పాల్గుణ మాసంలోని పౌర్ణమి రోజున హోలీ పండుగ జరుపుకుంటారు. ఈ సారి హోలీ పర్వదినం మార్చి18 శుక్రవారం వచ్చింది. అయితే మనదేశంలోని కొన్ని ప్రాంతాల్లో హోలీ వేడుకలు ముందుగానే ప్రారంభమవుతాయి. ఇలాంటి ప్రాంతాల్లో వారణాసి ఒకటి. ఇక్కడ ఐదు రోజుల ముందుగానే  రంగుల వేడుక మొదలైంది.  పరమేశ్వరుడు, పార్వతి మాతల విగ్రహాలపై రంగులు జల్లి వేడుక చేసుకుంటారు.






పురాణ కథనం
పురాణాల ప్రకారం విశ్వనాథుడు ఈ ఏకాదశి రోజున అమ్మవారిని తీసుకుని హిమాలయ పర్వతం నుంచి కాశీ నగరానికి వస్తాజు. ఈ సమయంలో భక్తులు ఆనందోత్సాహాలతో రంగులు చల్లుతూ పండుగ నిర్వహించుకున్నారని చెబుతారు. కాశీలో ఈ విధమైన హోలీ వేడుక నిర్వహించుకోవడం మూడు శతాబ్దాలుగా వస్తోంది. ఇందులో భాగంగా భక్తులు పార్వతీ పరమేశ్వరుల విగ్రహాలపై రంగులు చల్లుతూ ఊరేగిస్తారు. ఇప్పటికీ అక్కడి ప్రజలు ఇదే ఆనవాయితీని పాటిస్తున్నారు. ఈ సంప్రదాయ వేడుకల్లో ఆలయ ప్రధాన అర్చకులు ప్రాతినిథ్యం వహిస్తారు. 


Also Read: ఒక్కరాత్రిలో దెయ్యాలు కట్టిన ఆలయం, అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు


కాశీలో మణి కర్ణికా ఘాట్ ఎంతో పావనమైనదిగా హిందువులు భావిస్తారు. శివుని సమక్షంలో విష్ణుమూర్తి ఇక్కడ తన సుదర్శన చక్రంతో ఒక గోతిని తవ్వాడు. దానిని తన స్వేదంతో నింపుతుండగా విష్ణువు చెవి కుండలం (మణి కర్ణిక) అందులో పడింది. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందని చెబుతారు. మరో కథనం ప్రకారం పార్వతీదేవి తన చెవిపోగు (మణికర్ణిక)ను ఇక్కడ దాచిపెట్టి, దానిని వెతకమని శివుడిని కోరింది. దానికోసం వెతుకుతూ అక్కడే శివుడు ఉండిపోవడం వల్ల అతడు దేశదిమ్మరి కాకుండా ఉంటాడన్నది పార్వతి ఆలోచన. ఇక్కడ దహనమైన శరీరం తాలూకు ఆత్మను శివుడు స్వయంగా మణికర్ణిక కనిపించిందేమోనని అడుగుతాడట.


Also Read: కాశీలో వదిలేయాల్సింది కాకరకాయో, కమలాపండో కాదు…


కాశీలో విశ్వేశ్వరాలయం, అన్నపూర్ణాలయం, విశాలాక్షి ఆలయం, వారాహీమాతాలయం, తులసీ మానస మందిరం, సంకట మోచనాలయం, కాల భైరవాలయం, దుర్గా మాత దేవాలయం, భారతమాత మందిరం - ఇలా కాశీలో ఎన్నో  దేవాలయాలున్నాయి. వారణాశిలో ఉన్న మసీదులలో ప్రధానమైనవాటిలో విశ్వేశ్వరాలయ సమీపంలో ఉన్న గ్యానవాపి మసీదు ఒకటి, తరువాత అలాంగిరి మసీదు, ది గంజ్ షహీదాన్ మసీదు మరియు చుఖాంబా మసీదు ముఖ్యమైనవి.