“సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం మయా
       గృహాణ మంగళం దీపం త్రైలోక్య తిమిరాపహమ్
      భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే
       త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్య ర్జ్యోతి ర్నమోస్తుతే”
'మూడు వత్తులు, నూనెలో తడిపి, అగ్నితో వెలిగించి శుభ ప్రదమైన, మూడు లోకాల చీకట్లను పోగొట్ట గలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్య జ్యోతికి నమస్కరిస్తున్నాను'. అని దీపం వెలిగించి నమస్కరిస్తాం. భారతీయ సంస్కృతిలో దీపానికున్న ప్రత్యేకతే వేరు. దేవాలయం అయినా, ఇళ్లలో అయినా పూజ దీపంతోపే ప్రారంభిస్తాం. ఇంట్లో ఎలాంటి శుభాకార్యం జరిగినా దీపాన్ని వెలిగించటం హిందూ సంప్రదాయంలో భాగం. అంతటి విశిష్టత ఉన్న దీపాల పండుగే దీపావళి. చీకటిలో వెలుగులు విరజిమ్మే పండుగ.
Also Read: శనిదోషం పోవాలంటే దీపావళి రోజు ఇలా చేయండి...
దీపావళి రోజున ప్రతి ఇంటి ముందు దీపాలు కొలువుతీరుతాయి. అసలు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. 'అజ్ఙానం'అనే చీకటిని తొలగించి 'జ్ఙానం'అనే దీపాన్ని అంతరాత్మలో వెలిగించడమే దీపావళి అంతరార్థం. 'దీపం' అంటే త్రిమూర్తిస్వరూపం. దీపంలో మూడు రంగుల కాంతులు ఉంటాయి. ఇందులోని 'ఎర్రని' కాంతి బ్రహ్మదేవునికి, 'నీలి' కాంతి శ్రీమహావిష్ణువుకి, 'తెల్లని' కాంతి పరమేశ్వరునికి ప్రతీకలు. సాధారణంగా అమావాస్య రోజు రాత్రి చీకటి మయంగా ఉంటుంది. ఈ వెలుగులతో చీకట్లను పారద్రోలినట్టే.. మనలో ఉండే అజ్ఞానాన్ని తరిమికొట్టడమే దీని వెనుకున్న ఉద్దేశం. దీపావళి రోజున లక్ష్మీదేవి వైకుంఠం నుంచి భూలోకానికి వస్తుందని.. అందుకే అమ్మవారికి దీపాలతో ఆహ్వానం పలుకుతారని చెబుతారు. 
Also Read: ఆ రాష్ట్రాల్లో దీపావళి అంటే బాణసంచాతో మినీ యుద్ధమే.. ఇంతకీ క్రాకర్స్ ఎందుకు కాల్చాలో తెలుసా..!
ఈ పొరపాట్లు చేయకుండా దీపాలు వెలిగించండి
దీపం సర్వతమోపహం
దీపో హరతుమే పాపం
దీపలక్ష్మీ నమోస్తుతే..అంటూ దీపాల్ని వెలిగించాలి.