పూజల్లో మొదటి పూజ గణపతికే. ఆయన ఆవాహన తర్వాతే ఏ పూజయినా. ఏ పని చేపట్టినా విఘ్నాలు కలుగకూడదని మొదటి పూజ ఆయనకు చేస్తారు. ఆయన్ని స్మరించనిదే ఏ పని తలపెట్టరు. అయితే, తులసి ఆకులను మాత్రం ఉపయోగించరు. ఎందుకో తెలుసా?


బుధవారం రోజున వినాయక పూజ చేస్తే మంచి ఫలితాల లభిస్తాయి. కష్టాలు తొలగిపోతాయి. కార్యభంగం, జాప్యం లేకుండా ఉంటుందని నమ్మకం, ఆటంకాలు తొలగిపోయి ఇంట్లో ఐశ్వర్యం నిలిచి ఉంటుంది. వినాయక పూజలో రకరకాల మోదకాలు సమర్పిస్తారు. అంతే కాదు వీటితోపాటు కుంకుమ, అక్షతలు, దర్భలు, పువ్వలు, సుగంధ ద్రవ్యాలు, సింధూరం వంటివన్నీ గణేష పూజలో వాడుతారు. కానీ తులసిని మాత్రం గణేష పూజకు ఉపయోగించరు. అలా ఎందుకు ఉపయోగించరో మీకు తెలుసా? పురాణాల్లో ఈ విషయం గురించి ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.


‘‘నాక్షతైః అర్చయేద్విష్ణుం
న తులస్యా గణాధిపం!’’


అంటే అక్షతలతో విష్ణుమూర్తికి, తులసితో గణపతిని పూజించరాదని శాస్త్ర ప్రమాణం. ఇందుకు పురాణాలలో ఒక కథ ప్రచారంలో ఉంది.


ఒక సారి వినాయకుడు గంగా నది ఒడ్డున తపస్సు చేసుకుంటున్నాడు. అదే సమయంలో ధర్మాధ్వజుడి కుమార్తే తులసి తన వివాహ కోరిక ఫలించేందుకు తీర్థయాత్రలో ఉంటుంది. అనేక తీర్థయాత్రలు చేస్తూ అందులో భాగంగా గంగా తీరానికి చేరుకుంటుంది. గణపతి గంగా తీరంలో తపస్సులో ఉండటాన్ని గమనిస్తుంది. తపస్సు చేస్తున్న గణేషుడు రత్నఖచిత సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అతడి శరీరం సుగంధ ద్రవ్యాల లేపనంతో, మెడలో పారిజాతాల మాలతో, అనేక అందమైన బంగారు, రత్నహారాలతో అలంకరించబడి ఉంది. అతడి నడుముకు ఎర్రని మృదువైన పట్టు వస్త్రం ఉంది.


తులసీ దేవి అతడి అందమైన రూపానికి ఆకర్శితురాలవుతుంది. గణేషుని వివాహమాడాలనే కోరిక మనసులో కలిగింది. ఆమె మనసులోని ఆ కోరిక వల్ల అతడికి తపోభంగం అయ్యింది. తులసి వల్ల తన తపోభంగం జరిగిందని తెలుసుకుని తులసికి తాను బ్రహ్మచారినని, ఆమె కోరికను తిరస్కరించాడు. ఆ తిరస్కారానికి ఆమెకు కోపం వచ్చింది. దీర్ఘకాలం పాటు బ్రహ్మచారిగా ఉండిపొమ్మని శపిస్తుంది. అకారణంగా శాపానికి లోనైన వినాయకుడికి కూడా కోపం వచ్చి తులసిని అసురుడిని భర్తగా పొందుతావని, అతడి చరలో ఉండిపోతావని  శపిస్తాడు.


అది విని తులసి.. గణేషుడిని క్షమించమని వేడుకుంటుంది. గణేష శాపం వల్ల తులసికి చంకచూడుడనే రాక్షసుడితో వివాహం జరుగుతుంది. అతడికి కృష్ణ కవచం ఉందనే గర్వంతో లోక కంటకుడిగా మారి అందరిని బాధిస్తుంటాడు. తులసి పాతివ్రత్య మహత్మ్యం వల్ల అతడిని సంహరించడం విష్ణుమూర్తికి దుర్లభం అవుతుంది. వినాయకుడి సహాయంతో ఆమె పాతివ్రత్యానికి భంగం వాటిల్లేలా చేసి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు విష్ణుమూర్తి. ఆ తర్వాత శ్రీహరి అనుగ్రహం వల్ల తులసి.. మొక్కగా అవతరిస్తుంది. తన పాతివ్రత్య భంగానికి వినాయకుడు కారణమని తెలుసుకుని శిరస్సులేకుండా జీవించమని తులసి శపిస్తుంది. అది తెలుసుకున్న గణపతి తులసి సాన్నిహిత్యాన్ని తాను సహించబోనని ప్రకటించాడు. అందుకే గణేష పూజలో తులసి నిషిద్ధం. కానీ వినాయక చవితి నాడు మాత్రం ఈ నియమానికి మినహాయింపు ఉందని బ్రహ్మవైవర్త  పురాణంలో ఉంది. అందుకే వినాయక చవితి మినహా మరే రోజునా తులసిని వినాయక సేవకు వినియోగించరు.


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.