Gayatri Alankaram Today: శరన్నవరాత్రులలో మూడవ రోజున అమ్మవారు గాయత్రీ దేవిగా దర్శనమిస్తోంది. సకల వేద స్వరూపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి. సకల మంత్రాలకు మూలశక్తి అయిన గాయత్రీ దేవి రూపంలో అమ్మను ఆరాధిస్తే అనంత మంత్రశక్తి, బ్రహ్మజ్ఞానం కలుగుతాయని చెబుతారు. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది.


ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః 
ర్యుక్తామిందు నిబద్దరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం 
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం 
శంఖం చక్రమధార వింద యుగళం హస్తైర్వహం తీం భజే    


ఆదిశంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపంగా అర్చించారు. ప్రాతఃకాలంలో గాయత్రిగానూ, మధ్యాహ్నం సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖం అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణములు చెబుతున్నాయి. గాయత్రీ ఉపాసన వలన బుద్ధి, తేజస్సు పెరుగుతుంది. గాయత్రీ మంత్ర జపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది. ఈ రోజున గాయత్రీ స్తోత్రాలు పారాయణ చేసి రవ్వ కేసరి, పులిహోర లేదా కొబ్బరి అన్నం నైవేద్యంగా సమర్పిస్తారు. గాయత్రి దేవినే చంద్రఘంట అని కూడా పిలుస్తారు. చంద్రఘంట అంటే నవదుర్గల్లో మూడవది.


Also Read: పార్వతి ముచ్చటపడిందని చంద్రుడిని తీసి అలంకరించిన శివుడు, నవదుర్గల్లో మూడవది చంద్రఘంట


గాయత్రి మంత్రం
ఓం భూర్భువః సువః తత్ సవితుర్వ రేణ్యం
భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్" 


ఇందులోని ప్రతి బీజాక్షరం మహిమాన్వితమైంది. ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ప్రార్థించినట్లేనని రుగ్వేదంలో పేర్కొన్నారు. ఈ మంత్రాన్ని ఒక నిర్దిష్టమైన పద్దతిలో జపించినా, విన్నా తద్వారా వెలువడే ధ్వని తరంగాలు మనసుని,శరీరాన్ని ఉల్లాసపరిచి, తేజోవంతం చేస్తాయి. దీన్ని ప్రయోగాత్మకంగా నిరూపించేందుకు చాలామంది ప్రయత్నించి నిజమే అని అంగీకరించారు కూడా. ఈ మంత్రం జపించడం వల్ల మెదడులో ఒక రకమైన ఆనందం, అనుకూల ఆలోచనలు, ఆత్మవిశ్వాసం స్థాయి కూడా పెరుగుతాయని తేల్చారు



  • గాయత్రి మంత్రాన్ని జపించే వారి మెదడులో నిరంతరం ప్రకంపనలను కొనసాగుతున్న అనుభవం పొందుతారు

  • నిత్యం ఈ మంత్రం స్మరిస్తే ఏ పని తలపెట్టినా విజయం సొంతం చేసుకుంటారని పురాణాల్లో పేర్కొన్నారు

  • గాయత్రి మంత్రాన్ని లయబద్ధంగా జపించే వారి తల చుట్టూ దాదాపు లక్ష శక్తి తరంగాలు ఉద్భవిస్తాయి

  • గాయత్రి మంత్రోపాసన ఒక వ్యక్తిని తెలివైనవాడిగా, ధైర్యవంతుడిగా చేసి శక్తి సామర్థ్యాలు నింపుతుంది

  • నాలుక ఉచ్ఛారణ ద్వార కంఠం, అంగుటి, కొండనాలుక, పెదవులు, దంతాలు ఇలా నోటిలో విభిన్న అంగాలను ప్రభావితం చేస్తి.. అక్కడి నుంచి నవనాడుల ద్వారా శరీరం మొత్తం వ్యాపిస్తుంది. అలా శరీరంలో ఉన్న ఏడు చక్రాలపైనా ఈ ప్రభావం పడి ఆ చక్రాలు ఉత్తేజితమవుతాయి.

  • త్రికాలాల్లోనూ గాయత్రీ మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఆరోగ్యం , సంకల్ప బలం , ఏ కాగ్రత, ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుంది.

  • హిందూ ధర్మ శాస్త్రాల్లో ఆత్మశక్తిని ప్రసాదించే మంత్రాలు ఎన్నో ఉన్నప్పటికీ , వాటన్నింటిలో గాయత్రీ మంత్రం సర్వ శ్రేష్ఠమైనది. నాలుగు వేదాల్లో గాయత్రితో సమానమైన మంత్రం ఏదీ లేదని విశ్వామిత్రుడు చెప్పాడు


Also Read: శివయ్య ప్రేమ గెలిచిన బ్రహ్మచారిణి, ఈ అవతారాన్ని పూజిస్తే సంతోషం, సౌభాగ్యం, సంపద