Asia Cup 2022: ఆసియా కప్ లో సూపర్- 4కు చేరుకున్న భారత జట్టు సెప్టెంబర్ 4 వ తేదీన మ్యాచ్ ఆడనుంది. ఈ విరామంలో దొరికిన సమయాన్ని జట్టు సభ్యులు ఆటవిడుపుకు ఉపయోగించుకున్నారు. సముద్రంలో రోయింగ్ చేస్తూ, బీచ్ వాలీబాల్ ఆడుతూ రీఫ్రెష్ అయ్యారు. టీంలోని ఆటగాళ్లందరూ సరదాగా సమయాన్ని గడిపారు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ ట్విటర్ లో పంచుకుంది. ఈరోజు జరగనున్న పాక్- హాంకాంగ్ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో ఆదివారం భారత్ తలపడనుంది.


బుధవారం జరిగిన గ్రూప్ మ్యాచ్ లో హాంకాంగ్ పై 40 పరుగుల తేడాతో గెలిచిన టీమిండియా సూపర్- 4కు అర్హత సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ తన తొలి వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. వేగంగా ఆడే క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ (21: 13 బంతుల్లో, రెండు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్ ఐదో ఓవర్లోనే అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (36: 39 బంతుల్లో, రెండు సిక్సర్లు), విరాట్ కోహ్లీ (59 నాటౌట్: ఒక ఫోర్, మూడు సిక్సర్లు) నింపాదిగా ఆడారు. ముఖ్యంగా కేఎల్ రాహుల్ అతి జాగ్రత్తతో ఆడటంతో స్కోరు బాగా నిదానించింది. 10 ఓవర్లకు జట్టు స్కోరు 70 పరుగులు మాత్రమే.


ఇన్నింగ్స్ 13వ ఓవర్లో రాహుల్ కూడా అవుటయ్యాడు. అయితే ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్: 26 బంతుల్లో ఆరు ఫోర్లు, ఆరు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. విరాట్ కోహ్లీతో కలిసి మూడో వికెట్‌కు ఏడు ఓవర్లలోనే 98 పరుగులు జోడించాడు. ముఖ్యంగా చివరి ఓవర్లో సూర్యకుమార్ హిట్టింగ్ నెక్స్ట్ లెవల్. నాలుగు సిక్సర్లు, రెండు పరుగులతో ఏకంగా 26 పరుగులు సాధించాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది.