importance and significance of  Gangamma Jatara :  మగవాళ్లంతా చీరలు కడతారు అందంగా అలంకరించుకుంటారు..ఆడవారంతా మగరాయుడిలా మారిపోతారు...అమ్మోరు తల్లిగా కొందరు.. రాక్షసులుగా మరికొందరు..మీసకట్టుతో పిల్లలు...దుస్తులకు బదులు వేప మండలు చుట్టుకుని మరికొందరు..డప్పు చప్పుళ్లు, చిత్ర విచిత్ర వేషాలు...వారం రోజల పాటూ ఎక్కడ చూసినా పూనకాలు లోడింగ్ అన్నట్టే ఉంటుంది. ఇలా ఉండటమే గంగమ్మకి ఇష్టమట..అలా ఉంటేనే అమ్మవారి కరుణా కటాక్షాలు ఉంటాయట. తిరుపతి గంగమ్మ భక్తుల విశ్వాసం అది. దీనిని తాతగట్టు జాతర అనికూడా అంటారు. ఇంతకీ ఈ వేషాలన్నీ ఎందుకేస్తారు..ఆ తిట్టుకోవడం ఏంటి.. చీపుర్లతో కొట్టుకోవడం ఏంటో తెలియాలంటే గంగమ్మ జాతర వెనుకున్న ఆంతర్య తెలుసుకోవాలి...


Also Read: సింహాద్రి అప్పన్నకు ఏడాదికోసారి చందనోత్సవం ఎందుకు చేస్తారు, ఈసారి ఎప్పుడొచ్చింది!


ఏటా డిసెంబరు నెల వచ్చేసరికి గంగమ్మ జాతర గురించి చర్చల సందడి మొదలైపోతుంది. జాతర జరిగేది మే నెల మొదటి మంగళవారం అయినప్పటికీ...దాదాపు 4 నెలల ముందుగానే..అంటే డిసెంబరులో వచ్చే రెండో ఆదివారం అర్థరాత్రి చాటింపు వేసి తేదీలు ప్రకటించేస్తారు. ఎందుకంటే..ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా జాతర సమయానికి స్వస్థలాలకు చేరుకోవాలన్నది ఓ కారణం కాగా... వారం పాటూ వైభవంగా జరిగే జాతరకు ఏర్పాట్లు చేసుకోవాలంటే ఆమాత్రం సమయం ఉండాలి మరి. వందల సంవత్సరాలుగా సాగుతూ వస్తున్న ఈ జాతరకు కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు...ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రవాసులు కూడా భారీగా తరలివస్తారు. 


తిరుమల వేంకటేశ్వరుడికి చెల్లెలు గంగమ్మ


తిరుపతి నగరంలో కొలువు తీరిన ఏడుగురు అక్కా చెల్లెళ్ళు అంకాళమ్మ, మాతమ్మ, ఉప్పంగి మారెమ్మ, తాళ్ళపాక పెద గంగమ్మ, ముత్యాలమ్మ, వేషాలమ్మ, గంగమ్మలకు జాతర కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు. గంగమ్మను శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలిగా భావిస్తారు. అందుకే టీటీడీ తరపున అమ్మవారికి పట్టుచీర సమర్పిస్తారు అధికారులు. మే నెల మెుదటి మంగళవారం అర్థరాత్రి కైకా వంశీయుల ఆధ్వర్యంలో చాటింపు కార్యక్రమంతో జాతర మెుదలవుతుంది..ఆ తర్వాత మంగళవారానికి జాతర పూర్తవుతుంది. అయితే ఈ వారం రోజులు మాత్రం ఊర్లోంచి ఎవ్వరూ పొలిమేర దాటి వెళ్లరు. 


Also Read: అక్షయ తృతీయ ఎప్పుడు (ఏప్రిల్ 22 or ఏప్రిల్ 23) జరుపుకోవాలి, ఈ రోజుకున్న ప్రత్యేకత ఏంటి!


చిత్ర విచిత్ర వేషాలు ఎందుకేస్తారంటే!


రాయలసీమలో పాలేగాళ్ళ రాజ్యం నడుస్తున్న రోజుల్లో తిరుపతిని పాలించే పాలెగాడి అరాచకత్వానికి అంతుండేది కాదు. తిరుపతి పాలెగాడి కన్నుపడిన  మహిళా తప్పించుకునే అవకాశం ఉండేది కాదు. ఆ కామాంధుడి బారినుంచి మహిళలను తప్పించేందుకు ప్రజలు నానా కష్టాలు పడేవారు. తిరుపతికి సమీపం అవిలాల గ్రామంలోని కైకాల కులస్థుల ఇంట్లో పుట్టిన ఓ ఆడబిడ్డను తిరుపతికి చెందిన ఓ వ్యక్తి దత్తత తీసుకున్నాడు..ఆమె పేరు గంగమ్మ. ఓ సారి పాలిగాడి కన్ను గంగమ్మపై పడింది... ఆమెను బలవంతం చేయబోతుండగా ఉగ్రరూపం దాల్చిన గంగమ్మ పాలెగాడిని సంహరించేందుకు వెంటాడింది. భయపడిన పాలెగాడు దాక్కున్నాడు..తనని బయటకు రప్పించేందుకు వారం రోజుల పాటూ రకరకాల వేషాలు వేసుకుని వెతికింది గంగమ్మ. బైరాగిగా, మాతంగిగా ఇంకా రకరకాల వేషాలు వేసుకుని తిరిగింది. చివరిగా దొర వేషంలో వెళ్లడంతో...తన దొరే వచ్చాడనుకుని పాలెగాడు బయటకు రావడంతో విశ్వరూపం చూపిన గంగమ్మ ఆ రాక్షసుడిని సంహరించింది. మరుసటి రోజు మాతంగి వేషధారణలో వెళ్లి పాలెగాడి భార్యని ఓదార్చుతుంది. దుష్టుడైన పాలెగాడిని సంహరించిన గంగమ్మ తల్లిని శక్తి స్వరూపిణిగా భావించి జాతర చేయడం ప్రారంభించారు. 


అమ్మవారి అనుగ్రహం దక్కాలంటే


అమ్మవారి అనుగ్రహం దక్కాలంటే చెడుని సంహరించేందుకు రకరకాల వేషధారణలో అమ్మవారు తిరిగినట్టే ఆ వారం రోజులు జనం కూడా అలాగే ఉంటారు. అలా ఉంటేనే అమ్మ కృపకు పాత్రులవుతాం అని భావిస్తారు. మహిళలంతా వీధుల్లో ఆడిపాడుతారు,మగవారంతా చీరలు కడతారు, రకరకాలుగా తయారవుతారు...(పుష్ప 2 బన్నీ లుక్ కూడా ఇదే), పిల్లలంతా మీసాలు పెట్టుకుని పెద్దవారైపోతారు.. కనిపించిన వారిని బూతులు తిడుతుంటారు, చీపుర్లు-చేట్లతో కొడుతుంటారు. పాలెగాడి పనిపట్టిన గంగమ్మకు మొక్కులు చెల్లిస్తే ఎంత పెద్ద ఆపదనుంచైనా బయటపడతాం అన్నది అక్కడి ప్రజల విశ్వాసం. అప్పట్లో గంగమ్మను దర్శించుకున్నాకే శ్రీ వేంకటేశ్వర స్వామి దగ్గరకు వెళ్లేవారట..ఇప్పటికీ చాలామంది ఇదే సంప్రదాయం పాటిస్తున్నారు.