New Rule In International Cricket: అంతర్జాతీయ క్రికెట్‌(International Cricket)లోకి మరో కొత్త రూల్‌ను తీసుకొస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ICC) ప్రకటించింది. ఆట వేగాన్ని పెంచేందుకు వన్డే, టీ20 క్రికెట్లో ప్రయోగాత్మకంగా స్టాప్‌ క్లాక్‌ను ప్రవేశపెట్టాలని ఐసీసీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. ఓవర్‌ పూర్తయిన 60 సెకన్లలలోపు తర్వాతి ఓవర్‌ను మొదలెట్టడంలో ఫీల్డింగ్‌ జట్టు మూడోసారి విఫలమైతే ఆ జట్టుకు 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. బౌలర్ ఒక ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయడానికి విధించిన 60 సెకన్ల పరిమితిని మూడోసారి దాటితే.. 5 పరుగుల పెనాల్టీ విధిస్తామని ప్రకటించింది. అయితే ఈ స్టాప్ క్లాక్' నియమాన్ని 2023 డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకు పురుషుల వన్డే, టీ20 మ్యాచ్ల్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఓవర్ల మధ్యలో తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. వన్డే, టీ20 క్రికెట్లో డిసెంబరు 2023 నుంచి ఏప్రిల్‌ 2024 వరకు ప్రయోగాత్మకంగా స్టాప్‌ క్లాక్‌ను ఉపయోగించాలని సమావేశంలో నిర్ణయించామనిఐసీసీ తెలిపింది. ఓవర్ల మధ్య సమయం వృథా కాకుండా చూడాలన్నదే ఈ రూల్‌ ఉద్దేశమని వివరించింది. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి పిచ్‌ను నిషేధించే నిబంధనల్లో కూడా ఐసీసీ మార్పులు చేసింది. అయిదేళ్ల కాలంలో ఒక పిచ్‌ 5 అయోగ్యతా పాయింట్లు పొందితే నిషేధానికి గురయ్యేది. ఇప్పుడు ఆ పాయింట్లను ఆరుకు పెంచినట్లు తెలిపింది.


ఇక 2027 ప్రపంచకప్‌లోనూ కొన్ని మార్పులు జరపనున్నుట్లు ఐసీసీ వెల్లడించింది. దక్షిణాఫ్రికా (South Africa), జింబాబ్వే (zimbabwe)లు తొలిసారిగా నమీబియా (namibia)తో కలిసి ఆతిథ్యమివ్వబోతున్న ఆ మెగా టోర్నీ ఎన్నో విశేషాలకు వేదిక కానుంది. ఈసారి పోటీపడే జట్లు, ఫార్మాట్‌, నిబంధనలు.. ఇలా కొత్త మార్పులతో అలరించనుంది. 2023 వరల్డ్ కప్‌లో మొత్తం పది జట్లు 48 మ్యాచ్ లు ఆడి కప్పు కోసం పోటీపడ్డాయి. కానీ 2027లో జట్ల సంఖ్య 14కు పెరుగుతుంది. దీంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా 54కు చేరుతుంది. అయితే 2003 మాదిరే 2027లో ఫార్మాట్‌ ఉండనుంది. ఈసారి 10 జట్లు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌లో తలపడ్డాయి. దీంతో ఒక్కో జట్టు మిగతా తొమ్మిది జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడింది. పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌ చేరాయి. కానీ వచ్చే ప్రపంచకప్‌ అలా కాదు మొత్తం 14 జట్లు 2 భాగాలుగా ఏడేసి చొప్పున విభజిస్తారు. ఒక్కో గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా ఆరు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది. ఆ గ్రూప్‌ల్లో తొలి మూడు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్‌ సిక్స్‌కు అర్హత సాధిస్తాయి. అనంతరం తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లు సెమీస్‌ చేరతాయి. సెమీస్‌లో గెలిచిన రెండు జట్లు ఫైనల్లో తలపడతాయి. 


 ఇప్పటికే ఆతిథ్య హోదాలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. వన్డే ర్యాంకింగ్స్‌లో తొలి 8 స్థానాల్లో నిలిచే జట్లు నేరుగా ఈ ప్రపంచకప్‌ ఆడతాయి. గ్లోబల్ క్వాలిఫయర్ టోర్నీల నుంచి మిగతా నాలుగు జట్లు వస్తాయి. అయితే ఈ ప్రపంచ కప్ లో నమీబియా ఆడాలంటే మాత్రం అర్హత మ్యాచ్ ల ద్వారానే ఆడాల్సి ఉంటుంది.