Karthika Pournami Jwala Thoranam Date and Significance:  ఈ ఏడాది (2023) కార్తీక పౌర్ణమి, జ్వాలాతోరణం నవంబరు 26 ఆదివారం వచ్చాయి


హరిహరులకు ఎంతో ప్రీతికరమైన కార్తీక మాసంలో ప్రతిరోజూ ప్రత్యేకమే అయినప్పటికీ కార్తీక పౌర్ణమికి మరింత ప్రాముఖ్యత ఉంది. ఇదే రోజు  సాయంత్రం వెలిగించే జ్వాలాతోరణానికి మరింత విశిష్టత ఉంది. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పెట్టి ఓ కర్రను అడ్డంగా వాటిపై పెట్టి.. ఎండుగడ్డిని తోరణంలా కడతారు. దీనిని యమద్వారం అంటారు. ఈ గడ్డిపై నెయ్యిపోసి మంట వెలిగిస్తారు..ఆ జ్వాల కిందనుంచి పరమేశ్వరుడిని పల్లకిలో మూడుసార్లు ఊరేగిస్తారు. 


Also Read: క్షీరాబ్ధి ద్వాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన వ్రత కథ!


జ్వాలా తోరణం ఎందుకు?
మరణానంతరం యమలోకంలో అడుగుపెట్టిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం. యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి అగ్ని తోరణం గుండానే లోపలకి అడుగుపెడతారట. పాపాత్ములకు వేసే ప్రథమ శిక్ష ఇదే అని..ఈ శిక్షను తప్పించుకోవాలంటే పరమేశ్వరుడిని ప్రార్థించడం ఒక్కటే మార్గం అంటారు. అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఎవరైతే ఈ యమద్వారం నుంచి మూడు సార్లు అటు ఇటూ వెళ్ళి వస్తారో వారికి యమలోకంలో అడుగుపెట్టాల్సిన అవసరం లేకపోవడమే కాదు..శివ శాయుజ్యం పొందుతారని  చెబుతారు. జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిచే అవకాశం వస్తే.. శివా..ఇప్పటి వరకూ చేసిన పాపాలు ఈ మంటల్లో కాలిపోవాలి..ఇకపై ఎలాంటి తప్పుచేసే పరిస్థితి రాకుండా సన్మార్గంలో నడిచేలా చేయమని నమస్కరించాలి. ఈ జ్వాలతోరణాన్ని దర్శించుకుంటే సకలపాపాలు నశిస్తాయని, జ్వాలాతోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయని, జ్వాలాతోరణ దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని పండితులు చెబుతారు.


క్షీరాబ్ధి ద్వాదశి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి


జ్వాలాతోరణ మహోత్సవాన్ని శ్రీనాథుడు ఇలా వర్ణించాడు
' కార్తీకపౌర్ణమివేళ భీమశంకరుని నగరమందు
దూరునెవ్వాడు చిచ్చుర తోరణంబు
వాడు దూరడు ప్రాణ నిర్వాణవేళ
ఘోర భీకర యమద్వార తోరణంబు..’’


ఆ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డి తీసుకొచ్చి - ఇంటి చూరులోనో, గడ్డివాములోనో, ధాన్యాగారంలోనో పెట్టేవారు. ఈ గడ్డి ఉన్నచోట భూతప్రేత ఉగ్రభూతాలు ఇంటిలోకి రావని..ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం.


Also Read: శ్రీ మహావిష్ణువు దశావతారాలకు క్షీరాబ్ధి ద్వాదశికి ఏంటి సంబంధం, తులసి ఉసిరికి ఎందుకు పెళ్లిచేస్తారు!


కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః!
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః!!


వెలిగించి దీప శిఖలో పరమేశ్వరుడిని కానీ, శ్రీ మహావిష్ణువును కానీ ఆవాహనం చేసి అక్షతలు వేసి నమస్కరించాలి. జ్వాలా తోరణం రోజు వెలిగించిన దీపం చాలా గొప్పది. ఆ వెలుతురు పడినా చాలు కీటాశ్చ - పురుగులు; మశకాశ్చ - దోమలు, ఈగలు ... దీపం వైపు ఎగిరివచ్చే వీటన్నింటికీ మోక్షం లభించాలని నమస్కరించాలి. దీపం వెలుతురు ఎంత దూరం పడుతోందో ఈ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో ఆఖరికి చెట్లు కూడా అవన్నీ కూడా భగవంతుణ్ణి  చేరుకోవాలని కోరుతూ దీపానికి నమస్కరించాలి. 


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply