IND vs PAK: వన్డే ప్రపంచకప్ ముందు ప్రత్యర్థి జట్లకు మరీ ముఖ్యంగా బౌలింగ్‌ను చూసి విర్రవీగుతున్న పాకిస్తాన్‌కు రోహిత్ సేన తాను మనసు పెట్టి ఆడితే ఎలా ఉంటుందనేది చూపించింది. ‘ఇదీ మా ఆట’ అని ఘనమైన స్టేట్‌మెంట్ ఇచ్చింది. ‘గత రికార్డులు చూసి మురవడమే తప్ప వీళ్లేం ఆడతార్లే’ అనుకున్నవారికి  తమ బ్యాటింగ్  లోతు ఎంతో  ప్రపంచానికి ఘనంగా చాటిచెప్పింది. వన్డే క్రికెట్‌కు రోజులు చెల్లాయని ఆందోళనలు వ్యక్తమువుతున్న వేళ.. ఈ ఫార్మాట్‌లో ఉన్న మజాను ప్రపంచానికి మరోసారి పరిచయం చేసింది. భారత టాపార్డర్ రాణిస్తే ఫలితం ఏ విధంగా ఉంటుందో కాస్త గట్టిగానే చెప్పింది. బ్యాటర్ల తుఫానుకు తోడు బౌలర్లు రాణిస్తే ఎంత తోపు జట్టు అయినా తలవంచాల్సిందేనని  నిరూపించింది. ప్రపంచకప్‌కు ముందు భారత్‌కు ఎన్నో రకాలుగా మేలు చేసిన  అద్భుత విజయం ఇది.. 


ఓపెనర్లు ఫైరు..


పాకిస్తాన్‌తో మ్యాచ్ అంటేనే  మరీ ముఖ్యంగా షహీన్ షా అఫ్రిది బౌలింగ్‌లో భయపడుతున్నారని భారత సారథి  రోహిత్ శర్మపై గత కొంతకాలంగా  ప్రధానంగా ఉన్న ఆరోపణ.  2021 టీ20 ప్రపంచకప్‌లో షహీన్ బౌలింగ్‌లో  రోహిత్ ఔట్ అయ్యాడు.  ఆ తర్వాత కూడా  రోహిత్.. షహీన్ బౌలింగ్‌లో ఇబ్బందిపడ్డాడు.  మొన్నీమధ్యే  ఆసియా కప్ లీగ్ మ్యాచ్‌లో పల్లెకెలెలోనూ ఇదే పరిస్థితి. ఆ మ్యాచ్‌లో కూడా షహీన్ బౌలింగ్ లోనే రోహిత్ ఔటయ్యాడు.  ఇక మరో ఓపెనర్ గిల్ పరిస్థితీ అంతే.  సీనియర్ స్థాయిలో పాకిస్తాన్‌తో పల్లెకెలెలోనే తొలి మ్యాచ్ ఆడిన గిల్ ముఖంలో భయం కొట్టొచ్చినట్టు కనిపించింది.  కానీ సూపర్ - 4 మ్యాచ్‌లో మాత్రం ఈ ఇద్దరూ రివర్స్ ఎటాక్‌కు దిగారు.  పాకిస్తాన్ పేస్ త్రయం  షహీన్, నసీమ్ షా, హరీస్ రౌఫ్‌లను ఉతికారేశారు. షహీన్ వేసిన తొలి ఓవర్లోనే భారీ సిక్సర్ కొట్టిన రోహిత్.. తద్వారా దాడిని ప్రకటించేశాడు.   అతడే వేసిన  మూడో ఓవర్లో గిల్ వరుసగా మూడు ఫోర్లు బాదాడు. ఐదో ఓవర్లోనూ రెండు బౌండరీలు.  అఫ్రిదితో పాటు పాకిస్తాన్ జట్టు మొత్తం బిత్తర ముఖం వేసుకుని ఎవరితో  బౌలింగ్ వేయించాలి..? అనుకుంటూ  చూసిన క్షణమది.   పేసర్ల పప్పులు ఉడకడం లేదని  బాబర్ ఆజమ్.. షాదాబ్ ఖాన్‌కు బంతినిచ్చినా రిజల్ట్ మారలేదు. రోహిత్‌ను తక్కువ అంచనా వేశాడో ఏమో గానీ  షాదాబ్ కవ్వించే బంతులు వేస్తే హిట్‌మ్యాన్ వాటికి బలమైన ఆన్సర్ ఇచ్చాడు. వరుసబంతుల్లో 6, 6, 4తో పాటు అతడే వేసిన తదుపరి ఓవర్‌లో 6, 4‌తో రెచ్చిపోయాడు.  ఇద్దరూ అర్థసెంచరీలతో కదంతొక్కడంతో భారత స్కోరు 13 ఓవర్లలోనే 100 పరుగులు దాటింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఆధిక్యం సాధించడానికి తొలి, బలమైన అడుగు పడింది ఇక్కడే.. 


కోహ్లీ, రాహుల్ జోరు.. 


ఓపెనర్ల నిష్క్రమణ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్‌లు భారత ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించిన తీరును చెప్పడానికి మాటలు చాలవు.  రోహిత్, గిల్ ఔటయ్యాక  పాకిస్తాన్ ఆటలో తిరిగి పుంజుకుంటందని ఆ జట్టు భావించింది. కానీ అలా జరగలేదంటే దానికి కారణంగా కోహ్లీ - రాహుల్ ఆటనే. మిడిల్ ఓవర్స్‌లో  సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేసిన ఈ ఇద్దరూ.. ఒక భాగస్వామ్యాన్ని ఎలా నిర్మించాలో చెప్పకనే చెప్పారు.   రాహుల్ అడపాదడపా బౌండరీలు బాదినా  కోహ్లీ మాత్రం  సింగిల్స్‌తోనే గడిపాడు.  అతడి సెంచరీలో  34 పరుగులు మాత్రమే  ఫోర్లు, సిక్సర్ల రూపంలో వచ్చాయి. మిగిలిన 66  పరిగెత్తినవే.    మరోవైపు  తొడ గాయంతో  ఐదు నెలలు ఆటకు దూరమై రీఎంట్రీ ఇచ్చిన రాహుల్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.  20 నుంచి 40 ఓవర్ల మధ్య   రన్ రేట్ 6కు పడిపోకుండా  జాగ్రత్తగా ఆడిన ఈ ఇద్దరూ.. చివరి పది ఓవర్లలో జూలు విదిల్చారు.  పాకిస్తాన్ కెప్టెన్ బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా వాళ్ల పప్పులు  ఈ జోడీ ముందు ఉడకలేదు. ఇద్దరూ సెంచరీలతో కదం తొక్కడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. 


 






బౌలింగ్‌తో పాక్ బేజారు.. 


సుమారు ఏడాది తర్వాత  బుమ్రా వన్డేలు ఆడుతున్నాడు. సీనియర్ పేసర్ షమీ లేడు. శార్దూల్ ఎప్పుడెలా బౌలింగ్ చేస్తాడో తెలియదు.  నేపాల్‌తో మ్యాచ్‌లో అత్యంత చెత్త బౌలింగ్‌తో విమర్శలు. 350 పరుగుల ఛేదన కష్టమే అయినా భారత బౌలర్లపై ఉన్న అపనమ్మకంతో   ఒక్క భాగస్వామ్యం నమోదైనా ఆ తర్వాత పాక్‌ను అడ్డుకోవడం కష్టమేననే భయం భారత అభిమానులది.. కానీ  ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ  సాగింది భారత బౌలింగ్. మనకు షహీన్ షా అఫ్రిదిలు, నసీమ్ షాలు  లేకపోయినా ఉన్న వనరులతోనే రాణిస్తామన్న కెప్టెన్ రోహిత్ శర్మ మాటను నిజం చేస్తూ భారత బౌలర్ల ఆధిపత్యం సాగింది. బుమ్రా ఐదో ఓవర్లోనే  పాక్‌కు తొలి షాకిచ్చాడు.  సిరాజ్  వికెట్లు తీయకపోయినా పాకిస్తాన్‌ను భయపెట్టాడు.   హార్ధిక్ ఎంట్రీ తర్వాత పాక్ బ్యాటింగ్ వెన్నెముక అయిన బాబర్  క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక్కడే పాకిస్తాన్ ఓటమి ఖరారైంది. ఆ తర్వాత వికెట్లను క్రమం తప్పకుండా  కోల్పోయింది. రిజ్వాన్‌ను శార్దూల్ ఔట్ చేసి పాకిస్తాన్‌ను కోలుకోనీయలేదు.  ఇక కుల్దీప్ రంగ ప్రవేశంతో  పాకిస్తాన్ ఖేల్ ఖతం అయింది. బంతిని ఆడదామంటే ఫీల్డర్ చేతికి క్యాచ్ వెళ్తుందేమోనన్న భయం.. వదిలిపెడితే బంతి వికెట్లను కూల్చుతుందేమోనన్న సందేహం మధ్య పాకిస్తాన్ బ్యాటర్లు ఊగిసలాడారు.  ఫకర్ జమాన్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన కుల్దీప్.. ఆ తర్వాత అఘా సల్మాన్, ఇఫ్తికార్ అహ్మద్ , ఫహీద్ అష్రఫ్‌ల పనిపట్టాడు.  8 ఓవర్లు వేసి ద 25 పరుగులే ఇచ్చి ఏకంగా ఐదు వికెట్లు తీశాడు.  పేసర్లకు పిచ్ అనుకూలించకపోవడంతో  నిన్నటి మ్యాచ్‌లో బాబర్.. బంతిని ఎక్కువగా షాదాబ్ ఖాన్,  ఇఫ్తికార్ అహ్మద్‌కు ఇచ్చాడు.  వీళ్లు పెద్దగా ప్రభావం చూపలేదు. కోహ్లీ, రాహుల్‌లు స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కున్నారు. కానీ అటువంటి పిచ్‌పై కుల్దీప్ టర్న్‌ను రాబట్టాడు. 


వరల్డ్ కప్‌కు ముందు భారత్ ఇటువంటి ప్రదర్శన చేయడం  అందరికీ హ్యాపీయే గానీ  ఇదే ప్రదర్శనను ముందుకు తీసుకెళ్లడం  కీలకం.  పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో అన్నీ కలిసొచ్చాయి.  మిగిలిన మ్యాచ్‌లలో అలా జరుగకపోవచ్చు. ఏదేమైనా రీఎంట్రీలో కెఎల్ రాహుల్ అదరగొట్టడం,  కోహ్లీ సెంచరీ, టాపార్డర్ ఫామ్,  పేసర్ల సూపర్బ్ బౌలింగ్, కుల్దీప్ మాయ, హార్ధిక్  నిలకడ వంటివి భారత్‌కు కలిసొచ్చేవే. లోపాలను సరిదిద్దుకుంటే  ఆసియా కప్‌తో పాటు  పదేండ్లుగా ఊరిస్తూ దూరమవుతున్న ఐసీసీ ట్రోఫీని అందుకోవడం పెద్ద కష్టమేమీ కాదు.







ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial