Significance of Margasira Lakshmi Puja:

  2023 డిసెంబరు 13 నుంచి మార్గశిరమాసం ప్రారంభమవుతోంది. ఈ మాసంలో వచ్చే గురువారాల్లో వ్రతం ఆచరిస్తే అప్పుల బాధలు తొలగి, సర్వ సంపదలు కలుగుతాయని పరాశర మహర్షి నారదుడికి చెప్పారు. 


కార్తీకమాసం నెలరోజుల పాటు భక్తిలో మునిగితేలే వారంతా మార్గశిరమాసంలోనూ అంతకుమించి అనేట్టుంటారు.ఈ నెలంతా కూడా ప్రత్యేకమే అయినా గురువారాలు విశిష్టమైనవిగా భావిస్తారు.  శ్రీ మహా విష్ణువుకు ప్రీతిపాత్రమైన మార్గశిరమాసం అంటే శ్రీ మహాలక్ష్మికి కూడా మక్కువ ఎక్కువ. ఈ నెలలో వచ్చే గురువారాలు ఎవరైనా లక్ష్మీ పూజ చేస్తారో వారిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుందని విశ్వశిస్తారు.


మార్గశిర గురువారం పూజ ఎలా చేయాలంటే


మార్గశిర మాసంలో వచ్చే ప్రతిగురువారం లక్ష్మీపూజ చేస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఇంటిముందు కళకళలాడే ముగ్గువేసి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకాలి. తలకు స్నానమాచరించి దేవుడి ముందు ముగ్గువేసి పూజకు అన్నీ సిద్ధం చేసుకోవాలి.  యధావిథిగా తొలిపూజ గణపతికి పూర్తిచేసి ఆ తర్వాత అమ్మవారిని దీప,ధూప,అష్టోత్తరం , నైవేద్యంతో స్త్రీసూక్తం విధానంలో  షోడసోపచార పూజ చేయాలి. పూజా విధానం మొత్తం ఫాలో అవలేని వారు...భక్తితో దీపం వెలిగించి శ్రీ మహాలక్ష్మి అష్టోత్తరం, కనకధారా స్తోత్రం చదువుకున్నా సరిపోతుందంటారు పండితులు.


శ్రీ మహాలక్ష్మి గాయత్రి
ఓం మహాలక్ష్మీ చ విద్మహ విష్ణుపత్నీ చ ధీమహి 
తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్‌”


లక్ష్మీ గాయత్రి పఠించాలి. పూజ పూరైన తర్వాత నైవేద్యం సమర్పించి అప్పుడు మార్గశిర లక్ష్మీవారం క్రతం చెప్పుకుని అక్షతలు తలపై వేసుకోవాలి. 


Also Read: ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి సహా మార్గశిరమాసం ( డిసెంబరు) లో ముఖ్యమైన రోజులివే!


2023 లో మార్గశిర గురువారాలు ఎప్పుడొచ్చాయి - ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి



  • డిసెంబరు 14 మార్గశిర మాసం మొదటి గురువారం - అమ్మవారికి నైవేద్యం పులగం

  • డిసెంబరు 21 మార్గశిర మాసం రెండో గురువారం - అమ్మవారికి అట్లు-తిమ్మనం నైవేద్యం

  • డిసెంబరు 28 మార్గశిరమాసం మూడో గురువారం - అప్పాలు, పరమాన్నం నైవేద్యం

  • జనవరి 04, 2024 మార్గశిర మాసం నాలుగో గురువారం- పులిహోర, గారెలు నైవేద్యం

  • జనవరి 11, 2024 మార్గశిర మాసం ఐదో గురువారం- పూర్ణం బూరెలు నైవేద్యం


గురువారాల పూజ పూర్తైన తర్వాత ఆఖరి వారం ఐదుగురు ముత్తైదువులను ఆహ్వానించి స్వయంగా వండి వడ్డించాలి. అమ్మవారిగా భావించి  దక్షిణ తాంబూలం ఇచ్చి వారి ఆశీస్సులు పొందాలి. 


Also Read: ఇదే ఏడాదిలో మళ్లీ ముక్కోటి ఏకాదశి - న్యూ ఇయర్ కన్నా ముందే వచ్చింది!


ఉద్యాసన ఉండదు
సాధారణంగా ఏ పూజ చేసినా చివర్లో ఉద్యాపన చెబుతారు. అయితే మార్గశిర లక్ష్మివారం వ్రతంలో పూర్తైన తర్వాత అమ్మవారికి ఉద్వాసన చెప్పే ప్రక్రియ ఉండదు. ఉద్వాసన అంటే వెళ్లిరమ్మని అర్థం. లక్ష్మీదేవి ఇంట్లో ఉండిపోవాలని కోరుకుంటారు కానీ వెళ్లిరమ్మని అనరు కదా.. అందుతే ఉద్వాసన చెప్పకూడదంటారు. కొన్ని ప్రాంతాల వారు అమ్మవారికి కూడా ఉద్వాసన చెబుతారు...


Also Read: కార్తీకమాసం ఎప్పటితో పూర్తవుతుంది - ఆఖరి రోజు చదువుకోవాల్సిన కథ ఇదే!


ఈ నియమాలు పాటించండి



  • మార్గశిర నోము నోచే స్త్రీలు  గురువారాల్లో శుచిగా ఉండాలి

  • తలకు నూనె రాసుకోవడం, జుట్టు చిక్కులు తీసుకోవడం చేయరాదు

  • సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో నిద్రపోకూడదు

  • నియమనిష్ఠలతో, భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించాలి


గమనిక: పండితుల నుంచి , కొన్ని పుస్తకాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది...దీనిని ఎంతవరకూ విశ్వసించాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం...