Bhishma Pratigya Mahabharat: భీష్ముడి గురించి తెలుసుకోవాలంటే ఆయన పుట్టుక నుంచీ ప్రత్యేకమే
భీష్ముడి జన్మ రహస్యం 
చంద్ర వంశానికి చెందిన శంతనమహారాజు హస్తినాపురాన్ని పరిపాలిస్తుండేవాడు. ఒకరోజు శంతనుడు  గంగానది వైపు వెళ్ళాడు. అక్కడ ఆయనకు ఓ అమ్మాయి కనిపించింది. రాజుగారికి ఆ అమ్మాయి మీద ప్రేమ కలిగి.. పెళ్ళి చేసుకోమని అడిగితే..నేనెవరో తెలుసా అంది ఆమె. నువ్వు ఎవరైనా కానీ నన్ను పెళ్లిచేసుకో..నా రాజ్యం , నా డబ్బు , నా ప్రాణం , సర్వస్వం నీ కిచ్చేస్తాను ” అని బ్రతిమలాడుతాడు. అప్పుడు ఆ అమ్మాయి , ”మహారాజా ! మీ ఇష్టప్రకారమే మిమ్మల్ని పెళ్ళి చేసుకుంటాను. కాని కొన్ని షరతులకు ఒప్పుకోవాలి అంటుంది.. అలాగే అంటాడు శంతనుడు. వెంటనే ఇద్దరూ పెళ్ళి చేసుకుంటారు..ఆ అమ్మాయి మరెవరో కాదు..గంగాదేవి.


పిల్లల్ని నీట్లో పడేసిన గంగాదేవి
పెళ్ళి జరిగిన తర్వాత  గంగాదేవి రాజుగారికి మరింత ఇష్టురాలైంది. వారిద్దరికీ చాలామంది పిల్లలు పుట్టారు..అయితే పుట్టిన ప్రతీ బిడ్డనూ ఆమె గంగానదిలో వదిలేసేది. ఆవిడ ప్రవర్తన చూసి శంతనుడికి ఆశ్చర్యం , దుఃఖం వచ్చేవి. కాని ఏమీ అనడానికి వేల్లేదు. ఆవిడ పెట్టిన షరతుల్లో  ” నువ్వెవరు ? ఎక్కడనుండి వచ్చావు ? ఇలా ఎందుకు చేస్తున్నావు ? ” అని అడగడానికి వీల్లేదు. అందుకే శంతనుడు పల్లెత్తు మాట కూడా అనేవాడు కాదు. అప్పటికే ఏడుగురు కొడుకులను నీటిపాలు చేసింది...ఏనిమిదోవాడిని కూడా నీట్లో వదిలేయబోతుంటే ఆగలేక అడిగాడు శంతనుడు..” నువ్వు తల్లివి కావు…ఎందుకింత పాపం చేస్తున్నావు ? ” అని అడిగాడు.
వెంటనే ఆమె “మహారాజా ! మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించీ నేను చేసే పనుల గురించీ ఎప్పుడూ ఏమీ అడగనని మాటయిచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ ఉండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని చెప్పి తన గురించి చెబుతుంది.


Also Read:  అందరూ కృష్ణుడిని తలుచుకుంటే కృష్ణుడు ఎవర్ని స్మరించాడో తెలుసా!


అష్టవసువుల్లో ఒకడు భీష్ముడు
మునులూ , మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆధిదేవతను నేను. పూర్వం ఒకానొకప్పుడు అష్ట వసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ట మహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్ళారు. అప్పుడు అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్టులవారి పాడి ఆవు. అది చాలా అందంగా వుంది ! అష్ట వసులు , వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. ‘ఈ ఆవు వశిష్ట మహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురి కావల్సి వస్తుంది. వద్దు’ అని చెప్పాడు భర్త. ఆవిడ  వినలేదు. దీంతో ఎనిమిది మంది వసువులూ కలసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు. వశిష్టుడికి ఈ సంగతి తెలిసి పట్టరాని కోపంతో .. మీరంతా మానవులై పుట్టండని శపించాడు.
అష్ట వసువులు పరుగు పరుగున వచ్చి వశిష్టుల వారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్ధించారు. నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహా వైభవంతో చాలాకాలం జీవిస్తాడు. తక్కిన ఏడుగురూ భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులౌతారు. ఇంతకంటే నేను చేయగలిగిందేదీ లేదని చెబుతాడు వశిష్టుడు. 


దేవవ్రతుడే భీష్ముడు
ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి  ‘గంగాభవానీ ! నువ్వే మాకు తల్లివి కావాలి. మా కోసం నువ్వు భులోకానికి వెళ్ళు , అక్కడ ఓ పునీతుడ్ని వరించు. మేము నీ పుణ్య గర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి , మేం పుట్టిన వెంటనే గంగలో విడిచి పెట్టు తల్లీ ’ అని మొరపెట్టుకున్నారు. అందుకే నేను భులోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్ళి చేసుకున్నాను. అష్ట వసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను , అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది.
ఆ పిల్లవాడే దేవవ్రతుడు. వశిష్టుడి వద్ద వేదాలు నేర్చుకున్నాడు. శుక్రాచార్యుడి వద్ద శాస్త్రాలు చదువుకున్నాడు. విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు.ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు. ఆయన కౌరవ , పాండవ , వంశాలకు పితామహుడు.


భీష్మ ప్రతిజ్ఞ
గంగాదేవి వెళ్లిపోయిన కొన్నాళ్లకు సంసార జీవితంపై కోరికతో తాను మోహించిన మత్స్యకన్య సత్యవతిని వివాహం చేసుకుంటాడు శంతనుడు. అప్పటికే శంతనుడికి భీష్ముడు పుత్రుడిగా ఉన్నాడని తెలుసుకున్న సత్యవతి తండ్రి తన కుమార్తెను ఇవ్వనని చెబుతాడు. ఆ విషయం తెలుసుకున్న భీష్ముడు తండ్రి కోర్కె నెరవేర్చేందుకు..సత్యవతి తల్లిదండ్రులు చెప్పినదానికి ఒప్పుకుంటాడు.. 'తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణా బాధ్యతను స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు, అసలు వివాహమే చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు"."అప్పుడ సత్యవతిని శంతనుడికి ఇచ్చి పెళ్లిచేస్తారు.  


Also Read: పెళ్లి ఆలస్యం అయ్యే అమ్మాయిలు రుక్మిణీ కళ్యాణం - మరి పెళ్లికాని అబ్బాయిలు ఏం చదవాలంటే!


కోరినప్పుడు మరణం పొందే వరం
కొడుకైన భీష్ముడు తన కోర్కె తీర్చినందుకు ముచ్చటపడిన శంతనుడు..ఓవరం ఇస్తాడు. అదే ఇచ్ఛా మరణం.. అంటే తాను కోరుకున్నప్పుడు మాత్రమే మరణం సంభవిస్తుంది. అలా తండ్రి కోసం బ్రహ్మచారి గా మారిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు భీష్ముడు. శీలం, శౌర్యం , నీతి , నిష్ఠలో భీష్మునికి సాటి భీష్ముడే. చిన్నప్పటి నుంచీ ఆయన త్యాగపురుషుడే. తండ్రి కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు...కొంత కాలం పాటు తండ్రి వృద్ధాప్యాన్ని స్వీకరించాడు, తండ్రి వివాహం కోసం ఇచ్చిన మాట ప్రకారం తను పెళ్లిచేసుకోకుండా ఉండిపోయాడు, తన తమ్ములు తమ్ములు చనిపోయిన తర్వాత కూడా భీషణ ప్రతిజ్ఞకు కారణం అయిన సత్యవతీ దేవి స్వయంగా ఆజ్ఞాపించినా కూడా ప్రతిజ్ఞను భంగం చేయడానికి భీష్ముడు అంగీకరించలేదు.


అప్పటి నుంచీ 'భీష్మ ప్రతిజ్ఞ' అనే మాట స్థిరపడిపోయింది..