Sri Ram Navami 2024 Paaduka Pattabhishekam Special :  ఒక్క సన్నివేశం చాలు...5 నిముషాలు సమయం చాలు..అధికారం పీఠం దక్కుతుందని తెలిస్తే మొత్తం పరిస్థితులు తారుమారు చేసేందుకు అస్సలు తగ్గరు నేటి పాలకులు. తాను గొప్పవారంటే తాము గొప్పవారం అని డబ్బా కొట్టుకోవడమే కానీ వారి వల్ల ప్రజలకు ఏ ఒరిగింది అనేది నిజాయితీగా చెప్పలేని దుస్థితి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజాసంక్షేమం గుర్తొచ్చేపాలకులు ఉన్న ఈ రోజుల్లో... అనుకోకుండా అధికారం చేతికొచ్చినా తిరస్కరించి , సింహాసనంపై సరైనోడిని కూర్చోబెట్టిన భరతుడి గొప్పతనం గురించి చెప్పుకుని తీరాల్సిందే...



  • తాను రాజుగా ఉండాలని అనుకోలేదు

  • అనుకోకుండా అందొచ్చిన సింహాసనం అధిష్టించాలని ఆశపడలేదు

  • అన్నీ అన్నయ్యే అనుకున్నాడు అందుకే తాను లేని రాజ్యానికి పాలకుడిగా వెలగాలని ఆశపడలేదు

  • స్వామి పాదసేవలోనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని నమ్మాడు భరతుడు

  • అందుకే అన్నయ్య పాదుకలు తీసుకొచ్చి సింహాసనంపై పెట్టి పాలన సాగించాడు..

  • తిరిగి రామచంద్రుడు వచ్చిన తర్వాత సింహాసనం అప్పగించాడు


రామాయణగాధ గురించి దాదాపు అందరకీ తెలుసు. కానీ ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు చదివినా ఎక్కడో మనకు తెలియని సన్నివేశం కనిపిస్తుంటుంది. అందుకే ఎన్ని సీరియళ్లు, సినిమాలు వచ్చినా ఇప్పటికీ రామాయణ కథ ప్రత్యేకమే...మొత్తం రామాయణ కథలో పాదుకా పట్టాభిషేకం చాలా చాలా ప్రత్యేకం. వాల్మీకి మహర్షి రాసిన అయోధ్య కాండలో ఉంది ఈ ఘట్టం...


Also Read: రాముడిది ఇలాంటి ఫొటో ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ ఉండదు!


రామాయణంలో అందరూ ఓడిపోయిన సన్నివేశం ఇదే....



  • రాజ్యానికి తిరిగి రావాలన్న భరతుడి కోరిక రామచంద్రుడు అంగీకరించాడా...భరతుడు ప్రయత్నం చేశాడు ఓడిపోయాడు

  • పోనీ రాముడు గెలిచాడా అంటే..పాదుకలు ఇచ్చి పరోక్షంగా తన అధికారాన్ని అంగీకరించి రాముడు ఓడిపోయాడు

  • ఎప్పుడో దాచుకున్న వరాలను కోరిన కైకేయి తన కుమారుడికి పట్టాభిషేకం చేయాలన్న కోరిక నెరవేరిందా అంటే అదీ లేదు

  • శ్రీరాముడికి పట్టాభిషేకం చేసి మురిసిపోవాలి అనుకున్న దశరథుడి కోర్కె నెరవేరిందా అంటే అదీ లేదు...


Also Read: మూడు పూటలా మూడు శ్లోకాలు చాలు - సమస్యలన్నీ తీరిపోతాయ్!


వనవాసానికి రాముడు


సీతతో వివాహం తర్వాత అయోధ్యలో అడుగుపెట్టిన రాముడికి పట్టాభిషేకం చేసేందుకు ఏర్పాట్లు చేశాడు దశరథుడు. మంథర మాటలు విన్న కైకేయి వరాలు కోరి...భరతుడికి పట్టాభిషేకం చేయమని కోరి రాముడిని వనవాసానికి పంపించమంది. తండ్రి ఆజ్ఞ అని తెలిసిన రాముడు అడవులకు పయనం అయ్యేముందు...తల్లి కౌశల్య మందిరానికి వెళ్లి ఈ విషయం చెప్పి...జరిగిన సన్నివేశానికి కలవరపాటు చెందకుండా రాజ్యానని స్వీకరించి ధార్మిక పరిపాలన సాగించాలని నేను కోరుకున్నాను అని భరతుడికి చెప్పమని చెప్పి వనవాసానికి వెళ్లిపోయాడు. 


Also Read: రామచంద్రుడి నుదుట సూర్యుడు - అయోధ్య రామ మందిరంలో అద్భుతం ఈ ఏడాది శ్రీరామ నవమికే!


ఇది కదా భరతుడి గొప్పతనం


మేనమామ ఇంటినుంచి భరతుడు అయోధ్యకు వచ్చేసరికి ఆనంద నగరం పూర్తిగా నిశ్శబ్దంగా ఉంది. ప్రజలంతా విచారంగా కనిపించారు. రాజభవనం కళతప్పింది. తల్లి కైకేయి గదికి చేరుకున్న భరతుడికి మొత్తం వివరించిన కైకేయి...పట్టాభిషేకానికి సిద్ధమవమని కోరింది. మొత్తం విన్న భరతుడు చలించిపోయాడు.  బాధతో మునిగిపోయాడు. కోపంగా తల్లి మాటను తిరస్కరించాడు. తండ్రి అంతిమ సంస్కారాల తరువాత... రాజ్య బాధ్యతలు స్వీకరించమని వశిష్టుడు చెప్పినా కానీ భరతుడు అంగీకరించలేదు. సభలో కన్నీళ్లు పెట్టుకున్న భరతుడు శ్రీరాముడు మాత్రమే సింహాసనానికి సరైన వారసుడు అని..తన తల్లి మోసపూరిత ప్రణాళికలతో తనకు సంబంధం లేదని చెప్పాడు. రాముడిని అయోధ్యకు తిరిగి రమ్మని ఒప్పించేందుకు తనతో పాటు అడవికి రావాలని అందర్నీ అభ్యర్థించాడు. కైకేయికి కూడా తాను చేసిన తప్పు అర్థమైంది...


Also Read: Sri Rama Navami Date 2024: శ్రీరామ నవమి ఎప్పుడొచ్చింది - రాముడు నవమి తిథిరోజే ఎందుకు జన్మించాడు!


రాముడికోసం తరలివెళ్లిన పరివారం


భరతుడు , శత్రుఘ్నుడు, వశిష్ట మహర్షి, రాజమాతలు , అయోధ్య ప్రజలు అడవికి వెళ్లి రాముడు, సీత మరియు లక్ష్మణుడు ఉన్న చిత్రకూటానికి చేరుకున్నారు. భరతుడు రాముడిని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి తన అన్న పాదాలపై పడి తనని తాను నిందించుకున్నాడు. రాముడు తనని ఆప్యాయంగా పైకి లేపి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత అడవిలోనే సభ ఏర్పాటు చేశారు. భరతుడు తన వినయపూర్వకమైన అభ్యర్థనను ముందుంచాడు..రాముడిని తిరిగి రమ్మని ఒప్పించడానికి ప్రయత్నించాడు. కానీ రాముడు మత్రం తండ్రిమాటను వెనక్కు తీసుకునేదే లేదని చెప్పేశాడు.
భరతుడు: “ప్రియమైన సోదరా, నీకు చెందిన సింహాసనంపై నేనెలా కూర్చోగలను? మీరు మాత్రమే రాజ్యానికి సరైన వారసుడు ..మీకు ప్రత్యామ్నాయంగా నేను వనవాసం చేస్తాను
రాముడు: సరే! నేను నీ నుంచి రాజ్యాన్ని స్వీకరిస్తున్నాను. అయోధ్య రాజుగా, నేను ఇప్పుడు పాలనా బాధ్యతలు నీకు అప్పగిస్తున్నాను...నా తరఫున 14 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తావు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత, నేను వచ్చి రాజ్యాన్ని తిరిగి తీసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను 
భరతుడు: నీ పాదుకలను నాకు ఇవ్వు. తిరిగి వచ్చే వరకు నేను మీ పాదుకలకు , ప్రజలకు సేవ చేస్తాను. మీ గౌరవం,  కీర్తిని దృష్టిలో ఉంచుకుని రాజ్య ప్రజల పట్ల నా విధులను  ఉత్తమంగా నిర్వర్తిస్తాను
రాముడు: భరతుడి ప్రేమ, భక్తి, స్థిరత్వం చూసి రాముడి హృదయం కరిగిపోయింది. ఆనందంతో ఉప్పొంగిపోయింది. భరతా, నీలాంటి సోదరుడు లభించడం నిజంగా నేను అదృష్టవంతుడిని ధన్యుడిని అంటూ పాదుకలు అప్పగించాడు...


Also Read: Effects of Shani Dev 2024 to 2025: ఈ ఏడాదంతా ఏల్నాటి శని, అష్టమ శని ఉన్న రాశులివే!


శ్రీరాముని పాదుకలను భక్తిపూర్వకంగా తలపై మోస్తూ, తన హృదయంలో భగవంతుని ప్రేమతో కూడిన హామీతో అయోధ్య సింహాసనంపై పాదుకలకు పట్టాభిషేకం నిర్వహించాడు భరతుడు. 14 ఏళ్లపాటూ భరతుడు కూడా రాజభోగాలు విడిచిపెట్టి విధులు నిర్వర్తించాడు. వాగ్దానం చేసినట్లు, సరిగ్గా 14 సంవత్సరాల తర్వాత రాముడికి రాజ్యాన్ని అప్పగించాడు. 


అంత గొప్ప భరతుడి గురించి ఎంత చెప్పుకుంటే సరిపోతుంది... ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తిని జల్లెడపట్టి వెతికినా గుర్తించగలమా? అందుకే భక్తి ఉందని చెప్పుకోవం కాదు పురాణ పురుషులను ఏ మేరకు అనుకరించాం అన్నదే ముఖ్యం...