సంక్రాంతి పండుగ ప్రారంభానికి  నెల ముందు నుంచే పండుగ శోభ మొదలైపోతుంది.  ధనుర్మాసం ప్రారంభంలోనే వేడుకలు, సంబరాలు ప్రారంభమవుతాయి. తెలుగు లోగిళ్లన్నీ రంగవల్లులతో కళకళలాడుతుంటాయి. రంగులు నింపిన ముగ్గుల మధ్య గొబ్బిళ్లు చేసి వాటిపై గుమ్మడి, బంతి, చామంతి పూలతో అలంకరించి..పసుపు-కుంకుమతో గౌరీ దేవిని పెడతారు. భోగి రోజు సాయంత్రం కన్నె పిల్లలంతా ఈ గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు.  గొబ్బి అనే మాట గర్భా అనే మాట నుంచి ఉద్భవించిందని చెబుతారు జానపద పరిశోధకులు.  గోమయంతో చేసే గొబ్బిని గౌరీదేవిగా భావిస్తారు. అందుకే గొబ్బెమ్మగా గౌరవిస్తూ పసుపుకుంకుమలతో పూజిస్తారు.


కొలనిదోపరికి గొబ్బిళ్ళో యదు
కులము స్వామికిని గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవులు గాచిన
కొండక శిశువుకు గొబ్బిళ్ళో
వెండి బైడి యగు వేంకటగిరిపై
కొండలయ్యకును గొబ్బిళ్ళో ”
అంటూ పదకవితా పితామహుడు అన్నమయ్య  శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని గొడుగుగా పట్టి గోవుల్ని సంరక్షించడం, శిశుపాలుని, కంసుడిని వధించడం లాంటి  సాహసాలను వివరించడం ద్వారా శ్రీ కృష్ణుడే వెంకటేశ్వరునిగా జన్మించాడని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాడు. ఆంధ్ర దేశం లో అన్ని ప్రాంతాల్లోనూ సంక్రాంతి సమయంలో ప్రతి ఇంటి ముందూ ఆడ పిల్లలు రక రకాలుగా రంగ వల్లులను తీర్చి దిద్ది వాటిమీద ఈ గొబ్బెమ్మ లను ఉంచుతారు. వాటిని పసుపు, కుంకుమ లతో పూలతో అలంకరిస్తారు. వీటిని గొబ్బెమ్మలని, గురుగులను గొబ్బియ్యల్లనీ ఆయా ప్రాంతాలలో రకరకాల పేర్లతో పిలుస్తారు.


Also Read: గతేడాది ఎలా చేశారో తెలియదు కానీ… ఈ సంక్రాంతికి ఇలా చేయండి
 గొబ్బిపాటల్లో ఎక్కువగా గోవిందుడు, శ్రీకృష్ణుడి గురించి పురాణ కథలున్నాయి. గొబ్బిపాటల్లో కృష్ణుడిని ఉద్దేశించే ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో గోదాదేవి పాశురాల్లో కూడా గొబ్బిళ్ల ప్రస్తావన ఉంటుంది. ఇంకా అత్తాకోడళ్లు, మామాఅల్లుళ్లు, అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్లు వియ్యపురాళ్ల పరువులు పట్టుదలలు, ఆప్యాతలు, అనుబంధాలు  ఇలా ఎన్నో విషయాలు ఈ గొబ్బిపాటల్లో ఉంటాయి.  


సుబ్బీ గొబ్బెమ్మా సుఖములీయవే
చామంతి పువ్వంటి చెల్లిల్నియ్యవే
తామర పువ్వంటి తమ్ముడ్నీయ్యవే
మొగలీ పువ్వంటీ మొగుడ్నియ్యవే
అంటూ సాగే గొబ్బి పాట కన్నెపిల్లల కోర్కెలను వారి భవిష్యత్ ను, పుట్టినిల్లు,మెట్టినింటి సౌభాగ్యాన్ని కోరుకునే ఆడపడుచుల మనసులు తెలియజేస్తుంది. 


Also Read: తిరుమల శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శించుకునే అవకాశం.. సామాన్యుడి కల తీరినట్టేనా....!
రాయలసీమ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న పాటేంటంటే గాజులు అమ్ముకునే వ్యాపారి కంచి వెళ్లి గాజులు తీసుకొస్తే..మహిళలంతా చేరి కంచి కామాక్షమ్మ గురించి అడిగి తెలుసుకోవడమే ఈ గొబ్బిపాటలోని ఇతివృత్తం.


గంగమ్మ గౌరమ్మ అప్పసెల్లెండ్రూ .. గొబ్బియళ్లో ..
ఒక తల్లి బిడ్డలకు వైరమూ లేదు.. గొబ్బియళ్లో
మంచి మంచి పూలేరి రాసులు పోసిరి...గొబ్బియళ్లో ...
అనే పాట ఎటువంటి వైరాలు వైషమ్యాలు లేకుండా కలిసి మెలిసి జీవనం సాగించాలనే ధర్మాన్ని బోధిస్తుంది.


గొబ్బియల్లో కంచికి పోయేటి గాజులశెట్టి గొబ్బియల్లో...
గొబ్బయళ్ళో గొబ్బియని పాడరమ్మ
కంచి వరదరాజునే గొబ్బియళ్లో
గొబ్బియళ్లో అంచులంచురగుల మద
పంచవన్నె ముగ్గుల్లో గొబ్బియళ్లో... అనే పాటలో ముంగిట్లోని ముగ్గుల ప్రాముఖ్యాన్ని వాటికి దైవత్వాన్ని ఆపాదించడమూ కనిపిస్తుంది.


ఇంటి ముందు కళకళ లాడే ముగ్గు లను వర్ణిస్తూ వాటికి దైవత్వాన్ని ఆపాదిస్తూ
గొబ్బియళ్ళో, గొబ్బి యని పాడారమ్మ
కంచి వరద రాజునే గొబ్బియళ్ళో
గొబ్బియ్యళ్ళో అంచు లంచుల అరుగుల మీద
పంచవన్నె ముగ్గులే గొబ్బియళ్ళో..
అంటూ సాగే పాటల్లో శ్రీ కృష్ణ లీలలకు సంబంధించిన పాటలెన్నో ఉన్నాయి. పట్టణాల్లో అరుదుగా కనిపించే ఈసంప్రదాయం..పల్లెల్లో అడుగడుగునా కనిపిస్తుంది... 


Also Read: భోగి పళ్లుగా రేగు పళ్లు ఎందుకు పోస్తారు… వీటికి-దిష్టికి ఏంటి సంబంధం…
Also Read:  ముక్కోటి ఏకాదశి రోజు మాత్రమే ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి..
Also Read: 11 ఇంద్రియాలపై నియంత్రణే వైకుంఠ ఏకాదశి దీక్షలో ఆంతర్యం
Also Read:  సంక్రాంతికి శ్రీశైలం మల్లన్న కల్యాణం, భక్తులకు ఈ నిబంధనలు తప్పనిసరి...
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి