత అలెక్స్ క్యారీ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఏడో వికెట్‌కు మిషెల్ స్టార్క్, అలెక్స్ క్యారీ 93 పరుగులు జోడించారు. ఆ తర్వాత కాస్త వ్యవధిలోనే స్టార్క్, ప్యాట్ కమిన్స్ (5: 5 బంతుల్లో, ఒక ఫోర్) అవుటయ్యారు. ఎనిమిది వికెట్ల నష్టానికి 270 పరుగులు చేశాక ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీసుకున్నాడు. ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ రెండేసి వికెట్లు పడగొట్టారు. మహ్మద్ సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.