International Womens Cricket: మహిళల క్రికెట్‌కు సంబంధించి ఐసీసీ(ICC) కీలక నిర్ణయం తీసుకుంది. లింగ మార్పిడి ద్వారా స్త్రీలుగా మారిన వారిని మహిళల క్రికెట్లో ఆడకుండా ఐసీసీ నిషేధించింది. మహిళా క్రికెట్ లో అత్యున్నత స్థాయిలో ఆడకుండా ట్రాన్స్‌జెండర్(Transgender ) క్రికెటర్లను నిషేధించింది. అంతర్జాతీయ ఆట కోసం కొత్త లింగ అర్హత నిబంధనలను క్రీడా వాటాదారులతో తొమ్మిది నెలల సంప్రదింపు తర్వాత ప్రక్రియను ఆమోదించింది. మహిళా క్రికెట్‌ న్యాయబద్ధతను కాపాడేందుకు, ప్లేయర్ల భద్రత కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. తొమ్మిది నెలల పాటు విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత ఐసీసీ ఈ లింగ అర్హత నియమావళిని ఆమోదించిందని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ తెలిపారు. లింగమార్పిడి చేయించుకున్న వాళ్లు మహిళల క్రీడల్లో పాల్గొనడంపై కొన్నేళ్లుగా చర్చ జరుగుతోంది. క్రికెట్‌ ఒలింపిక్‌ క్రీడ కాబోతోందని.. లింగ మార్పిడి చేసుకున్న వాళ్లు మహిళల ఆటల్లో పాల్గొనడం అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చనీయాంశమని ఐసీసీ అధికారి ఒకరు తెలిపారు. ఆటలకు తగ్గ నిర్ణయాలు తీసుకోవాలని... పారదర్శకంగా ఉండాలని అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘం(The International Olympic Committee (IOC)) క్రీడా సమాఖ్యలకు సూచించిందని ఆయన తెలిపారు. 


ఐసీసీ కొత్తగా ఆమోదించిన నిబంధనల ప్రకారం మగ నుంచి ఆడగా మారిన ఏ క్రికెటర్ అయినా, ఏ శస్త్రచికిత్స చేయించుకున్నా మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడలేరు. మొదటి ట్రాన్స్‌జెండర్ క్రికెటర్‌గా మారిన డేనియల్ మెక్‌గాహే ఇకపై మహిళల అంతర్జాతీయ క్రికెట్‌లో పాల్గొనలేదు. ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ అమెరికాస్ రీజియన్ క్వాలిఫైయర్‌లో మెక్‌గేయ్ కెనడా తరపున ఆరు టీ20లు ఆడింది. 29 ఏళ్ల మెక్‌గేయ్ బ్రెజిల్ మహిళలపై అత్యధిక స్కోరు 48తో 19.66 సగటుతో 118 పరుగులు చేసింది. అయితే దేశీయంగా లింగ అర్హాత అనేది ఆయా దేశాలకు సంబంధించిన బోర్డు పరిధిలోనిది. అది వారిష్టం.. అని ఐసీసీ తెలిపింది.


మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌లోకి మరో కొత్త రూల్‌ను తీసుకొస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ICC ప్రకటించింది. ఆట వేగాన్ని పెంచేందుకు వన్డే, టీ20 క్రికెట్లో ప్రయోగాత్మకంగా స్టాప్‌ క్లాక్‌(Stop Clock)ను ప్రవేశపెట్టాలని ఐసీసీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఓవర్‌ పూర్తయిన 60 సెకన్లలలోపు తర్వాతి ఓవర్‌ను మొదలెట్టడంలో ఫీల్డింగ్‌ జట్టు మూడోసారి విఫలమైతే ఆ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. బౌలర్ ఒక ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడానికి విధించిన 60 సెకన్ల పరిమితిని మూడోసారి దాటితే.. 5 పరుగుల పెనాల్టీ విధిస్తామని ప్రకటించింది. అయితే ఈ స్టాప్ క్లాక్' నియమాన్ని 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు పురుషుల వన్డే, టీ20 మ్యాచ్ల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఓవర్ల మధ్యలో తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. వన్డే, టీ20 క్రికెట్లో డిసెంబరు 2023 నుంచి ఏప్రిల్‌ 2024 వరకు ప్రయోగాత్మకంగా స్టాప్‌ క్లాక్‌ను ఉపయోగించాలని సమావేశంలో నిర్ణయించామనిఐసీసీ తెలిపింది. ఓవర్ల మధ్య సమయం వృథా కాకుండా చూడాలన్నదే ఈ రూల్‌ ఉద్దేశమని వివరించింది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి పిచ్‌ను నిషేధించే నిబంధనల్లో కూడా ఐసీసీ మార్పులు చేసింది. అయిదేళ్ల కాలంలో ఒక పిచ్‌ 5 అయోగ్యతా పాయింట్లు పొందితే నిషేధానికి గురయ్యేది. ఇప్పుడు ఆ పాయింట్లను ఆరుకు పెంచినట్లు తెలిపింది.