Karnataka CM: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య నేడు ప్రమాణం చేయనున్నారు. దీనికి బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ(శనివారం, మే 20న) మధ్యాహ్నం 12.30కి ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుంది. ముఖ్యమంత్రి సిద్దరామయ్యతోపాటు డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణం చేయనున్నారు.


 మంత్రివర్గంలో చోటు దక్కించుకున్న కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇదే వేదికపై ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి ముందు సిద్ధరామయ్య, శివకుమార్ ఢిల్లీకి చేరుకుని కొత్త మంత్రివర్గంలో చేర్చుకోవాల్సిన ఎమ్మెల్యేల పేర్లు, కేటాయించాల్సిన శాఖలపై హైకమాండ్ తో చర్చించారు.


సిద్ధూ ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అధినాయకత్వం దిగిరానుంది. పోనియా, రాహుల్, ప్రియాంక, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సూర్జేవాలా సహా పార్టీ అగ్రనాయకులంతా బెంగళూరు రానున్నారు. 


సిద్ధూ ప్రమాణ స్వీకారోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేష్‌ బఘేల్‌, రాజస్థాన్ సీఎం అశోక్‌ గెహ్లోత్‌, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్‌విందర్‌ సింగ్, బిహార్‌ సీఎం నీతీష్ కుమార్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ హాజరుకానున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌, పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీకు ఆహ్వానాలు అందినప్పటికీ హాజరుకావడం లేదని తెలుస్తోంది.  


వివిధ రాష్ట్రాల సీఎంలతోపాటు వివిధ పార్టీ లీడర్లు పట్టాభిషేకానికి హాజరుకానున్నారు. సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేశ్ యాదవ్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్ పార్టీ నేత శరద్‌పవార్, మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే, బిహార్‌ డిప్యూటీసీఎం తేజస్వీయాదవ్, నేషనల్‌ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్బుల్లా హాజరుకానున్నట్టు అంచనా వేస్తున్నారు. 


ప్రమాణ స్వీకారోత్సవం ఏర్పాట్లను డీకే శివకుమార్ దగ్గరుండి పరిశీలించారు. పోలీసులు అధికారులు, ఇతర యంత్రాంగంతో మాట్లాడి సూచనలు సలహాలు ఇచ్చారు. భారీగా జనం కూడా వచ్చే ఛాన్స్ ఉన్నందున ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడాలని అధికారులకు హితవు పలికారు. 


మంత్రి వర్గంపై ఉత్కంఠ
మంత్రివర్గంలో ఎవరెవరు ఉంటారనేదానిపై పెద్ద చర్చే నడుస్తోంది. ఆశావహులంతా ఢిల్లీలో చక్కర్లు కొడుతున్నారు. తమకూ ఓ అవకాశం ఇవ్వాలంటూ రిక్వస్ట్‌లు పెట్టుకుంటున్నారు. ఈసారి కాకుండా ఇంకెప్పుడు అంటూ మరికొందరు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు హస్తినలో మంత్రాంగం నడుపుతున్నారు. ఇలా ఆశావాహులతో ఢిల్లీ, బెంగళూరు కిక్కిరిసిపోతోంది. ఫోన్లు, మెసేజ్‌లతో హోరెత్తిపోతోంది. 
సీఎం కురర్చీలో ఎవరు కూర్చోవాలో తేల్చేందుకు నాలుగు రోజులు సమయం తీసుకున్న కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇప్పుడు మరో సవాల్ రెడీగా ఉంది.


అసలు సిద్దూ జట్టులోకి ఎవర్ని తీసుకోవాలనేది కూడా సవాల్ లాంటిదే. అందరికీ సమన్యాయం చేస్తూనే మంత్రివర్గ విస్తరణ చేపట్టడం అంత తేలికైన పనేం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఆయా కమ్యూనిటీలని రిప్రజెంట్ చేసేలా ఓ మంత్రి తప్పకుండా ఉండాలని చూస్తోంది అధిష్ఠానం. ఇక్కడే తడబడుతున్నట్టు సమాచారం. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది. హైకమాండ్ వాళ్లకు ఆ మినిస్ట్రీ ఇవ్వకపోతే...అలకలు ఖాయం. మళ్లీ మునుపటి పరిస్థితే ఎదురవచ్చు. గెలిచిన వాళ్లు తిరుగుబావుటా ఎగరేస్తే కాంగ్రెస్‌కి కష్టాలు తప్పవు. అయితే...దీనిపై ఇప్పటికే హైకమాండ్ క్లారిటీగా ఉన్నట్టు సమాచారం. 


2013లో ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసిన సిద్ధరామయ్య రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన 61 ఏళ్ల శివకుమార్ వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికల వరకు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు.


Also Read: కర్ణాటక ఫజిల్‌ను 72 గంటల్లో కాంగ్రెస్ ఎలా ఛేదించింది, శివకుమార్‌ను ఎలా కూల్ చేసింది, సిద్దూని ఎలా సీఎంను చేసింది?


Also Read: రైతు కుటుంబంలో పుట్టిన సిద్ధరామయ్య రెండు సార్లు కర్ణాటక సీఎంగా ఎలా అయ్యారు?