Vinayaka Chavithi 2022


నలుగుపిండితో వినాయకుడు
గజాసుర సంహారానంతరం...పరమేశ్వరుడు కైలాసం వస్తున్నాడని పార్వతీదేవికి తెలుస్తుంది. ఆ సంతోషంలో పార్వతీ..వంటికి నలుగు పెట్టుకుని స్నానం చేయబోతూ..ఆ నలుగుపిండితో ఓ బొమ్మను తయారుచేసి ప్రాణం పోస్తుంది. ఆ బొమ్మ బాలుడిగా మారుతుంది. ఆ బాలుడ్ని ద్వారం దగ్గర కాపలాగా వుంచి తన అనుమతి లేకుండా ఎవ్వరినీ లోనికి రానివ్వద్దని చెబుతుంది. కాసేపటికి అక్కడకు చేరుకున్న పరమశివుడు లోపలకు వెళుతుండగా ద్వారం వద్ద ఉన్న బాలుడు అడ్డుకుంటాడు. లోపలకు వెళ్ళాలి అడ్డు తొలగమంటాడు శివుడు చాలాసార్లు చెబుతాడు. తల్లి ఆజ్ఞ మీరని ఆ బాలుడు శివుడిని లోనికి ప్రవేశించనివ్వడు. ఆగ్రహంతో శివుడు తన త్రిశూలంతో బాలుడి శిరస్సు ఖండిస్తాడు. ఇంతలో అక్కడకు వచ్చిన పార్వతీదేవి బిడ్డ అలా పడిఉండండ చూసి శోకిస్తుంది. అప్పుడు గజాసురుడి తలను బాలుడికి అతికింది ప్రాణం పోస్తాడు. అలా గజాననుడయ్యాడు.
అందుకే 
అ గజానన పద్మార్కం గజాననమహర్నిశం।
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే।।
...అంటూ వినాయకుడిని స్తుతిస్తాం.


Also Read: వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే ఏమవుతుంది, ఈ రోజున తప్పనిసరిగా చదువుకోవాల్సిన కథలివే!


ఏనుగుతల పెట్టకముందు వినాయకుడు ఎలా ఉండేవాడంటే!
గణనాథుని తలచుకోగానే పెద్దపెద్ద చెవులూ, తొండం, ఏక దంతంతో గజముఖమే కళ్లముందు సాక్షాత్కారం అవుతుంది. కానీ బొజ్జలేని గణపతిగా…. పార్వతిదేవి బొమ్మను తయారు చేసి ప్రాణం పోసిన సుందర రూపుడిని ఎవరైనా చూశారా? అయితే ఆ గణపయ్యను దర్శించుకోవాలంటే తమిళనాడులోని ఆదివినాయక ఆలయానికి వెళ్లాలి. దీన్నే నరముఖ వినాయక ఆలయం అంటారు.




ఆలయ విశిష్టత
తిలతర్పణపురి అనే గ్రామంలో వున్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వర ఆలయం ఇది. పితృదోషాలతో బాధపడుతున్నవారు  ఇక్కడ కొలువైన నరముఖ వినాయకుడిని దర్శించుకుని ఆ దోషాల నుంచి విముక్తి పొందుతారని చెబుతారు. ఈ ఆలయంలో శ్రీరామచంద్రుడు  తన తండ్రి అయిన దశరథుడికి పితృకార్యక్రమాలు నిర్వహించాడట. దేశం మొత్తం ఎన్నిచోట్ల తిరిగి….పితృకార్యం నిర్వహించినా దశరథుడికి ముక్తి లభించకపోవడంతో పరమశివుడుని ప్రార్థించాడట. ముక్తీశ్వరాలయంలో ఉన్న కొలనులో స్నానమాచరించి తండ్రికి తర్పణాలు వదలమని శివుడు చెప్పాడట. అప్పటి నుంచే ఈ ఊరికి తిలతర్పణ పురి అనే పేరు వచ్చిందని చెబుతారు. తిలం అంటే నువ్వులు, తర్పణాలు అంటే వదలటం, పురి అంటే స్థలం.


ఈ ఆలయం ముఖ్యంగా భారతదేశంలోనే 7 ప్రముఖ స్థలాలుగా చెప్పుకునే కాశీ, రామేశ్వరం, శ్రీవాణ్యం తిరువెంకాడు, గయ, త్రివేణి సంగమంతో సరిసమానమైన స్థలంగా భావిస్తారు . అందుకే ఎవరైతే పెద్దలకు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించలేక బాధపడతారో వాళ్లు ఈ ఆలయాన్ని దర్శించి తర్పణాలు వదలితే ఆ దోషాల నుంచి విముక్తి పొందుతారని చెబుతారు.


Also Read: వినాయక చవితి పూజ ఇలా ఈజీగా చేసేసుకోండి! Part-1


నరముఖ గణపతి
నరముఖంతో ఉన్న గణపతి అంటే...శివుడు వినాయకుడి శిరస్సు ఖండించక ముందున్న రూపం అన్నమాట. అందుకే తొండం లేకుండా బాలగణపతి రూపంలో మనిషి ముఖంతో ఉంటాడు. అందుకే నరముఖ గణపతి, ఆది వినాయకర్ గణపతి ఆలయంగా చాలా ప్రసిద్ధి చెందింది. తమిళనాడులోని తిరునల్లార్ శనిభగవానుని ఆలయానికి 25కిలోమీటర్ల దూరంలో….కూతనూరు సరస్వతీ ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది ఆ ఆలయం.పితృకార్యాలు చేయలేకపోయాం అని బాధపడేవారు...ఈ నరముఖ గణపతి ఆలయానికి వెళ్లి తర్పణాలు వదిలితే చాలంటారు పెద్దలు.