ఢిల్లీలోని వాతావరణ కాలుష్యం కారణంగా మ్యాచ్  జరుగుతుందా లేదా అన్న ఊహాగానాలకు తెరపడింది.  ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా జరుగుతున్న  బంగ్లాదేశ్ శ్రీలంక  మ్యాచ్ లో  టాస్ గెలిచిన బంగ్లాదేశ్   బౌలింగ్ ఎంచుకుంది.  ఇరు జట్లకు ఇది నామమాత్రపు మ్యాచ్‌ ఏ అయినా... అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్నది చివరి నిమిషం వరకు  ప్రశ్నార్థకంగానే ఉంది. 

 

దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం అతి తీవ్రస్థాయిలో ఉంది. శనివారం ఉదయం వాయు నాణ్యత సూచీ AQI 504 కి చేరింది. విషపూరిత పొగమంచు దేశ రాజధానిని కమ్మేయడంతో ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు ట్రైనింగ్ సెషన్‌ను రద్దు చేసుకుంది. శ్రీలంక కూడా ఇప్పటికే ప్రాక్టీస్‌ సెషన్‌ను విరమించుకుంది. శనివారం మొత్తం హోటల్‌కే పరిమితం కావాలని శ్రీలంక నిర్ణయం తీసుకుంది. కానీ బంగ్లా జట్టు శనివారం సాయంత్రం మాస్కులు ధరించి కాసేపు మైదానంలో గడిపింది. 

 

శ్రీలంకకు విజయం కీలకం కానుంది. సెమీఫైనల్ అవకాశాలు దాదాపుగా మూసుకుపోయినా సాంకేతికంగా లంకేయులకు అవకాశం ఉంది. ఆ అవకాశాలు ఉండాలంటే బంగ్లాపై లంక గెలవాలి. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉన్న బంగ్లాదేశ్ ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. పాయింట్ల పట్టికలో శ్రీలంక ఏడో స్థానంలో ఉంది. పాకిస్తాన్‌లో జరిగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధించడానికి శ్రీలంక ఏడో స్థానంలోనే ఉండాలి. అంటే ఈ మ్యాచ్‌లో తప్పక లంక గెలవాలి. శ్రీలంక, బంగ్లాదేశ్‌లు ఇప్పటివరకూ 53 వన్డేలు ఆడగా లంక 49 మ్యాచుల్లో బంగ్లా 9 మ్యాచుల్లో గెలిచాయి. ప్రపంచ కప్‌ వార్మప్ మ్యాచ్‌లో లంకను.. బంగ్లా ఓడించింది. కానీ భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక 55 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు కాపాడుకోవాలని లంక కూడా చూస్తోంది. 

 

సదీర సమరవిక్రమ, కుశాల్‌ మెండీస్‌ రాణించాలని లంక కోరుకుంటోంది. పాతుమ్ నిస్సంక కూడా రాణిస్తే లంకకు విజయం సునాయసమే. బౌలింగ్‌లోనూ లంక పేసర్లు చెలరేగుతుండగా, కీలక స్పిన్నర్లు లేకపోవడం జట్టును దెబ్బతీసింది. బంగ్లాదేశ్‌ ఈ మెగా టోర్నీలో అఫ్ఘనిస్తాన్‌పై మాత్రమే విజయం సాధించింది. ఆ తర్వాత వరుసగా ఆరు మ్యాచుల్లో పరాజయం పాలయ్యారు. 

 

బంగ్లాదేశ్ జట్టు: 

షకీబుల్ హసన్ (కెప్టెన్‌), లిట్టన్‌దాస్, తాంజిద్ హసన్ తమీమ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా రియాద్, మెహిది హసన్ మిరాజ్, తస్కిన్ అహ్మద్, తస్కిన్ , తంజిమ్ హసన్ సాకిబ్.

 

శ్రీలంక జట్టు:

కుశాల్ మెండిస్, కుశాల్ పెరీరా, పాతుమ్ నిస్సంక, లహిరు కుమార,  సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ధనంజయ డి సిల్వా, థీక్షణ,  కసున్ రజిత, ఏంజెలో మాథ్యూస్, దిల్‌షాన్ మాథ్యూస్ కరుణరత్నే.