Importance of Bhogi Pallu:  భోగి మంటలతో మొదలయ్యే సంక్రాంతి పండుగ ఆద్యంతం సంబరమే. మొదటి రోజు సూర్యోదయానికి ముందే భోగిమంటలు, ఆ తర్వాత  బొమ్మల కొలువు, సాయంత్రం భోగిపళ్లు. భోగి వేడుకంతా చిన్నారులదే. ఈ రోజున రేగుపళ్లు భోగిపళ్లుగా మారిపోతాయి.  ముత్తైదువులందర్నీ పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. దోసిలి నిండా రేగు పళ్లు, చిల్లర, చెరుకు ముక్కలు, బంతిపూల రెక్కలు కలపి తలమీదుగా దిష్టి తీసి పోస్తారు. ఇంకొందరు దిష్టితీసినవి పిల్లలపై పోయకుండా పడేస్తారు. వాటిలో చాక్లెట్లు, కాయిన్స్ ఉండడంతో..పోటీ పడి మరీ ఏరుకుంటారు పిల్లలు. 


Also Read: సంక్రాంతికి నాన్ వెజ్ తింటున్నారా - పండుగ వేళ మీరు అస్సలు చేయకూడని పనులివే!


రేగుపళ్ల ప్రత్యేకత ఇదే..
సాక్షాత్తూ ఆ నారాయణుడు బదరీ వృక్షం (రేగుచెట్టు) వద్ద ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడనీ, ఆ ఫలాన్ని తింటూ తపస్సు సాగించాడని అందుకే రేగు చెట్టుకి అంత ప్రాధాన్యత అని చెబుతారు. రేగుపళ్లను అర్కఫలం అని కూడా అంటారు. ‘అర్కుడు’ అంటే సూర్యుడు. సూర్యుడు ఉత్తరాయణం వైపు మళ్లే సమయం కావడంతో  ఆయన కరుణాకటాక్షాలు పిల్లలపై ఉండాలనే ఉద్దేశంతో పిల్లలకు భోగి పళ్లు పోస్తారు. పైగా భారతదేశ వాతావరణానికి అనుగుణంగా ఎలాంటి ప్లేస్ లో అయినా రేగు చెట్టు పెరుగుతుంది. ఎండ, వాన అన్నింటినీ తట్టుకుంటుంది. పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి నరనారాయణులు బదరికావనంలో ఘోర తపస్సు చేశారట. ఆ సమయంలో దేవతలు వారి తలల మీద బదరీ ఫలాలని కురిపించారని చెబుతారు. అందుకు ప్రతీకగా  పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపళ్లు పోసే సంప్రదాయం వచ్చిందని కూడా చెబుతారు.


Also Read: ఇంటి ముందు ముగ్గు లేకపోతే అంత అపచారమా - సంక్రాంతికి మరింత ప్రత్యేకం ఎందుకు!


భోగిపళ్లుగా రేగుపళ్లు ఎందుకు!
ఐదేళ్లలోపు పిల్లలకు భోగిపళ్లు పోస్తారు. ఎందుకంటే చిన్నారులకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులూ, జీర్ణవ్యవస్థ బలహీనంగా ఉంటాయి. ఇలాంటి వారికి రేగుపళ్లు అమృతంలా పనిచేస్తాయి. ఎందుకంటే రేగుపళ్లలో విటమిన్ 'సి' ఎక్కువగా ఉంటుంది. ఇవి రోగనిరోధక శక్తి పెంచడమే కాదు జీర్ణసంబంధిత వ్యాధులు, శరీర రుగ్మతనలనూ నివారించేందుకు ఉపయోగపడుతుంది. రేగు పళ్లను పిల్లల తల మీద పోయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్య ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. తలపై భాగంలో ఉండే బ్రహ్మరంధ్రం ప్రేరేపితమైన జ్ఞానం పెరుగుతుందని చెబుతారు. 


Also Read: సంక్రాంతికి మీరు పాటించాల్సిన 5 విషయాలు!


ఇక రేగుపళ్లతోపాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల కూడా క్రిమికీటకాలు దరిచేరవని చెబుతారు. ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే. పైగా ఇవి చర్మానికి తగిలితే చర్మసంబంధమైన వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకే రేగుపళ్లలో బంతిపూల రెక్కలను ఉపయోగిస్తారు. 


నిజంగా దిష్టిపోతుందా!
నర దిష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు. ముఖ్య పసిపిల్లలకు దిష్టి తగలడం సహజం. అందుకే.. వారికి అప్పటివరకూ ఉన్న దిష్టి మొత్తాన్ని తీసి పారేయడమే భోగి పళ్లు పోయడం వెనుక ముఖ్య ఉద్దేశం అని చెబుతారు. సాయంత్రం పిల్లలతో సంది గొబ్బెళ్లు పెట్టించి భోగిపళ్లు పోస్తారు.