Anantapur YSRCP News: అధికార వైసీపీకి సంబంధించిన మార్పులు, చేర్పులు ఏపీ రాజకీయాల్లో ఆసక్తిని పెంచేశాయి. ఇప్పటికే మూడు జాబితాలు విడుదల కాగా.. సంక్రాంతి పండగ అనంతరం మరో జాబితాను రిలీజ్‌ చేసేందుకు వైసీపీ అధినాయకత్వం సిద్దమవుతోంది. ఇందులో ఇంకెన్ని మార్పులు ఉంటాయనే దానిపై సర్వత్రా ఆశక్తి నెలకొంది.


మూడు లిస్టుల్లో 59 స్థానాల్లో మార్పు


ఒకట్రెండు రోజుల్లో నాలుగో జాబితా విడుదలకు రెడీ అవుతోంది. మొదటి లిస్ట్‌లో 11 మందిని మార్చగా.. సెకెండ్ లిస్ట్‌లో 27 మందిని మార్చారు. మూడో లిస్ట్‌లో 21 మంది ఇన్‌ఛార్జులను మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం మూడు జాబితాల్లో 59మందికి వైసీపీ అధినేత వైఎస్ జగన్ టికెట్లు ఖరారు చేశారు. 


అనంతపురం నేతల్లో టెన్షన్


ఈ నాలుగో లిస్ట్ పై అన్ని జిల్లాల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇది పీక్స్‌లో ఉంది. ఇప్పటికే జిల్లాలో సగం నియోజకవర్గాలకు అభ్యర్థులు ఖరారు అయ్యాయి. మిగిలిన నియోజకవర్గాల నేతలకు టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా సింగనమల, మడకశిర నియోజకవర్గాల్లో ఉత్కంఠ నెలకొనింది. ఈ రెండు నియోజకవర్గాల ఎస్సీ నియజకవర్గాలే. సింగనమల నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అభ్యర్థిని మారుస్తారని ప్రచారం జరుగుతోంది. ఇవన్నీ కేవలం ఊహాగానాల అని టికెట్ తమదేననే ధీమాతో ఉన్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి. 


మడకశిరలో పోలీసు అధికారి పోటీ 


మరో ఎస్సీ నియోజకవర్గం మడకశిరలో అభ్యర్థి మార్పు కన్ఫామ్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మడకశిర ఎమ్మెల్యేగా డాక్టర్ తిప్పేస్వామి ఉన్నారు. అధిష్ఠానం ఇప్పటికే ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామికి టికెట్ లేదు అన్న సంకేతాలు అందాయన్నది సమాచారం. మడకశిర నియోజకవర్గానికి కొత్త అభ్యర్థిగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేతగా, పోలీసు అధికారి సీఐ శుభకుమార్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. 
సీఐ శుభకుమార్ కూడా ఈ మధ్యే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విడదుల చేస్తున్న ప్రతి జాబితాలో కూడా ఒక ఎస్సి నియోజకవర్గం అభ్యర్థిని మారుస్తూ వస్తున్నారు. సమాజీకవర్గాల వారిగా అన్ని కులాలకు సమన్యాయం చేయాలన్న ఆలోచన లతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారని పార్టీ పెద్దలు చెబుతున్న పరిస్థితి. వైసీపీలో మార్పులుచేర్పులపై అసంతృప్త రాగాలు వినిపిస్తున్నా.. నిరసనలు కంటిన్యూ అవుతున్నా… వైసీపీ అధిష్టానం లెక్కచేయడం లేదు. ఎన్నికల నాటికి అంతా సర్దుకుంటుందనీ.. అప్పటి వరకు మరిన్ని మార్పులు ఉంటాయని స్పష్టం చేస్తోంది.