Three Capitals Row  :

  
 
మూడు రాజధానులనేది మిస్ కమ్యూనికేషన్. విశాఖ నే పరిపాలనా  రాజధాని. మిగతావి రాజధానులు కాదు. హైకోర్టు బెంచ్ ఉండే నగరం ఒకటి, అసెంబ్లీ సమావేశాలు ఒక సెషన్ నిర్వహించే నగరం ఇంకోటి. : బెంగళూరులో ఇన్వెస్టర్ల మీటింగ్‌లో ఆర్థిక మంత్రి బుగ్గన 


బుగ్గన ఏ సందర్భంలో మాట్లాడారో తెలియదు , మూడు రాజధానులే మా విధానం : ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల


ప్రభుత్వం తరపున బుగ్గన రాజేంద్రనాథ్ .. మూడు రాజధానులనేవే  లేవని ప్రకటించారు. పార్టీ తరపున మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి మూడు రాజధానులు అనేది తమ విధానమని ప్రకటించారు.  వీళ్లకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓ మాదిరిగా కూడా కనిపించడం లేదు అనుకుంటా.. ఈ ప్రకటనలు చూస్తుంటే ..!  


ఎవరికీ లేని రాజధాని కష్టం ఏపీ ప్రజలకు మాత్రమే ! 


ఏపీ ప్రజల కష్టం ఇంకెవరికీ రాకూడదేమో అనిపిస్తోంది. అంటే ప్రతీ రాష్ట్రంలో ఉన్నట్లుగా రోడ్ల ఇబ్బందులు, నీటి కష్టాలు, రైతుల సమస్యలు, అప్పుల భారం ఇలాంటివి మాత్రమే కాదు. వీళ్లకు రాజధాని కూడా ఓ కష్టమే.  మూడేళ్లుగా రాజధాని ఏదన్న దానిపై ఏ క్లారిటీ లేదు.  ఇప్పుడు మూడు రాజధానులు కూడా మూణ్నాళ్ల ముచ్చట అవుతుందా అనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో రాజధాని విషయంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు... ప్రభుత్వంలోని సీనియర్ మంత్రులు చేస్తున్న ప్రకనలు.. వాటికి కౌంటర్లుగా మళ్లీ కొందరు మంత్రులు.. ముఖ్యులు .. సలహాదార్లు ఇస్తున్న వివరణలు.. ఇవన్నీ చూస్తుంటే.. అలాగే ఉంది. 


ఏ రాష్ట్రానికైనా రాజధాని గ్రోత్ ఇంజిన్ 


రాజధాని అన్నది ఏ రాష్ట్రానికైనా ఓ చిరునామా. గ్రోత్ ఇంజన్.. అదే ముఖ్యనగరం. విభజన తర్వాత ఏపీకి అది ఇంకా ముఖ్యమైంది. అలాంటి రాష్ట్రానికి అమరావతి అని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి ప్రభుత్వాధినేత కూడా అప్పుడు మద్దతిచ్చారు. ఎన్నికల వరకూ అమరావతే రాజధాని అన్నారు. ఎలక్షన్ తర్వాత “విధానాలు” మారిపోయాయి. అన్ని ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా మూడు రాజధానుల అంశం ముందుకొచ్చింది.  ఇప్పటివరకూ అమరావతి లో ఉంటున్న పరిపాలనా రాజధాని విశాఖకు... ఇక్కడే ఉన్న హైకోర్టును కర్నూలుకు.. అసెంబ్లీని అమరావతికీ అని చెప్పారు. ఆ తర్వాత చట్టం చేయడం.. మండలిలో వీగిపోవడం.. ప్రభుత్వం మండలి రద్దుకు వెళ్లడం .. మళ్లీ వెనక్కి రావడం.. మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవడం.. అయినా కానీ మూడుకే మా మద్దతూ అంటూ ప్రకటించడం..చకచకా జరిగిపోయాయి.  కోర్టుల్లో ఎదురు దెబ్బలు తగిలినా అసెంబ్లీలో వెనక్కు తగ్గినా ..మూడు రాజధానుల విధానం నుంచి వెనక్కు మళ్లలేదు అని ప్రభుత్వం అనేక సందర్భాల్లోనూ అసెంబ్లీలోనూ ప్రకటించింది. కాబట్టి బిల్లులో పెట్టినట్లుగా సుప్రీంకోర్టు ఒప్పుకుంటే మూడు ప్రాంతాలకూ మూడు రాజధానులు వస్తాయన్నది సామాన్య ప్రజలకు ఉన్న అవగాహన. ఇక వైస్సార్సీపీ ఇచ్చిన సంకేతాలను బట్టి కోర్టు తీర్పు అనుకూలంగా రాకపోయినా సరే.. ముఖ్యమంత్రి తన నివాసాన్ని మార్చేసుకుంటారని ఆయన ఎక్కడుంటే అదే రాజధాని అని కూడా ప్రకటనలు వచ్చాయి. విశాఖకు చెందిన మంత్రి అమరనాథ్ రాజెక్కడ ఉంటే అదే రాజాధాని అని ప్రకటించేశారు కూడా.. 
 
ముఖ్యమంత్రి కూడా విశాఖ గురించే ప్రకటన 


ఇదిలా ఉంటే వరుస బట్టి జరుగుతున్న పరిణామాలు అనేక సందేహాలకు తావిస్తున్నాయి. విశాఖ వేదికగా వచ్చే మూర్చి 3,4 తేదీల్లో పెద్ద ఎత్తున గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సన్నాహకంగా ప ఏపీలోని పట్టుబడుల పోత్సాహక వాతావరణాన్ని ప్రమోట్ చసేందుకు పారిశ్రామిక వేత్తలతో రోడ్ షోలు నిర్వహిస్తున్నారు.  ఈ మధ్య ఢిల్లీలో జరిగిన రోడ్ షోలో ముఖ్యమంత్రి జగన్ మోహనరెడ్డి వైజాగ్ రాజధాని అని ప్రకటించేశారు. తాను త్వరలో అక్కడకు వెళ్లిపోతున్నా అని కూడా చెప్పేశారు. దాంతో మూడు రాజధానుల కథ ఏమవుతుందో అన్న సందేహాలకు పుల్ స్టాప్ పడింది. 


కర్నూలులో హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్, అమరావతిలో అసెంబ్లీ..అయినా రాజధానులు కావన్న బుగ్గన 


అయితే ముఖ్యమంత్రి ఆ సమావేశంలో తమ కలల నినాదం మూడు రాజధానుల గురంచి మాటమాత్రమైనా మాట్లాడలేదు. వైజాగ్ గురించి మాత్రమే మాట్లాడారు. పైగా వైజాగ్ రాజధాని అన్నారు కానీ పరిపాలనా రాజధాని అని స్పష్టంగా చెప్పలేదు. అయినప్పటికీ.. అది సాధారణంగా చెప్పిన విషయం.. పరిపాలనా రాజధాని అయినా రాజధాని అయినా ఒకటే కదా అని కొంత మంది విశ్లేషించగా.. మిగతా రాజధానుల గురించి చెప్పకపోయినా అవి లేవు అని కాదు కదా.. అని కొంతమంది మాట్లాడుకున్నారు. అయినా ముఖ్యమంత్రి మాటలతోనే కొంత సందిగ్ధత మొదలైంది. మంగళవారం బెంగళూరులో నిర్వహించిన మరో రోడ్ షోలో ఆర్థిక మంత్రి బుగ్గన మరింత మెటీరియల్ జోడించారు. మూడు రాజధానులు అంటూ ఏం లేవు. వైజాగే ముఖ్యం అన్నట్లుగా మాట్లాడారు. రాష్ట్రం కన్నా విశాఖ గురించే ఎక్కువుగా ప్రమోట్ చేశారు. మిగతా రాజధానుల ప్రాధాన్యతను తగ్గించడం మాత్రమే కాదు. బుగ్గన మాటల్లో మరో రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. 


బుగ్గన ప్రకటనపై ఎన్నో సందేహాలు
కర్నూలుకు హైకోర్టును పూర్తిగా తరలిస్తున్నట్లుగా ప్రభుత్వం అసెంబ్లీ బిల్లులో ప్రస్తావించింది. కానీ బుగ్గన మాత్రం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమే అక్కడ ఉంటుంది అంటన్నారు. ప్రిన్సిపుల్ బెంచ్ ఎక్కడ ఉంటే అదే హైకోర్టు అయినప్పుటికీ.. మిగతా ప్రాంతాల్లో కూడా బెంచ్ లు ఉంటాయన్నది కొత్త విషయం. 


ఇక గుంటూరు లో ఓ సెషన్ అసెంబ్లీ సమావేశాలు పెడతాం అన్నారు. అంటే శాసన రాజధానిగా అన్ని అసెంబ్లీ సెషన్లు అక్కడే జరుగుతాయన్న అభిప్రాయం ఇప్పటిదాకా ఉంది. కానీ ఇప్పుడు కేవలం ఒకటే సెషన్ అంటున్నారు. జనరల్ గా అసెంబ్లీకి ప్రతి ఏడాది మూడు సెషన్లు జరుగుతాయి. వీటిలో బడ్జెట్ సెషన్ దాదాపు నెలరోజులు ఉంటుంది. అదేముఖ్యమైనది. మంత్రి వ్యాఖ్యలను బట్టి మూడు ప్రాంతాల్లో మూడు సెషన్లు జరుగుతాయి అనుకోవాలి. మరి అమరావతిలో ఏ సెషన్ జరుగుతుందో.. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది. గుంటూరు లో అసెంబ్లీ అన్నారు కానీ అమరావతి అనలేదు. అమరావతి కూడా గుంటూరు జిల్లాలోనే ఉంది కాబట్టి .. బహుశా ఆ ఉద్దేశ్యంతో అన్నారా.. లేక అమరావతిలో ఏ కార్యక్రమం చేసే ఉద్దేశ్యంతో ఈ ప్రభుత్వం లేదా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి. 


ప్లాన్ ప్రకారమే విశాఖను రాజధానిగా ప్రమోట్ 


ఇందులో కూడా ఓ ముఖ్యమైన పాయింట్ గుర్తించాలి రాజధాని విషయంలో ఏపీ నిజంగానే ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటోంది. రాజధాని ఏది అని బయట వారు అడిగితే అమరావతి అని చెప్పడానికి ఈ ప్రభుత్వంలో ఎవరికీ మనస్కరించడం లేదు. అమరావతి అని పేరునే ఉచ్చరించడం లేదు. అలాగే విశాఖ అని ఇప్పటికిప్పుడు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. ముఖ్యంగా ఇన్వెస్టర్స్ సమ్మిట్ లాంటి సమయంలో అది ఇబ్బందికరమైన పరిస్థితే. అందుకనే రాజధాని విశాఖనే అనే ఓ సూత్రీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. రాజకీయ వర్గాల్ల్లో కూడా దాదాపు ఇదే అభిప్రాయం ఉంది. పేరుకు మూడు రాజధానులు అని చెప్పినా.. విశాఖనే అసలైన రాజధానిగా గుర్తిస్తారు అన్న అభిప్రాయం అంతర్గతంగా ఉంది. ఈ కోణంలో చూస్తే.. ముఖ్యమంత్రి జగన్, బుగ్గన రాజేంద్రనాథ్ మాటలు యాథృచ్చికం కాదు అనుకోవాలి. క్రమంగా రాజధాని విశాఖనే అని.. మిగిలిన వాటి ప్రాధాన్యత లేదు అన్నట్గుగా కూడా ఉంది.


మూడు రాజధానుల పై ఇబ్బందులు !


ఇదంతా ఎందుకు అంటే .. అసలు మూడు రాజధానులు అన్న కాన్సెప్టే కొత్త గా ఉంది. మూడు ప్రాంతాల అభివృద్ధి అన్నది సరే కానీ.. మూడు రాజధానులు ఏంటి అన్న ప్రశ్న బయట ఉంది. అలాగే మూడు రాజధానులు అనే పేరుతో కోర్టు కేసుల్లో నెగ్గడం కూడా కష్టంగానే ఉంది. అసలు ఆ నగరాలకు రాజధాని అనే గుర్తింపు ఉంటుందా అన్నది కూడా సందేహమే.. అందుకే క్రమక్రమంగా రాజధానులు అని పేరువైపు నుంచి అక్కడ ముఖ్యమైన ఇనిస్టిట్యూషన్ లు ఇచ్చాం.. జనబాహుళ్యంలో రాజధానిగా గుర్తింపు ఉంటుంది అన్న డైవర్షన్ వైపు జనాలను మళ్లిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 


అమరావతి ఊసే లేదు..!
 
అమరావతి రాజధానిగా ఈ ప్రభుత్వానికి నచ్చలేదు అన్నది స్పష్టం. అయితే రాజధానిగా మాత్రమే కాదు. మిగతా విషయాల్లోనూ అమరావతిని ప్రమోట్ చేయడం లేదు. పారిశ్రామిక వేత్తల సదస్సులో కూడా అమరావతి అనే ఓ నగర నిర్మాణం జరుగుతోంది అని కానీ.. అక్కడ అభివృద్ధి చేసిన ప్రభుత్వ భూమి వేల ఎకరాల్లో ఉంది అని కానీ మాటమాత్రంగా కూడా చెప్పడం లేదు. అమరావతి రాజధానిగా పనికి రాదు సరే.. ఇతర అవసరాల విషయంలో ఎందుకు ప్రస్తావించడం లేదు.? అమరావతి లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలరకు అవకాశం ఉందని ప్రభుత్వమే ఇంతకు ముందుకు ప్రకటించింది. మరి ఇన్వెస్టర్ మీట్  లో అమరావతి ని  ఎందుకు ప్రమోట్ చేయడం లేదు, 


హైకోర్ట్ కోసం ఏం చేశారు.,?


హైకోర్టు కర్నూలు కు మారుస్తున్నాం.. అన్ని ప్రకటనలు తప్ప.. దానిపై కార్యాచరణ కూడా లేదు. హైకోర్టు అయినా బెంచ్ అయినా వేరే చోటకు మార్చాలంటే.. సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవాలి. దీనిపై ఇంతవరకూ రాష్ట్రం నుంచి అధికారిక లేఖ సుప్రీంకోర్టుకు చేరలేదు. దీనికి అసలు అసెంబ్లీ బిల్లుతో కూడా సంబంధం లేదు. పైగా ఈ మధ్య మరో కేసులో జవాబిస్తూ.. హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని చెప్పారు. ( దీనిపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనందున ప్రభుత్వం తనంతట తానుగా స్థలం మార్పుపై మాట్లాడకూడదు అనే మర్యాదను పాటించడం కోసమే అలా చెప్పిందని ప్రభుత్వం వర్గాలు తర్వాత చెప్పాయి. అలాగే ప్రస్త్తుతం రాజధాని బిల్లు సుప్రీంకోర్టులో ఉన్నందున దానిపై వచ్చే నిర్ణయాన్ని బట్టి స్పందించాలని కూడా అనుకుంటున్నట్లు తెలుస్తోంది. )



రాజధాని అనే పేరు లేకపోయినా రాజధానులేనా ?


ఓ పక్క ఇది జరుగుతుంటేనే ప్రభుత్వంలోని కీలకమైన నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు.. మాకు విశాఖ రాజధాని ఇవ్వకపోతే  మా ప్రాంతాన్ని విడగొట్టండి అన్నారు. ఇన్ని వ్యాఖ్యలు.. ప్రకటనల మధ్య ఏం జరుగుతుందో అన్న సందేహాలు ఉంటే..  తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రి అంబటి రాంబాబు తాము మూడు రాజాధానులకే కట్టుబడి ఉన్నాం.. అని చెప్పడం అసలు హైలైట్. బుగ్గన మాట్లాడిదాంట్లో తప్పు లేదు అని.. మూడు రాజధానులనే మరో రూపంలో చెప్పారు అని సజ్జల సెలవిచ్చారు. పేరు లేకపోయినా అవి రాజధానులే అన్నారు. అదేంటో మరి తెలీదు. అందుకే చెప్పుకున్నాం కదా.. ప్రజలు ఓ మాదిరిగా కూడా కనిపిచడం లేదా.. అని..!