Rains in Telangana AP: ఉపరితల ఆవర్తనం దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. దక్షిణ బంగాళాఖాతంలో నుంచి ఏపీ దక్షిణ ప్రాంతం వరకు 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఇది క్రమంగా దక్షిణవైపు కదులుతోంది. ఉత్తర కర్ణాటక నుంచి కొమోరిస్ ప్రాంతం వరకు, దక్షిణ కర్ణాటక మరియు తమిళనాడు మీదుగా ఉన్న సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. వీటి ఫలితంగా ఏపీ, తెలంగాణ, యానాంలో ఆగస్టు 31 వరకు వర్షాలు కురవనున్నాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది భారత వాతావరణ కేంద్రం.  


తెలంగాణలో ఆ జిల్లాల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగస్టు 29న మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.






నేడు (ఆగస్టు 30న) నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేట, యాదాద్రి భువనగరిరి, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి మెదక్, కామారెడ్డి, వనపర్తి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలలో అక్కడక్కడ వర్ష సూచన ఉంటడంతో ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ కేంద్రం. హైదరాబాద్ నగరంలో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. వాయువ్యం, ఉత్తర దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.






ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో వర్షాలు..
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ ప్రాంతాల్లో నేటి నుంచి మరో రెండు రోజులపాటు ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం పడుతుంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. 


దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇలా..
దక్షిణ కోస్తాంధ్రకు మోస్తరు వర్ష సూచన ఉండగా.. రాయలసీమ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురవనున్నాయని అమరావతి వాతావరణ కేంత్రం తెలిపింది. చిత్తూరు, అనంపురం జిల్లాల్లో మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో తేలికపాటి జల్లులు పడతాయని అధికారులు అంచనా వేశారు. 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచనున్నాయి.