Team India Captain Rohit Sharma Good Bye : టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు చెప్పేశాడు. టీ20 వరల్డ్‌ కప్ గెలుచుకున్న తర్వాత ముందుగా విరాట్ కొహ్లీ ఈ విషయాన్ని ప్రకటిస్తే కాసేపటి క్రితం రోహిత్ శర్మ కూడా తన రిటైర్ అవుతున్నట్టు చెప్పేశాడు. 


శనివారం టీ 20 ప్రపంచ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచి విశ్వవిజేతగా నిలిచిన తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్‌ శర్మ తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు. టెస్టు, వన్డే ఫార్మాట్లలో భారత్‌ తరఫున కొనసాగుతానని, టీ20 ఫార్మాట్‌ నుంచి వైదొలగుతున్నానని రోహిత్‌ చెప్పాడు. విరాట్ కోహ్లి కూడా దేశం కోసం కొత్త తరానికి అవకాశాలు ఇచ్చేందుకు T20 క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాని చెప్పిన కొద్ది సేపటికి రోహిత్ శర్మ కూడా తన రిటైర్మెంట్‌ను ప్రకటించాడు.  


భారత్ తన రెండో టీ 20 వరల్డ్ కప్‌ సంబరాలు జరుపుకుంటున్న టైంలో ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు షాకింగ్ న్యూస్‌ చెప్పారు. అయితే ఇలా గ్రాండ్‌గా రిటైర్మెంట్‌ ప్రకటన ఉంటుందని మాత్రం సగటు క్రికెట్ అభిమాని భావిస్తూ వచ్చాడు. టీ 20 వరల్డ్ కప్ గెలిస్తే మాత్రం కచ్చితంగా ఇద్దరు దిగ్గజాలు రిటైర్మెంట్ ప్రకటిస్తారని అంతా అనుకున్నారు. అనుకున్నట్టుగానే ప్రపంచ కప్ టైటిల్‌ అందుకున్న వెంటనే రోహిత్ మాట్లాడుతూ,వీడ్కోలు చెప్పడానికి ఇంతకంటే మంచి సమయం లేదన్నాడు. ఈ నిర్ణయం T20 ఇంటర్నేషనల్‌ కెరీర్‌కు తగిన ముగింపు అని భావించాడు.


ప్రపంచ కప్ విజయంతో కెరీర్ ప్రారంభించిన రోహిత్‌ ఇప్పుడు మరో విజయంతో ముగించాడు. ఈ 17 సంవత్సరాల ప్రయాణంలో రోహిత్ బ్యాటర్‌గా చాలా అపూర్వమైన మైలురాళ్లు సాధించాడు. ఎంతో ఎదిగాడు. 159 మ్యాచ్‌ల్లో 32.05 సగటుతో 4231 పరుగులు చేశాడు రోహిత్. ఈ ఫార్మాట్‌లో అతనికి 5 సెంచరీలు ఉన్నాయి. భారతీయ బ్యాటర్‌లో ఇతనే ఎక్కువ సెంచరీలు చేసిన వ్యక్తిగా రికార్డు ఉంది. 


"ఇది నా చివరి ఆట. నేను ఈ ఫార్మాట్‌లో ఆడటం ప్రారంభించినప్పటి నుంచి ఆస్వాదించాను. నేను ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికే  ఇష్టపడుతున్నాను. ఎప్పటికీ ఇదే నేను కోరుకుంటాను - కప్ గెలవాలని బలంగా కోరుకున్నాను. " అని రోహిత్ చెప్పాడు. దీంతో ఆయన రిటైర్ అవుతున్నట్టు స్పష్టమైంది. 


జెండా పాతే రిటైర్‌
విజయంతో కెరీర్ ప్రారంభించాను విజేతనైన దేశపు విక్టరీ జెండాను క్రికెట్ గ్రౌండ్‌లోనే పాతి రిటైర్ అవుతున్నాను అన్నట్టు రోహిత్ శర్మ ఇండికేషన్ ఇచ్చాడు. విజయం తర్వాత ఓ వ్యక్తి చేతిలోని జాతీయ జెండాను తీసుకొని గ్రౌండ్‌లో పాతి సెల్యూట్ చేశాడు. ఈ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో వైరల్ అవుతోంది. 



అనుకున్నాది నేను సాధించాను అన్నట్టు విజయం సాధించిన తర్వాత గ్రౌండ్‌లో పడుకొని రోహిత్ శర్మ నేలపై గట్టిగా కొట్టాడు. ఎప్పటి నుంచో బలంగా కోరుకుంటున్న కోరిక తీరిన చిన్న పిల్లాడి మాదిరి కంటనీరు పెట్టుకున్నారు. ఒక్కడే ఓ వైపుగా వెళ్లిపోయి ఆకాశం వైపు చూస్తూ కళ్లు తుడుకొని మళ్లీ జట్టు సభ్యులతో కలిసిపోయాడు. 



మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తున్న హార్దిక్ పాండ్యాను గట్టిగా హత్తుకొని ముద్దులు కూడా పెట్టేశాడు. చివరి ఓవర్‌లో హార్దిక పాండ్యా అద్భుతమైన బౌలింగ్ చేశావని ప్రశంసించాడు.  బహుమతి ప్రదానం తర్వాత రాహుల్ ద్రవిడ్‌ను విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ భుజాలపై మోసుకొని విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. 


Also Read: ఇదే నా చివరి టీ20 మ్యాచ్ - పొట్టి ఫార్మాట్‌కు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్