Pakistan, Afghan fans clash: ఆసియా కప్‌లో పాకిస్థాన్‌ వరుస విజయాలు సాధించడం సంగతేమో కానీ! క్రీడా స్ఫూర్తిని ఎవరూ పట్టించుకోవడం లేదు. మైదానంలో ఆటగాళ్లు, గ్యాలరీలో అభిమానులు అతి భావోద్వేగానికి లోనవుతున్నారు. ఆటలో గెలుపోటములు సహజమే అని సరిపెట్టుకోవడం లేదు. అఫ్గాన్‌, పాక్‌ మధ్య నరాలు తెగే ఉత్కంఠతో మ్యాచులు జరిగే ప్రతిసారీ ఇలాగే అవుతోంది. బుధవారం జరిగిన మ్యాచులో ఆఖరి నిమిషంలో పాక్‌ గెలవడంతో అభిమానులు విధ్వంసం సృష్టించారు.


2018 ఆసియాకప్‌, 2019 వన్డే ప్రపంచకప్‌, 2021 టీ20 ప్రపంచకప్‌లో నోటిదాకా వచ్చిన గెలుపు భోజనాన్ని పాక్‌ పట్టుకెళ్లిపోయింది. ఇప్పుడు షార్జాలోనూ ఇలాగే జరిగింది. 130 పరుగుల లక్ష్య ఛేదనలో 19 ఓవర్లకు పాక్‌ 119-9తో నిలిచింది. మ్యాచ్‌ గెలవాలంటే ఆఖరి ఓవర్లో పాక్‌కు 11 పరుగులు కావాలి. అఫ్గాన్‌కు ఒక వికెట్‌ కావాలి. ఫజల్ హక్‌ ఫారూఖీ వేసిన తొలి బంతిని అప్పుడే క్రీజులోకి వచ్చిన నసీమ్‌ షా సిక్సర్‌గా మలిచాడు. అదే ఊపులో రెండో బంతినీ సిక్సర్‌గా బాదేసి విజయం లాగేసుకున్నాడు.




పాక్‌ విజయం సాధించగానే ఒక్కసారిగా అందరి భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. క్రీజులోని పాక్‌ క్రికెటర్లు ఫారూఖీని బ్యాటుతో కొడుతున్నట్టు, అతడితో వాగ్వాదానికి దిగినట్టు ప్రవర్తించారు! మరోవైపు అఫ్గాన్‌ అభిమానులు షార్జా స్టేడియంలోని కుర్చీలను విరగొట్టడం మొదలు పెట్టారు. ఫర్నీచర్‌ను తన్నారు. విరిగిన కుర్చీలను పాక్‌ ఫ్యాన్స్‌ మీదకు విసిరారు. దాంతో రెండు జట్ల అభిమానులు పరస్పరం గొడవకు దిగారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.


అభిమానుల తీరుపై పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ స్పందించాడు. అఫ్గానీల ప్రవర్తనను ఎత్తి చూపాడు. 'ఇదీ అఫ్గాన్‌ అభిమానులు చేస్తున్న పని. కొన్నాళ్లుగా వారు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. ఇది ఆట. దీనిని క్రీడా స్ఫూర్తితో ఆడాలి. అలాగే ఓటములను భరించాలి. మీరు ఆటను అభివృద్ధి చేయాలంటే మీ ఆటగాళ్లు, ఫ్యాన్స్‌ కొన్ని విషయాలు నేర్చుకోవాలి' అని అఫ్గాన్ క్రికెట్‌ బోర్డు సీఈవో షఫిక్‌ స్టానిక్‌జాయ్‌కు ట్యాగ్‌ చేశాడు.




ఇందుకు అఫ్గాన్‌ ప్రతినిధి సైతం ఘాటుగానే బదులిచ్చాడు. 'షోబయ్‌ ఓసారి ఈ ఫోటోలు, వీడియోలు జాగ్రత్తగా చూసి న్యాయం చెప్పండి. మీరు మా యావత్‌ జాతినీ అవమానపరిచే మాటల కన్నా ముందు క్రికెట్‌ నిబంధనల ప్రకారం మ్యాచ్‌ రిఫరీని నిర్ణయించనివ్వండి. మీరిలా చేయడం ఇది రెండోసారి. నిజానికి మీరే మాకు క్షమాపణలు చెప్పాలి' అని ట్వీట్‌ చేశాడు. కాగా నేడు భారత్‌, అఫ్గానిస్థాన్ ఆఖరి సూపర్‌-4 మ్యాచులో తలపడుతున్నాయి.