Harshit Rana Record: హర్షిత్ అరుదైన రికార్డు.. మూడు ఫార్మాట్లలో అది సాధించిన తొలి బౌలర్ గా ఘనత..
టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా మూడు ఫార్మాట్ల అరంగేట్రాల్లో కనీసం మూడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా రికార్డులకెక్కాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన సందర్బంగా తను టెస్టు జట్టులోకి డెబ్యూ అయ్యాడు.

Ind Vs Eng Odi Series Updates: భారత పేసర్ హర్షిత్ రాణా.. గురువారం ఇంగ్లాండ్ తో మ్యాచ్ సందర్భంగా వన్డేల్లో డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలుత భారీగా పరుగులిచ్చిన రాణా.. తర్వాత సత్తా చాటి మూడు వికెట్లు తీశాడు. దీంతో తను అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టెస్టులు, వన్డేలు, టీ20లు ఇలా మూడు ఫార్మాట్ల అరంగేట్రాల్లో కనీసం మూడు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్ గా రికార్డులకెక్కాడు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటన సందర్బంగా తను టెస్టు జట్టులోకి డెబ్యూ అయ్యాడు. అదే అతని కెరీర్లో తొలి అంతర్జాతీయ సిరీస్ కావడం విశేషం. ఈ సిరీస్ లో రెండు మ్యాచ్ లు ఆడిన రాణా.. తర్వాత గతనెలలో ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టీ20లో అరంగేట్రం చేశాడు.
వివాదాస్పద టీ20 అరంగేట్రం..
అయితే టీ20ల్లో హర్షిత్ అరంగేట్రం కాస్త వివాదానికి వేదికగా నిలిచింది. ఆ టీ20లో భారత ఆల్ రౌండర్ శివమ్ దూబే బౌన్సర్ కు గాయపడి కంకషన్ కు గురయ్యాడు. దీంతో అతనికి రీప్లేస్ మెంట్ గా హర్షిత్ రాణాను కంకషన్ సబ్ స్టిట్యూట్ గా తీసుకోవడం వివాదస్పదమైంది. కంకషన్ ను సబ్ స్టిట్యూట్ ను లైక్ టూ లైక్ ప్లేయర్ ని తీసుకుంటారు. అంటే బ్యాటర్ గాయపడితే బ్యాటర్, బౌలర్ గాయపడితే బౌలర్ ఇలా అన్నమాట. అయితే బ్యాటింగ్ ఆల్ రౌండర్ అయిన దుబే గాయపడితే స్పెషలిస్టు పేసర్ అయిన హర్షిత్ ను తీసుకోవడం ఏంటని విమర్శలు చెలరేగాయి. అయితే ఆ మ్యాచ్ లో తను మూడు వికెట్లతో రాణించి, సత్తా చాటాడు.
తాజాగా వన్డేల్లో...
ఇక గురువారం ఇంగ్లాండ్ తో జరిగిన వన్డేలో డెబ్యూ చేసిన హర్షిత్ .. మూడు కీలకమైన వికెట్లు తీసుకుని సత్తా చాటాడు. ఫస్టు జోరు మీదున్న బెన్ డకెట్ ను పెవిలియన్ కు పంపాడు. హర్షిత్ తో పాటే డెబ్యూ చేసిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ దాదాపు 21 మీటర్లు వెనక్కి పరిగెడుతూ డకెట్ క్యాచ్ తీసుకోవడం విశేషం. ఆ తర్వాత ప్రమాదకర హేరీ బ్రూక్ ను డకౌట్ చేశాడు. కాసేపటికే ఆల్ రౌండర్ లియామ్ లివింగ్ స్టన్ ను కూడా రాణా ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించలేకపోయింది. ఇలా మూడు ఫార్మాట్ల అరంగేట్రాల్లో కనీసం 3 వికెట్ల ప్రదర్శన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 248 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం ఛేదనను భారత్ 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి పూర్తి చేసింది. దీంతో నాలుగు వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0తో టీమిండియా ఆధిక్యంలో నిలిచింది. తర్వాతి వన్డే కటక్ వేదికగా ఈనెల 9న జరుగుతుంది.