BRS Politics :  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 105 సీట్లలో గెలుపు ఖాయమని ప్రకటించారు. వందేళ్లలో చేయేలని అభివృద్ధి చేశామని.. చేసింది చెప్పుకుంటే చాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. అత్యవసరంగా పిలిచిన నిర్వహించిన  మీటింగ్‌లో చెప్పింది ఇదే. కేసీఆర్‌కు అంత నమ్మకం ఏమిటన్నది పార్టీ నేతలకూ అర్థం కాని విషయం.  నిజానికి తెలంగాణలో ప్రస్తుతం అంత ఏకపక్ష వాతావరణం లేదని కానీ.. పార్టీ నేతల్లో నమ్మకం, ఆత్మ విశ్వాసం కల్పించడం.. నేతలు ఇతర పార్టీల వైపు చూడకుండా ఉండటానికి ఇలా చెప్పారని ఎక్కువ మంది భావిస్తున్నారు.  


గత ఎన్నికల నాటితో పోలిస్తే పూర్తిగా మారిన పరిస్థితులు


2018లో భిన్నమైన  రాజకీయ పరిస్థితులు ఉన్నాయి. అప్పటికి తెలంగాణ సెంటిమెంట్ ఇంకా చల్లారలేదు.  ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు జోక్యంతో సెంటిమెంట్ ఓటర్ల ప్రధాన ఓటింగ్ అంశం అయింది. దానికి తోటు రైతు బంధు పథకాన్ని అప్పుడే తీసుకు వచ్చారు. నేరుగా రైతులు చెక్కులు ఇచ్చి.. డబ్బులు కళ్ల జూసేలా చేశారు. దీంతో ఆ ఓటు బ్యాంక్ కలిసి వచ్చింది. రెండో సారి తిరుగులేని విజయం వచ్చింది. మరి ఇప్పుడు అప్పట్లా పరిస్థితులు ఉన్నాయా అంటే  లేవన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.  సహజ సిద్ద ఆయుధం అయిన సెంటిమెంట్ ను కేసీఆర్   వదిలేశారు.  టీఆర్ఎస్ పార్టీనే ఏకంగా బీఆర్ఎస్ అని మార్చేశారు. బెంచ్ మార్క్ పథకాలు .. ఎక్కువ మందిలో అసంతృప్తికి కారణం అవుతున్నాయి.  దళిత బంధు పథకం అందిన వారు మినహా ఇతరులు అసంతృప్తిగా ఉన్నారు. ఇతర వర్గాలు కూడా మాకేంటి అనుకుంటున్నాయన్న ప్రచారం జరుగుతోంది. 
  
రాజకీయంగా బలపడిన విపక్షాలు !


గత ఎన్నికల నాటికి కాంగ్రెస్ బలపడలేదు. ఆ పార్టీలో వర్గ పోరాటం.. టీడీపీతో  పొత్తు కారణంగా ఆ పార్టీ బలహీనం అయింది. అప్పట్లో బీజేపీ దీన స్థితిలో ఉంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ తో పాటు బీజేపీ కూడా పుంజుకున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చాలా గట్టిగా పోరాడుతోంది. ఓ వైపు రేవంత్.. మరో వైపు భట్టి విక్రమార్క పోదయాత్రలు చేస్తున్నారు. కర్ణాటకలో గెలుపు తర్వాత ఆర్థిక వనరులకు కూడా లోటు ఉండదన్న అభిప్రాయం వినిపిస్తోంది.   ఇక భారతీయ జనతా పార్టీ కూడా బలపడింది. గత ఎన్నికల్లో వేళ్ల మీద లెక్క పెట్టగలిగినన్ని  చోట్ల మాత్రమే డిపాజిట్ తెచ్చుకుంది. కానీ ఈ సారి మాత్రం ఒక్కో నియోజకవర్గానికి ఇద్దరు ముగ్గురు నేతలు పోటీ పడుతున్నారు. వారిలో ఎంత బలవంతులు అనేది పక్కన పెడితే పెరిగిన బీజేపీ క్రేజ్ ను ఈ విషయం తెలియచేస్తుంది. ఎలా చూసినా ఇప్పుడు తెలంగాణలో రెండు జాతీయ పార్టీలు బలపడ్డాయనే. 


ఓట్లు చీలుతాయనే కేసీఆర్ ధీమానా ? 


ముక్కోణపు పోటీలో మూడు పార్టీలూ హోరాహోరీగా తలపడితే మాత్రం కేసీఆర్ మూడో సారి విజయం సాధిస్తారనే అంచనా మొదటి నుంచి ఎన్నికల నిపుణులు వేస్తున్నారు.  కానీ ఇటీవలి కాలంలో జరుగుతున్న ఎన్నికల ట్రెండ్ ను చూస్తే..  ప్రజలు రేసులో ఎన్ని పార్టీలు ఉన్నా.. ఒకే పార్టీ వైపు మొగ్గుతున్నారు. మొన్న పంజాబ్.. నిన్న కర్ణాటకలను చూస్తే ఇదే అర్థం అవుతుంది. తెలంగాణలో ప్రజలు కేసీఆర్ పదేళ్ల పాలన చాలు అనుకుంటే.. ఓ ప్రత్యామ్నాయం వైపు మొగ్గుతారు. ఆ ప్రత్యామ్నాయం బీజేపీ, కాంగ్రెస్ నా అన్నది తేల్చుకుంటారు. ఓట్లు చీలిపోతే మాత్రం  బీఆర్ఎస్ కు అడ్వాంటేజ్ కనిపించవచ్చు  ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఉండాలా వద్దా అన్నది నిర్ణయించుకునేది ఈ ఆరు నెలల్లోనే. ఇప్పుడే అసలు రాజకీయం ప్రారంభమైందని అనుకోవచ్చు. కేసీఆర్ తమ నేతల్లో ఆత్మవిశ్వాసం పెంచేందుకు వంద లెక్కలు చెబుతున్నారని ఎక్కువ మంది నమ్ముతున్నారు.