IND vs AUS 1st Test:  ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ శతకం బాదాడు. 171 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నాడు. టెస్టుల్లో హిట్ మ్యాన్ కు ఇది 9వ సెంచరీ. కఠినమైన పిచ్ పై సహచరులు తడబడుతున్నా కూల్ గా ఆడి రోహిత్ చేసిన ఈ శతకం ప్రత్యేకమైనదే. రోహిత్ సెంచరీతో టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది. ప్రస్తుతం రోహిత్ తో పాటు (103 నాటౌట్), రవీంద్ర జడేజా (12 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 


తొలి రోజు నుంచే పూర్తి ఆధిపత్యంతో బ్యాటింగ్ చేసిన రోహిత్ ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. పేసర్లను, స్పిన్నర్లను స్వేచ్ఛగా ఆడాడు. కఠినమైన బంతులను డిఫెన్స్ చేస్తూనే వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలోనే సుదీర్ఘ ఫార్మాట్లో తన 9వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అలాగే కెప్టెన్ గా అన్ని ఫార్మాట్లలో శతకం బాదిన నాలుగో క్రికెటర్ గా రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ కన్నా ముందు తిలకరత్నే దిల్షాన్, ఫాఫ్ డుప్లెసిస్, బాబర్ అజాం ఉన్నారు. అలాగే వన్డేలు, టీ20లు, టెస్టుల్లో కెప్టెన్ గా సెంచరీ చేసిన తొలి భారత ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు.






రెండో రోజు తొలి సెషన్ ఆట


భారత్- ఆస్ట్రేలియా రెండో రోజు తొలి సెషన్ లో టీమిండియా ఆధిపత్యం సాగింది. 2 వికెట్లు కోల్పోయినప్పటికీ ఈ సెషన్ లో భారత్ దే పైచేయిగా నిలిచింది. ఒక వికెట్ నష్టానికి 77 పరుగులతో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 151 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (142 బంతుల్లో 85 బ్యాటింగ్), విరాట్ కోహ్లీ (25 బంతుల్లో 12 నాటౌట్) క్రీజులో ఉన్నారు. 


రెండో రోజు ప్రారంభంలో రోహిత్ శర్మ, అశ్విన్ లు నిలకడగా ఇన్నింగ్స్ ను నడిపించారు. వీరిద్దరూ ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. కొన్ని బంతులు పరీక్షించినప్పటికీ పట్టుదలగా క్రీజులో నిలిచారు. ఆస్ట్రేలియా సహనాన్ని పరీక్షిస్తూ.. అడపాదడపా బౌండరీలు కొడుతూ ఇన్నింగ్స్ ను నిర్మించారు. ఈ జోడీ వికెట్ ఇవ్వకుండా దాదాపు గంటన్నరపాటు బ్యాటింగ్ చేసింది. రెండో వికెట్ కు 42 పరుగులు జోడించారు.  అయితే తొలి రోజు రాహుల్ వికెట్ తీసిన మర్ఫీ అశ్విన్ (62 బంతుల్లో 23) ను ఎల్బీడబ్ల్యూగా వెనక్కు పంపాడు. ఆ వెంటనే పుజారా (14 బంతుల్లో 7)ను కూడా క్యాచ్ ఔట్ ద్వారా మర్ఫీనే పెవిలియన్ చేర్చాడు. దీంతో భారత్ 17 పరుగుల తేడాతో 2 వికెట్లు కోల్పోయింది.  అయితే మరోవైపు క్రీజులో నిలదొక్కుకున్న రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. అతనికి కోహ్లీ సహకరిస్తున్నాడు.