Team India to tour Zimbabwe for T20I series in July: టీ 20 ప్రపంచకప్‌(T20 World cup) ముగిసిన వారం రోజుల్లోనే టీమిండియా జింబాబ్వే(Zimbabwe)లో పర్యటించనుంది. ఈ ఏడాది జూన్‌లో వెస్టిండీస్‌, అమెరికా వేదికగా టీ20 ప్రపంచకప్‌ జరగనుండగా జూలై 6 నుంచి జింబాబ్వే టూర్‌ ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో జింబాబ్వేతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ టూర్... టీ20 వరల్డ్‌కప్‌ 2024 ముగిసిన తర్వాత ఉండనుంది. అన్ని మ్యాచ్ లు హరారే వేదికగా జులై 6, 7, 10, 13, 14 తేదీల్లో జరుగనున్నాయి. బీసీసీఐతో సుదీర్ఘ చర్చల తర్వాత భారత్‌తో సిరీస్‌ ఖరారైందని జింబాబ్వే క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ తవెంగ్వా ముకుహ్లానీ తెలిపారు. తమ దేశంలో ఈ ఏడాది జరిగే అతిపెద్ద అంతర్జాతీయ ఈవెంట్‌ ఇదేనని... టీమిండియాకు ఆతిథ్యమిస్తున్నందుకు చాలా సంతోషిస్తున్నామని తవెంగ్యా సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. తమ దేశ పర్యటనకు ఒప్పుకున్నందుకు బీసీసీఐకి ధన్యవాదాలు అని తవెంగ్వా తెలిపాడు. జింబాబ్వే క్రికెట్‌ను పునర్నిర్మిస్తున్నందున ప్రపంచ క్రికెట్‌లో ఇది ఉత్తేజకరమైన దశ అని, దేశంలో క్రికెట్ వృద్ధికి తోడ్పాటునందించేందుకు భారత్ తనవంతు కృషి చేస్తుందని బీసీసీఐ సెక్రటరీ జైషా తెలిపారు. 



విండీస్‌ స్ఫూర్తితో ముందుకు..
టెస్ట్ క్రికెట్ చనిపోతోందీ అన్న వాదన తెరపైకి వచ్చిన ప్రతిసారీ ఓ మ్యాచ్ వస్తుంది... అందరి నోళ్లను మూయించడానికి. ఇప్పుడు అలాంటి టెస్ట్ మ్యాచే ఆస్ట్రేలియాలోని చారిత్రక గబ్బా స్టేడియంలో జరిగింది. వెస్టిండీస్ ఆస్ట్రేలియాపై ఓ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. 1997 తర్వాత, అంటే సుమారు 27 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద టెస్ట్ విజయం సాధించింది. ఆస్ట్రేలియా మీద టెస్టుల్లో 21 ఏళ్ల తర్వాత దక్కిన విజయం ఇది. మూడేళ్ల క్రితం గబ్బాలో మన టీమిండియా సృష్టించిన చరిత్ర గురించి తెలిసిందేగా. అప్పుడు అనేక మంది హీరోలు ఉన్నారు. రిషబ్ పంత్ మెయిన్. ఇప్పుడు వెస్టిండీస్ లో కూడా అంతే. ఒక్కడే మెయిన్ హీరో. షమార్ జోసెఫ్. పేరు పెద్దగా విని ఉండరు. ఈ రెండు టెస్టు మ్యాచుల సిరీస్ లోనే డెబ్యూ చేశాడు. ఆడుతున్న రెండో టెస్టులోనే చారిత్రక విజయాన్ని కట్టబెట్టాడు. దాని వెనుక ఓ స్ఫూర్తిదాయక స్టోరీ కూడా ఉంది. 


వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ సమయంలో ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ వేసిన అదిరిపోయే యార్కర్ కు జోసెఫ్ కాలి బొటనవేలు విరిగింది. బ్యాటింగ్ కూడా మళ్లీ చేయకుండా రిటైర్డ్ ఔట్ అయిపోయాడు. ఇవాళ అసలు బౌలింగ్ వేస్తాడా అన్న పరిస్థితి. అదృష్టవశాత్తూ ఫ్రాక్చర్ ఏమీ కాకపోవటంతో బౌలింగ్ కు వచ్చాడు. లిటరల్ గా నిప్పులు చెరిగాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ ను ముప్పుతిప్పలు పెట్టాడు. 216 పరుగుల లక్ష్యఛేదనలో ఆస్ట్రేలియా ఒకానొక సమయంలో 113 ఫర్ 2. క్రీజులో స్టీవ్ స్మిత్, క్యామెరూన్ గ్రీన్ బాగానే నిలదొక్కుకున్నారు. అప్పుడు వచ్చాడు షమార్ జోసెఫ్. వరుస రెండు బాల్స్ లో గ్రీన్, హెడ్ ను ఔట్ చేసి వెస్టిండీస్ ను మళ్లీ గేమ్ లోకి తీసుకొచ్చాడు.  


ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ 311 పరుగులు స్కోర్ చేస్తే, ఆస్ట్రేలియా 289 స్కోర్ చేసి డిక్లేర్ చేసింది. వెస్టిండీస్ 193 స్కోర్ చేసి ఆస్ట్రేలియా ముందు 216 పరుగుల లక్ష్యాన్ని నిలిపితే, షమార్ జోసెఫ్ విరోచిత స్పెల్ తో విండీస్ కు విజయాన్ని అందించి సిరీస్ ను 1-1 తో సమం చేశాడు. ట్రోఫీని ఇరుజట్లూ పంచుకోబోతున్నాయి.