Karwa Chauth and Atla Taddi 2023: హిందూమతంలో కర్వా చౌత్‌ (అట్ల తదియ)కు విశేష ప్రాధాన్యత ఉంది. వివాహిత మహిళలు..భర్తల సౌభాగ్యం కోసం ఏటా ఆశ్వయుజ బహుళ తదియ రోజు ఈ పూజ చేస్తారు. ఈ ఏడాది అక్టోబరు 31 మంగళవారం వచ్చింది అట్ల తదియ.


ఉయ్యాల పండుగ


ఆశ్వయుజ బహుళ తదియరోజు వచ్చే ఈ రోజునే ఉయ్యాల పండుగ అనీ , గోరింటాకు పండుగ అనీ అంటారు. ఈ రోజున  ఆడపిల్లలు, ముత్తయిదువులు గోరింటాకు పెట్టుకుంటారు. వేకువ జామునే లేచి అన్నం తింటారు. అట్లతద్దోయ్‌ ఆరట్లోయ్‌ , ముద్ద పప్పోయ్‌ మూడట్లోయ్‌ అంటూ పాడుతూ ఇరుగు పొరుగు స్నేహితులందరితో  కలిసి ఆటలు ఆడతారు. 11 తాంబూలాలు వేసుకుంటారు, 11 ఉయ్యాలలూగుతారు, 11 రకాల ఫలాలు తింటారు. పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం గౌరీ దేవికి, చంద్రుడికి పూజ చేసి 11 అట్లు చొప్పున నైవేద్యం పెట్టి...మరో పది అట్లు ముత్తైదువుకు వాయనం ఇస్తారు. 


Also Read: నవంబరు 12 or 13 - దీపావళి ఎప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి!


సౌభాగ్యాన్నిచ్చే నోము అట్లతద్ది


త్రిలోక సంచారి అయిన నారదముని సూచన మేరకు ఈశ్వరుడిని పతిగా పొందేందుకు గౌరీదేవి మొదటిసారిగా చేసిన వ్రతమే అట్లతద్ది. స్త్రీలు సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం ఇది. చంద్రారాధన వల్ల చంద్రుడి కళల్లో కొలువై ఉన్న శక్తి  వ్రతం చేసిన వారికి వస్తుందని , ఆయన అనుగ్రహంతో స్త్రీ సౌభాగ్యం పెరుగుతుందని , కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయని శాస్త్రవచనం.


నైవేద్యంగా అట్లు ఎందుకు!


నవగ్రహాల్లోని కుజుడికి అట్లంటే మహా ప్రీతి. అట్లను ఆయనకు నైవేద్యంగా పెడితే కుజదోషం పరిహారమై సంసార సుఖంలో ఎటువంటి అడ్డంకులూ రావని నమ్మకం.  గర్భధారణలోనూ సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. మినపపిండి , బియ్యపు పిండిని కలిపి వేస్తారు కాబట్టి...మినుములు రాహువుకు , బియ్యం చంద్రునికి సంబంధించిన ధాన్యాలు. అందుకే అట్లు వాయనం ఇవ్వడం ద్వారా  గర్భ దోషాలు తొలగిపోతాయంటారు. బియ్యం , మినప్పప్పు కలిపి చేసిన అట్లను అమ్మవారికి నివేదించటంలో సమస్త గ్రహాలు కూడా శాంతించి జీవితాన్ని సుఖవంతంగా ఉండేటట్లుగా అనుగ్రహిస్తుందని విశ్వాసం.


Also Read: ఈ రాశివారు ఈ రోజు కెరీర్ కి సంబంధించి పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది


అట్ల తదియ కథ


అట్లతద్దికి సంబంధించి ఒక కథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒక రాజు కుమార్తె, మంత్రి కుమార్తె, సేనాపతి కుమార్తె, పురోహితుని కుమార్తె నలుగురూ ఎంతో స్నేహంగా ఉండేవారు.అట్ల తదియ రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి చంద్రుడు వచ్చిన తర్వాత పూజ చేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ లోగా  రాజుగారి కుమార్తె ఆకలితో సొమ్మసిల్లి పడిపోయింది. చెల్లెలి అవస్థ చూసి తల్లడిల్లిపోయిన రాకుమారులు అద్దంలో ఓ తెల్లని వస్తువు చూపించి చంద్రోదయం అయింది కొంచెం తినేశాక పూజ చేసుకో అని చెప్పారు. అన్నల మాటలు నమ్మిన ఆమె తినేసింది. కొద్దికాలానికి నలుగురు స్నేహితులు పెళ్లిళ్లు చేసుకున్నారు. అందరకీ వయసుకి తగిన భర్త లభించగా..రాకుమార్తె కు మాత్రం ముసలి భర్త దొరికాడు. వ్రతం చేసినా తనకు మాత్రం ఎందుకిలా జరిగిందని ఆమె బాధపడుగా అప్పుడు మిగిలిన వారంతా జరిగిన విషయం చెప్పారు. తప్పు తెలుసుకున్న రాజ కుమార్తె ఆ మర్నాడే అట్లతదియ కావడంతో నియమంగా నోము నోచుకుంది. ఆ అక్షతలు భర్త మీద చల్లగానే ఆయనకు శాప విమోచనం జరిగినట్టు మారిపోయాడు. అందుకే కన్నె పిల్లలు ఈ వ్రతం చేస్తే ఉత్తముడైన భర్త లభిస్తాడని, వివాహితులు చేస్తే సౌభాగ్యంతో తులతూగుతారని పురాణాలు చెబుతున్నాయి. 


Also Read: కార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీక పౌర్ణమి సహా ముఖ్యమైన రోజులివే!


అట్లతద్ది వెనుకున్న వెనుక శాస్త్రీయ దృక్పథం


ఉదయాన్నే లేచి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఆస్వాదించడమే ఈ పండుగ వెనుకున్న ముఖ్య ఉద్దేశ్యం. వర్షాల సమయంలో విరివిగా లభించే ఉసిరి, గోంగూర తినడం ద్వారా కంటిసమస్యలు రాకుండా ఉంటాయి. చేతులకు పెట్టుకునే గోరింటాకు వల్ల శరీరంలో వేడి తగ్గుతుంది.  రోజంతా ఆటపాటల వల్ల శరీరానికి వ్యాయామం, మనసుకు ఉల్లాసం లభిస్తాయి. పచ్చని చెట్ల నీడలో ఆడిపాడితే ఆరోగ్యకరమైన గాలిని శరీరానికి అందించినట్లౌతుంది. ఉపవాసం వల్ల జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. స్త్రీలకు మానసికంగా, శారీరకంగా ఉత్సాహాన్ని అందించడమే అట్లతదియ ముఖ్య ఉద్దేశం.