Onam Festival 2023: ఏటా పది రోజుల పాటూ ఓనం వైభవం చూడడానికి రెండు కళ్లు సరిపోవు. మొదటి రోజును అతమ్‌గా, చివరి రోజైన పదోరోజును తిరు ఓనమ్ అని అంటారు. పది రోజుల పండుగలో ఈ రెండు రోజులూ చాలా ముఖ్యమని భావిస్తారు కేరళీయులు. కేరళ సంస్కృతి,సంప్రదాయాలు ప్రతిబింబించే ఓనంకు 1961 లో  జాతీయ పండగగా గుర్తింపు లభించింది. ఈ ఏడాది ఆగస్టు 20  అతమ్ ఆగష్టు 29 న తిరు ఓనమ్.


ఓనం ఎందుకు జరుపుకుంటారు
పాతాళలోకాధిపతి అయిన బలిచక్రవర్తిని భూమిపైకి ఆహ్వానిస్తూ పది రోజుల పాటూ జరుపుకునే పండుగ ఇది. మహాబలి పాలించిన సమయం మళయాలీలకు స్వర్ణ యుగంతో సమానం.  బలిచక్రవర్తి పాలనలో రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్థిల్లారని చెబుతారు. అందుకే రాక్షస రాజు అయినప్పటికీ బలిచక్రవర్తిని గౌరవించేవారు. అందుకే బలిచక్రవర్తితో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ పదిరోజుల పాటూ మహాబలిని పాతళలోకం నుంచి భూమ్మీదకు అహ్వానిస్తూ జరుపుకునే ఓనం జరుపుకుంటారు. ఇదే వేడుగను కొన్ని రాష్ట్రాల్లో వామన జయంతిగా జరుపుకుంటారు. 


Also Read: రాఖీ పండుగ రోజు మాత్రమే తెరిచి ఉండే ఆలయం ఇది!


ప్రహ్లాదుడి మనవడే బలిచక్రవర్తి
బలిచక్రవర్తి,మహాబలి అంటే ఇంకెవరో కాదు.. శ్రీ మహావిష్ణువు మహా భక్తుడైన ప్రహ్లాదుడి మనవడు. తాత ప్రహ్లాదుడి ఒడిలో విద్యాబుద్ధులు నేర్చుకోవడంతో మహాబలి కూడా గొప్ప విష్ణుభక్తుడిగా పెరిగాడు. బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి దానధర్మాలు చేసి అత్యంత శక్తివంతుడై ఇంద్రుడిపై దండెత్తి ఇంద్రలోకాన్ని ఆక్రమిస్తాడు. స్వర్గం మీదకు దండెత్తిన బలిని నిలువరించడం ఎవరి తరమూ కాలేదు. దేవతలంతా చెల్లాచెదురైపోయారు. తమను రక్షించమంటూ వెళ్లి  శ్రీ మహా విష్ణుని శరణువేడారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తాను అదితి అనే రుషిపత్ని గర్భాన జన్మిస్తానని వరమిచ్చాడు. అలా భాద్రపద శుద్ధ ద్వాదశి నాడు అదితి గర్భాన వామనుడిగా జన్మించిన నారాయణుడు....బలి దగ్గరకు వెళతాడు. 


Also Read: ఆగష్టు 30 or 31 రక్షాబంధన్ ఎప్పుడు, రాఖీ పండుగ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు!


పాతాళానికి బలి
వామనుడికి అతిథి మర్యాదలు చేసిన బలిచక్రవర్తి..ఏం కావాలని అడుగుతాడు. వామనుడు మూడు అడుగుల స్థలం కోరతాడు. అందులోని ఆంతర్యం తెలియక సరేనని మాటిస్తాడు మహాబలి. అప్పుడు వామనుడు భూమి మీద ఒక అడుగు, ఆకాశం మీద ఒక అడుగు పెట్టి మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడుగుతాడు. ఆ మూడో అడుగు తన తల మీద పెట్టమంటాడు బలిచక్రవర్తి. అలా బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేస్తాడు వామనుడు. అయితే బలి దాన గుణానికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఏటా కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్టు వరమిస్తాడు. అలా బలిని భూమ్మీదకు ఆహ్వానిస్తూ జరుపుకునేదే కేరళలో ఓనం పండుగ. బలిచరక్రవర్తిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు రంగురంగుల పూలతో రంగవల్లులు తీర్చిదిద్దుతారు.  ఈ రోజు మహాబలి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి అందరి ఆనందాన్ని స్వయంగా చూస్తాడని విశ్వసిస్తారు. 


Also Read: ఆగష్టు 29 రాశిఫలాలు, ఈ రాశులవారికి ఈ రోజు ఆర్థిక వనరులు పెరిగే అవకాశం ఉంది!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం పండితులు, కొన్ని పుస్తకాల నుంచి సేకరించింది మాత్రమే.  దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.