England team to head back to Abu Dhabi: వైజాగ్‌(Vizag)లో జరిగిన రెండో టెస్ట్‌లో పరాజయంపాలైన ఇంగ్లాండ్‌(England) మరో మూడు టెస్ట్‌ మ్యాచులు మిగిలి ఉండగానే భారత్‌ను వీడనుంది. అదేంటీ సిరీస్‌ మధ్యలో వైదొలగడం ఏంటి అని అనుకుంటున్నారా... దాని వెనక బ్రిటీష్‌ జట్టు ప్రణాళిక వేరే ఉంది. రాజ్‌కోట్‌ వేదికగా మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుండగా 10 రోజల విరామ సమయాన్ని అబుదాబిలో గడపడానికి ఇంగ్లాండ్‌జట్టు సిద్ధమైంది. కొంత విశ్రాంతి తీసుకుని తరువాత టెస్టుకు అన్ని విధాల సిద్ధమవుతామని జట్టు మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. 



ఉప‌ఖండ‌పు పిచ్‌ల‌పై రాణించేందుకు అబుదాబీ పిచ్‌ల‌పై ఇంగ్లాండ్ క్రికెట‌ర్లు తీవ్రంగా సాధ‌న చేశారు. భార‌త స్పిన్న‌ర్ల‌ను ఎలా ఎదుర్కొవాల‌నే దానిపైనే ప్ర‌ధానంగా దృష్టి పెట్టారు. మొదటి టెస్టులో ఓటమి పాలైన భారత్‌ రెండో టెస్టులో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. ఈ పర్యటనకు ముందు ఇంగ్లాండ్‌ జట్టు భారత స్పిన్నర్లను ఎదుర్కోవడానికి అబుదాబి క్యాంప్‌లో చాలా కసరత్తులు చేసింది. మొదటి టెస్టులో విజయం సాధించిన ఇంగ్లాండ్‌ రెండో టెస్టులో 106 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.


సిరీస్‌ సమం...
విశాఖ వేదికగా ఇంగ్లండ్‌(England)తో జరిగిన రెండో టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించింది. మూడున్నర రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో 106 పరుగుల తేడాతో టీమిండియా(Team India) గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ దిగిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో యశస్వీ జైస్వాల్‌(yashasvi jaiswal) ద్విశతకంతో కదంతొక్కడంతో396 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బుమ్రా ఆరు వికెట్లతో సత్తాచాటడంతో తొలి ఇన్నింగ్స్‌లో పర్యాటక జట్టు 253 పరుగులకు కుప్పకూలింది.


రెండో ఇన్నింగ్స్‌లో శుభమన్‌ గిల్(Subhaman gill) సెంచరీతో రాణించడంతో టీమిండియా 255 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 399 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ ఒక వికెట్‌ నష్టానికి 67 పరుగుల స్కోరుతో నాలుగోరోజు లక్ష్య ఛేదనను కొనసాగించిన ఇంగ్లాండ్‌కు తొలి సెషన్‌లోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇవాళ ఆరంభంలో భారత బౌలర్లను కాస్త ఇబ్బంది పెట్టిన ఇంగ్లాండ్ బ్యాటర్లు కీలక సమయంలో వికెట్లను సమర్పించుకున్నారు. జాక్‌ క్రాలే 73 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. వికెట్‌ కీపర్‌ బెన్‌ ఫోక్స్‌, టామ్‌ హార్ట్‌లీ చెరో 36 పరుగులతో ఫర్వాలేదనించారు. అశ్విన్‌, బుమ్రా చెరో 3 వికెట్ల పడగొట్టారు. ముకేశ్‌, కుల్‌దీప్‌, అక్షర్‌ ఒక్కో వికెట్‌ తీసుకున్నారు. ఈ నెల 15న రాజ్‌కోట్‌లో మూడో టెస్టు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రా అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.


బూమ్‌ బూమ్‌ బుమ్రా..
ఈ మ్యాచ్‌లో పేసు గుర్రం జస్ప్రీత్‌ బుమ్రా తొమ్మిది వికెట్లు తీసి ఇంగ్లండ్‌ పతనాన్ని శాశించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆరు, సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసిన బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. చేతన్‌ శర్మ తర్వాత ఇంగ్లండ్‌పై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన భారత సీమర్‌గా బుమ్రా రికార్డుల్లోకెక్కాడు. 1986లో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో చేతన్ శర్మ 188 పరుగులిచ్చి 10 వికెట్లు పడగొట్టగా.. ఈ మ్యాచ్‌లో బుమ్రా 91 పరుగులు సమర్పించుకుని 9 వికెట్లు పడగొట్టాడు. ఈ గణాంకాలు బుమ్రా కెరీర్‌లో రెండో బెస్ట్‌ కావడం గమనార్హం. బుమ్రా ఇప్పటివరకూ తొమ్మిది సార్లు ఐదు వికెట్ల ఘనతలు నమోదు చేశాడు. బుమ్రా 33 టెస్ట్‌ల్లో 20.82 సగటున 146 వికెట్లు పడొట్టాడు.