Akshar Patel's brilliant innings in Duleep Trophy: దులీప్‌ ట్రోఫీ(Duleep Trophy)లో భారత స్టార్‌ ఆటగాళ్ల  పోరాటం ఆరంభమైంది. ఈ ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీలో సత్తా చాటి బంగ్లాదేశ్‌(Bangladesh)తో టెస్టు సిరీస్‌కు ముందు జట్టులో స్థానం సంపాందించాలని ఆటగాళ్లు పట్టుదలతో ఉన్నారు. చెన్నై(Chennai)లోని చిదంబరం స్టేడియం వేదికగా ఇండియా ఏ..ఇండియా బీ మధ్య తొలి మ్యాచ్‌ జరగగా... అనంతపురం(Anantapuram)లో ఇండియా సీ... ఇండియా డీ జట్ల మధ్య పోరు జరిగింది. 


 





భారత్‌ ఏ-బీ జట్ల మధ్య ఇలా...

ఇండియా ఏ- ఇండియా బీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత బీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియా బీ తరపును యశస్వీ జైస్వాల్‌... కెప్టెన్‌ అభిమన్యు ఈశ్వరన్‌ ఓపెనింగ్‌ వచ్చారు. ఈ ఓపెనింగ్‌ జోడి పర్వాలేదనిపించే ఆరంభాన్ని ఇచ్చింది. యశస్వీ జైస్వాల్‌ క్రీజులో ఉన్నంతసేపు సౌకర్యవంతంగా కనిపించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించారు. జైస్వాల్‌ 59 బంతుల్లో ఆరు ఫోర్లతో 30 పరుగులు చేసి అవుటయ్యాడు. అభిమన్యూ ఈశ్వరన్‌ కేవలం 13 పరుగులే చేసి అవుటయ్యాడు. కానీ వన్‌ డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన ముషీర్‌ ఖాన్‌(Musheer Khan) అద్భుత శతకంతో మెరిశాడు. చాలా ఓపిగ్గా బ్యాటింగ్‌ చేసిన ముషీర్‌... 227 బంతులు ఎదుర్కొని.. 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన సర్ఫరాజ్‌ ఖాన్‌ 9 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరగా... రిషబ్ పంత్‌ కూడా ఏడు పరుగులకే పెవిలియన్‌కు చేరాడు. పంత్‌ అద్భుతాలు చేస్తాడని ఆశిస్తున్న క్రమంలో తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడం అభిమానులను విస్మయానికి గురిచేసింది. ఆ తర్వాత నితీశ్‌ కుమార్‌, వాషింగ్టన్ సుందర్‌ డకౌట్‌ అయ్యారు. సాయి కిశోర్‌ కూడా ఒక్క పరుగుకే అవుట్‌ కావడంతో ఇండియా బీ జట్టు 97 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అయితే గోడల అడ్డు నిలబడ్డ ముషీర్‌ ఖాన్‌ అద్భుతం చేశాడు. అసలు స్కోరు 150 అయినా దాటుతుందా అన్న దశ నుంచి... స్కోరును 200 పరుగులు దాటించాడు. ముషీర్‌ ఖాన్‌కు నవదీప్ షైనీ అద్భుత సహకారం అందించాడు. షైనీ 29 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా బీ జట్టు 202 పరుగులకు ఏడు వికెట్లు కోల్పయింది.  





 

ఇండియా సీ- ఇండియా డీ మధ్య ఇలా...

అనంతపురం వేదికగా జరుగుతున్న ఇండియా సీ- ఇండియా డీ మధ్య మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో ఇండియా సీ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ నిర్ణయం సరైందే అని కాసేపటికే అర్థమైంది. చెలరేగిన ఇండియా సీ బౌలర్లు... ఇండియా డీని 164 పరుగులకే కుప్పకూల్చారు. అక్షర్‌ పటేల్(Axar patel) ఒక్కడే 86 పరుగులతో రాణించాడు. మిగిలిన వారందరూ విఫలమయ్యారు. ఇండియా డీ జట్టులో ఆరుగురు బ్యాటర్లు సింగిల్‌ డిజిట్‌కే అవుటయ్యారు. అక్షర్‌ పటేల్ తప్ప మిగిలిన వారెవ్వరూ 15 పరుగుల మార్క్‌ కూడా దాటలేకపోయారు. 34 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయిన ఇండియా డీని అక్షర్‌ ఆదుకున్నాడు. అద్భుత బ్యాటింగ్‌తో 86 పరుగులు చేశాడు. శ్రేయస్స్‌ అయ్యర్‌ 9, దేవదత్‌ పడిక్కల్‌ 0 విఫలమయ్యారు. అనంతరం బ్యాటింగ్‌ ఆరంభించిన ఇండియా సీ కూడా ఆరంభంలో తడబడింది. 43 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కానీ అభిషేక్‌ పోరెల్‌ 32 పరుగులతో నిలబడ్డాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా డీ 4 వికెట్లు కోల్పోయి 91 పరుగులు చేసింది.

Read Also: Pakistan Cricket: భజన చేసే వారికే చోటు , పాక్‌ పతనానికి సవాలక్ష కారణాలు