GO 111 Politics :   హైదరాబాద్‌ అభివృద్ధికి ప్రతిబంధకంగా ఉన్న జీవో నెంబర్ 111ను రద్దు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. వెంటనే హైదరాబాద్ చుట్టూ మరో నగరం వెలుస్తుందని ప్రచారం ప్రారంభమయింది. అయితే   గత ఏడాది ఏప్రిల్‌లోజరిగిన కేబినెట్ భేటీలోనూ  జీవో నెంబర్ 111ను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పుడు నిర్ణయం తీసుకుంటే.. ఇప్పుడు ఎందుకు మళ్లీ రద్దు చేయాల్సి వచ్చింది ? అప్పుడు రద్దు చేయలేకపోతే ఇప్పుడు ఎలా చేస్తారు ? ఇది చాలా మందికి వస్తున్న సందేహం. నిజానికి ఈ జీవో రద్దు సుప్రీంకోర్టు దగ్గర ఉందని నిపుణులు చెబుతున్నారు.  
 
జంట జలాశయాల రక్షణ కోసం జీవో నెంబర్ 111


గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిరక్షణ కోసం జీవో నెంబర్ 111ని జారీ చేశారు.  ఈ జలాశయాల చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో కాలుష్యం కారక పరిశ్రమలు, భారీ హోటళ్లు, నివాస కాలనీలు, ఇతర కాలుష్య కారక నిర్మాణాలపై నిషేధం విధిస్తూ 1994లో తొలుత జీవో నం. 192ను తీసుకొచ్చింది. దీనికి కొన్ని సవరణలు చేస్తూ 1996 మార్చి 8న అప్పటి ప్రభుత్వం జీవో 111ను తెచ్చింది. ఈ రెండు జలాశయాల పరిరక్షణ కోసం కొన్ని ఆంక్షలను అమలు చేస్తున్నారు. మొత్తం 84 గ్రామాలు దీని పరిధిలో ఉన్నాయి. క్యాచ్మెంట్ పరిధిలో వేసే లే అవుట్లలో 60శాతం ఓపెన్ స్థలాలు, రోడ్లకు వదలాలి. అక్కడ వినియోగించే భూమిలో 90శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. అప్పట్లో హైదరాబాద్‌కు గండిపేట , హిమాయత్ సాగర్  జలాలే కీలకం. అందుకే వాటి పరిరక్షణకు జీవో తెచ్చారు.    


జీవో ఎత్తి వేయాలని 84 గ్రామాల ప్రజల సుదీర్ఘ డి్మాండ్ ! 


 కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి  రావడంతో   గండిపేట , హిమాయత్ సాగర్  జంట జలాశయాలపై ఆధారపడడం తగ్గిందని ప్రభుత్వంచెబుతోంది.   అందువల్ల జీవో 111ని ఎత్తివేయాలని ప్రజలు  కోరుతున్నారు. గండిపేట, హిమాయత్ సాగర్ జలాశయాల చుట్టూ ఆంక్షల కారణంగా.. ఆ ప్రాంతాల్లో పెద్దగా అభివృద్ధి జరగడం లేదు. మిగతా ప్రాంతాలతో పోల్చితే భూముల ధరలు కూడా తక్కువగానే ఉన్నాయి. 111 జీవోను రద్దు చేస్తే తమ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని.. భూముల ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు. చాలా కాలంగా ఈ డిమాండ్ ఉంది.  జీవో నెంబర్ 111  పరిధిలోని గ్రామాల పాలకవర్గాలు జీవోను రద్దు చేయాలని కోరుతూ.. గతంలో పలుమార్లు తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించాయి. 


జీవో రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందా ?
  
కేసీఆర్‌ ముఖ్యమంత్రి కాక‌ముందే ఎన్నిక‌ల ప్ర‌చారంలో 111 జీవోని రద్దు చేస్తామని చెబుతూ వస్తున్నారు. అధికారంలోకి వచ్చాక 2016లో ఐఏఎస్ లు ఎస్పీ సింగ్ ,ఎస్కే జోషి, దాన కిషోర్ ల‌తో ఓ క‌మిటీ ఏర్పాటు చేశారు. కానీ ఏమీ తేల్చలేకపోయారు.  2018 మార్చి 11న‌ ఎన్నికల సందర్భంగా 111 జీవోను ఎత్తేస్తామ‌ని కేసీఆర్‌ హామీ ఇచ్చారు. అయితే.. 1999లోనే పరిశ్రమ ఏర్పాటుకు ఓ వ్య‌క్తి ప్ర‌య‌త్నిస్తే.. పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డ్ సుప్రీం కోర్టు వ‌ర‌కు వెళ్లింది. అప్పుడే ప్రికాష‌న‌రీ ప్రిన్సిపుల్ కింద డివిజ‌న్ బెంచ్ చాలా స్ప‌ష్ట‌మైన తీర్పునిచ్చింది. 111 జీవోని ఎట్టి ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వం తన‌కు అనుకూల‌మైన వారికి మేలు చేసేలా చేయ‌రాద‌ని తెలిపింది.    కేవ‌లం తాగునీటి ఎద్ద‌టి తీరింద‌ని ర‌ద్దు చేసే అవ‌కాశాలు లేవని. ఇంకా చాలా అంశాలు చూడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. 


జీవో 111 రద్దయితే  ప్రభుత్వానికీ భారీగా భూములు !


ఈ జీవో పరిధిలో దాదాపు 538 చదరపు కిలోమీటర్ల భూమి ఉంది. ఈ జీవో తీసేస్తే దాదాపు లక్షా 32 వేల ఎకరాల భూమి అందుబాటులోకి వస్తుందని ఒక అంచనా.  ఈ భూమిలో ప్రభుత్వానికి చెందినదే 18 వేల ఎకరాలకు పైగా ఉంది. దీంతో హైదరాబాద్ విస్తరణ అవకాశం బాగా పెరుగుతుంది. ఇక ప్రైవేటు భూముల్లో జరిగే రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించి చెప్పాల్సిన పని లేదు. కానీ కేసీఆర్ రెండు సార్లు కేబినెట్ సమావేశంమలోనేనిర్ణయించారంటేనే.. రద్దు సాధ్యం కాదని అర్థమని.. ఎక్కువ మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు.