Mutharamman Temple - Kulasekharapatnam: దేశంలోని మిగతా చోట్ల ఎంతో వైభవంగా రంగు రంగులుగా  దసరా పండుగలు జరుగుతూ ఉంటాయి. అయితే తమిళనాడులోని  తూతుకుడి జిల్లాలో జరిగే  కులశేఖర పట్నం ముత్తరమ్మన్ దసరా మాత్రం ఉపవాసాల దసరాగా పేరు. దక్షిణ భారతదేశంలో  మైసూర్ దసరా తర్వాత అంత పాపులర్ ముతరమ్మన్ దసరానే. ఈ దసరా కోసం పస్తులు ఉంటామని భక్తులు మొక్కుకుంటారు.


తమిళనాడులోని  వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు  దసరా వచ్చేలోపు  91 రోజులు, 47రోజులు, 41రోజులు, 31రోజులు, 21రోజులు,11రోజులు ఇలా ఓపిక కు తగ్గట్టుగా ఉపవాసాలు ఉంటామని ముత్తు రమ్మన్ కు మొక్కుకుంటారు. ఉపవాసాలు చేసి సరిగ్గా దసరా సమయానికి లక్షల సంఖ్యలో  కులశేఖర పట్నం చేరుకుంటారు. ఇక్కడ అమ్మవారు ముతరమ్మన్ గా దర్శనమిస్తే శివుడు "జ్ఞాన మూర్తి " రూపం లో కనిపిస్తాడు. ఆ విగ్రహాలకి ముందు  స్వయంభువుడిగా లింగ రూపంలో కూడా  శివుడు కొలువై ఉంటాడు.


Also Read: శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రి దేవిగా దుర్గమ్మ - ఈ అలంకారం విశిష్టత, సమర్పించాల్సిన నైవేద్యం!


చర్మవ్యాధులు,  మానసిక సమస్యలు తొలగించే ముత్తురమ్మన్ 


కులశేఖర పట్నంలో  ఈ దేవాలయం చర్మ వ్యాధులు తొలగించమని ప్రార్థించేందుకు వచ్చే  భక్తులతో నిండి ఉంటుంది. ముఖ్యంగా స్మాల్ ఫాక్స్, కుష్టు, మానసిక సమస్యలతో బాధపడేవారు ముత్తు రమ్మన్ ఆలయంలో వ్రతం చేస్తే కోలుకుంటారనేది ఇక్కడి నమ్మకం. ఆలయంలో అమ్మవారు మెడలో మంగళ సూత్రంతో  కుడికాలు మడుచుకుని కనిపిస్తే జ్ఞానమూర్తి మాత్రం ఎడమకాలు ముడుచుకుని ఒక చేతిలో శూలం మరో చేతిలో విభూతితో దర్శనమిస్తారు. ఇక ఆలయం వెలుపల  మండపంలో పెచ్చియమ్మన్,కురప్పస్వామి, భైరవర్ విగ్రహాలు విచిత్రంగా, ఉగ్రరూపంలో ఉంటాయి.


మహిషాసురుడి కథే... కానీ మరో విధంగా 


కులశేఖర పట్నం  దసరా ఉత్సవాలు వెనక చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. సౌత్ ఇండియాలో ఫేమస్ అయిన మహిషాసుర వధ కథనే ఇక్కడ మరో యాంగిల్ లో చెప్పుకుంటారు. పూర్వకాలంలో  అగస్త్య మహర్షిని  "వరముని " అనే ఋషి అవమానించడంతో ఎద్దు తల,మనిషి శరీరంతో రాక్షసుడుగా మారిపొమ్మని  ఆగస్త్యుడు శపించాడట. శాప విమోచనం కోరడంతో పార్వతీదేవి వల్ల విమోచనం కలుగుతుందని అగస్త్యుడు చెబుతాడు. అలా వరముని... మహిషాసురుడిగా మారిపోయి లోకాలను పీడించడం ప్రారంభించాడు. దేవతలు శివుని వద్దకు వెళ్లి కాపాడమని కోరగా...పార్వతి వల్లనే సాధ్యం అవుతుందని చెప్పి..ప్రార్థించమని సూచించాడు. 


Also Read: కాకతీయ వారసులు జరిపే బస్తర్ దసరా గురించి తెలుసా!


దేవతలు  తపస్సు చేస్తుండగా వారికి రక్షణగా ముత్తరమ్మన్ కాపలా కాసేదట.  అదే సమయంలో మహర్షులు యాగం చేయడంతో ఆ యాగంలో నుంచి ఓ చిన్నారి ఉద్భవించింది. ఆమె కేవలం తొమ్మిది రోజుల్లో పెద్దదై పదవ రోజున "పరాశక్తి లలితాంబిక" గా మారి మహిషాసురున్ని వధించింది. దానితో వరమునికి శాప విమోచనం దొరికింది. ఆ వధ జరిగిన రోజే దసరా.  చిన్నారి జన్మించి...దేవతగా మారిన తొమ్మిది రోజులను ఇక్కడ నవరాత్రుల పూజగా జరుపుకుంటారు.  


Also Read: దేవీనవరాత్రులు ప్రారంభం , కలశ స్థాపన - ఈ తొమ్మిది రోజులు తప్పనిసరిగా చదువుకోవాల్సిన స్తోత్రం ఇది!


దుర్గా గాయత్రి


ఓం గిరిజాయై విద్మహే శివప్రియాయై ధీమహి తన్నోదుర్గా ప్రచోదయాత్