Igor Stimac: ఆసియా క్రీడల ముందు భారత ఫుట్బాల్లో ‘జ్యోతిష్యం’ కలకలం రేపుతోంది. ఇండియా ఫుట్బాల్ కోచ్ ఇగోర్ స్టిమాక్.. జట్టును ఎంపిక చేయాలనే విషయంపై ప్రముఖ జ్యోతిష్కుడి సలహాలు తీసుకున్నారన్న వార్తలు సంచలనం రేపుతున్నాయి. గతేడాది ఆసియా కప్ ప్రిలిమ్స్లో జట్టు ఎంపిక చేయడానికి గాను స్టిమాక్.. ఢిల్లీకి చెందిన భూపేశ్ శర్మ అనే జ్యోతిష్యుడిని సంప్రదించి ప్రతీ మ్యాచ్కు ముందు ఆటగాళ్ల లిస్ట్, వారి గత మ్యాచ్ల వివరాలు అతడికి పంపించి వారిలో ఎవరిని ఆడించాలి..? ఏ ఆటగాడు మిడ్ ఫీల్డర్గా ఉండాలి..? ఎవరు అటాకింగ్కు దిగాలి. గోల్ పోస్ట్ దగ్గర ఎవరు ఉంటే గ్రహాలు అనుకూలిస్తాయి..? ఎవరు గోల్ కొట్టాలి..? వంటి విషయాలపై చేసిన సుదీర్ఘ చాట్కు సంబంధించిన రహస్యాలు బట్టబయలయ్యాయి.
ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం మేరకు.. సునిల్ ఛెత్రి నేతృత్వంలోని భారత జట్టుకు హెడ్కోచ్గా వ్యవహరిస్తున్న క్రొయేషియా మాజీ ఆటగాడు ఇగోర్ స్టిమాక్ గతేడాది ఆసియా కప్లో భారత్ ఆడే మ్యాచ్లకు ముందు భూపేశ్ శర్మను సంప్రదించారు. ఆసియా కప్కు అర్హత సాధించాలంటే అఫ్గానిస్తాన్తో తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్కు కొద్దిసేపటిముందు స్టిమాక్.. భూపేశ్ శర్మకు మెసేజ్ చేశాడు.
ఆ చాట్ వివరాలు..
స్టిమాక్ : హాయ్ డీయర్ ఫ్రెండ్, జూన్ 11న అఫ్గానిస్తాన్తో మ్యాచ్ రాత్రి 8.30కు మొదలుకానుంది. మీకు పంపిన ఈ లిస్ట్లో నుంచి ఎవర్ని ఎంపిక చేయమంటారు..?
జ్యోతిష్యుడు : బాగుంది. టీమ్ పర్ఫెక్ట్గా ఉంది. వీళ్లు బాగా పర్ఫామ్ చేస్తారు. కానీ కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ను తగ్గించుకోమనండి.
మరో విషయంలో..
జ్యోతిష్యుడు : నేను అక్కడికి (ఆసియా కప్ మ్యాచ్లు జరిగే వేదిక - కోల్కతా) ఎప్పుడు రావాలో చెప్పగలవు..?
స్టిమాక్ : మనకు మ్యాచ్లు 6, 9, 12 న ఉన్నాయి.
జ్యో : అలాగా, అయితే నేను 6 నుంచి 14 వరకూ అక్కడే అందుబాటులో ఉంటా.
స్టి : నేను పంపిన ఈ లిస్ట్లో ఏ ఆటగాడికైనా ఈ రోజు బాగోలేదా..? ఇంకెవరికైనా బిలో యావరేజ్ డే గా ఉందా..?
జ్యో : ఓకే.. నేను చెక్ చేస్తా .
స్టి : సదరు ఆటగాడితో మిగతా ముగ్గురి ప్లేయర్ల జాతకాలను కూడా పోల్చి చూడండి.
ఇలా దాదాపుగా ఇరువురి మధ్య 2022 మే నుంచి జూన్ మధ్య వందకు పైగా మెసేజ్లు ఎక్స్చేంజ్ అయ్యాయి. ఆసియా కప్ ప్రిలిమ్స్ లో భారత్ నాలుగు మ్యాచ్లు (జోర్డాన్, కంబోడియా, అఫ్గానిస్తాన్, హాంకాంగ్లతో ఆడింది. ప్రతీ మ్యాచ్కు ముందు స్టిమాక్.. జట్టు వివరాలను జాతకుడికి పంపించి వారిలో ఎవరిని ఎంపిక చేయాలి..? ఎవరెవరిని ఎక్కడ ఆడించాలి..? వంటి వివరాలను అడిగారు.
చీఫ్ సెలక్టర్గా జ్యోతిష్కూడిని తీసుకోండి..
ఫుట్బాల్ జట్టులో జ్యోతిష్యుడి జోక్యం గురించి వివాదం రేగిన నేపథ్యంలో కోచ్, ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అయితే భారత ఫుట్బాల్ జట్టు చీఫ్ సెలక్టర్గా జ్యోతిష్యుడిని నియమించుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు. ఏఐఎఫ్ఎఫ్ నాటి అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ను దీనిపై వివరణ కోరగా ‘నాకు దీని గురించి తెలియదు’ అని చెప్పడం గమనార్హం. శర్మ కూడా రెస్పాండ్ కాలేదు. ప్రస్తుత ఏఐఎఫ్ఎఫ్ చీఫ్ కళ్యాణ్ చౌబేను సంప్రదించగా అతడు కూడా వివరణ ఇవ్వలేదు.