వేసవి తాపం తగ్గి, బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణం నింపుకుంటంది. చెట్లు కళకళలాడుతాయి.రంగురంగుల పూలు పరిమళాలు వెదజల్లుతాయి.  నదులన్నీ నిండుకుండల్లా ఉంటాయి. బుధుడు అధిపతియైన హస్త నక్షత్రం వినాయకుడిది. సాధారణంగా బుధ గ్రహానికి ఆకుపచ్చనివంటే ఇష్టమైనట్టే  వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం. వినాయక పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలో ఒక విశేషముంది. అదేంటంటే జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టికోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీకాక మట్టిని తీయడం, దానితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు చెబుతారు. నవరాత్రులు పూజలందించిన తర్వాత మేళతాళాలతో గంగమ్మ ఒడికి గణేషుడిని చేరుస్తారు. దీని వెనక ఎంత వేదాంత రహస్యం ఉందో తెలుసా…


చెరువులు, కుంటలు పూడిక తీయడంలో భాగంగా: మృత్తికే పరబ్రహ్మం అందుకే మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజిస్తారు. పైగా మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా- ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వానికి ఏకైక నిదర్శనం భూమి/మట్టి. పంచ భూతాత్మకం అయిన ఈ ప్రపంచంలో ఎన్ని భోగాలు అనుభవించినా ఎంత విలాసంగా ఉన్నా చివరికి కలిసేది మట్టిలోనే. వినాయకుడి విగ్రహాన్ని కొత్త మట్టితోనే చేయాలని మన పూర్వీకులు చెప్పేవారు. కొత్త మట్టి అంటే తొలకరి జల్లులు పడిన తర్వాత మట్టి వాసన వెదజల్లే సమయంలో తీసిన మట్టి అని అర్ధం. ఈ మట్టిని వినాయక చవితికి ముందే అంటే వర్షాకాలం ఆరంభానికి ముందే తవ్వితీస్తారు. మట్టి తవ్వాలంటే సహజంగానే ఎవరైనా చెరువులు, కుంటల దగ్గరకు వెళతారు. వానాకాలంలో చెరువులు పూర్తిగా నిండి అలుగు పారకుండా ఉండాలంటే పూడిక తీయాలి. ఆ పనిలో భాగమే చెరువుల్లో బంకమట్టి తవ్వితీసి వినాయక విగ్రహాలు తయారు చేయాలన్న నిబంధన పెట్టారు.


పత్రి పూజ ఎందుకంటే: వినాయకుడిని 21 పత్రితో పూజిస్తా. అలా తొమ్మిది రోజులు చేయమని శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే  పత్రి పూజకు మనం ఎంచుకునేవి మామూలు ఆకులు కాదు. అవన్నీ ఔషధ మొక్కలకు సంబంధించిన ఆకులు. అందుకే వ్రతకల్పంలో పేర్కొన్న పత్రాలతోనే పూజించాలే కానీ వేరే వాటితో చేయకూడదు. వాటి నుంచి విడుదలయ్యే ఔషధ గుణాలు గాలిలో కలుస్తాయి. దీంతో ఊర్లో అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. వైరస్, బాక్టీరియా ఇబ్బందులు పోతాయి. ఇలా తొమ్మిదిరోజులు చేయడమన్నది వైద్యుల పరిభాషలో చెప్పాలంటే ఒక కోర్సు లాంటిదన్నమాట. 


నిమజ్జనం వెనుక పరమార్థం: నవరాత్రులు పూజించిన తర్వాత వినాయక ప్రతిమను చెరువులోనో, కుంటలోనూ నిమజ్జనం చేయడం ఆచారం. ఈ నిమజ్జనం వెనుకున్న పర్యావరణ రహస్యం ఏంటంటే.. 21 రకాల పత్రి, ప్రతిమలోని మట్టి నీటిలో కలవడంతో వాటిలో ఔషధ గుణాలున్న ఆల్కలాయిడ్స్‌ను నీళ్లలోకి వదిలేస్తాయి. ఈ ఆల్కలాయిడ్స్ వల్ల నీళ్లలోని ప్రమాదకరమైన బ్యాక్టీరియా నశించడమే కాదు ఆక్సిజన్ శాతం పెరుగుతుంది.





ఏక వింశతి పత్ర పూజ అని చేస్తాం కదా అందులో ఒక్కో పత్రిలో ఉన్న ఔషధ గుణాలేంటో తెలుసా..


మాచీపత్రం: మంచి సువాసన గల పత్రి. తలనొప్పులు, కంటి దోషాలు తగ్గుతాయి.


బృహతీపత్రం: దగ్గు, ఉబ్బసం, నంజు, గొంతు, ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టేందుకు ఉపయోగపడుతుంది.


బిల్వపత్రం : ఈ ఆకు పసరు చర్మ దోషాలను నివారిస్తుంది.


దూర్వాపత్రి: రక్త పైత్యానికి, మూత్ర సంబంధిత సమస్యలు తగ్గిస్తుంది.


దత్తూరపత్రం: ఆస్తమా, ఇతర దగ్గులకు, కీళ్లవాతాలకు మంచి మందు. ఆకురసం తేలు, జెర్రి, ఎలుక కాటులతు మందు


బదరీ పత్రం: అజీర్తి, రక్త దోషాలను నివారిస్తుంది. వీర్యవృద్ధికి తోడ్పడుతుంది.


అపామార్గ పత్రం : గాయాలను తగ్గించడంతో పాటూ చర్మ సమస్యలన్నింటికీ అద్భుతంగా పనిచేస్తుంది.


తులసీదళం : దగ్గు, జలుబు, జ్వరం, చర్మ వ్యాధుల నివారణకు, క్రిములను నశింపజేస్తుంది. మొక్కలను చీడపీడల నుంచి కాపాడుతుంది.


చూతపత్రం: మామిడి భూమండలంలో అతి పురాతన మైన పండ్ల మొక్కల్లో ప్రధానమైంది. పాదాల బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.


కరవీర పత్రం: తలలో చుండ్రు తగ్గిస్తుంది. ఈ మొక్క విషతుల్యం కావున తగిన జాగ్రత్తలు తీసుకుని వాడాలి.


విష్ణుక్రాంతపత్రం: దీర్ఘకాలిక దగ్గును, కఫవాతాలను, జ్వరాలను నివారిస్తుంది.


దాడిమీపత్రం: శరీరంలో త్రిదోషాలైన వాత, పిత్త, కఫాలను హరింపజేస్తుంది.


దేవదారుపత్రం: దేవదారు తైలం చర్మ వ్యాధులకు, గొంతు సమస్యలకు, పేగుల్లో పుండ్లకు, కండరాల బలోపేతానికి, లైంగిక ఉత్ర్పేరణకు ఉపయోగపడుతుంది.


మరువకపత్రం: నరాల ఉత్ప్రేరణకు, చెవిపోటు, నొప్పులకు ఔషధంగా ఉపయోగపడుతుంది.


సింధువారపత్రం: వాతం, శరీరం, తలమాడు నొప్పిలను తగ్గిస్తుంది. పంటి చిగుళ్లు, కీళ్ల బాధలను నివారిస్తుంది.


జాజీపత్రి: ఈ ఆకులు శరీరానికి వేడినిచ్చి శక్తిని కల్పిస్తాయి. వాపు, నొప్పిని తగ్గిస్తాయి. రక్తాన్ని శుద్ధి చేస్తాయి.


గండకీపత్రం: కడుపులో నులిపురుగులను హరిస్తుంది.


శమీపత్రం: ఈ ఆకురసం మాడుకి చల్లదనాన్నిచ్చి, జుట్టు నిగనిగలాడేందుకు ఉపకరిస్తుంది. ఈ చెట్టు పైనుంచి వీచే గాలి స్వచ్ఛంగా, ఆహ్లాదంగా ఉంచుతుంది.


అశ్వత్థపత్రం: శరీరంలో విషాల విరుగుడుకు, క్రిమిదోషాలను నివారించేందుకు వినియోగిస్తారు.


అర్జునపత్రం: దీని బెరడు కషాయం గుండె ఆరోగ్యంగా, పదిలంగా ఉండటానికి పనిచేస్తుంది.


అర్కపత్రం: తెల్లజిల్లేడును సూర్యునికి ప్రతీకగా భావిస్తారు. దీనిలోని ఔషధగుణాలు శరీరాన్ని కాంతివంతం చేస్తాయి.


అయితే ప్రతిష్ట కోసం భారీ రంగు విగ్రహాలని నీటిలో కలపడం వల్ల నిమజ్జనం వెనుకున్న ఉద్దేశాలు దెబ్బతింటున్నాయి. ప్రకృతిని కొలవడం, భక్తితో పూజించడం అన్న లక్ష్యాలని పక్కన పెట్టి ప్రకృతి వినాశనానికీ, ఆడంబరానికీ పెద్ద పీట వేస్తున్నాయి. అందుకే మట్టి గణేషుడినే పూజించి నిమజ్జనం చేయాలి.