Karnataka CM Siddaramaiah: కర్ణాటకలో అఖండ విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును ప్రకటించింది. రాష్ట్రంలో మాస్‌ లీడర్‌గా పాపులర్ పొందిన సిద్ధరామయ్య వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపింది. దీంతో ఐదేళ్ల విరామం తర్వాత మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కుర్చీపై సిద్ధరామయ్య ఆసీనులు కాబోతున్నారు. ఈ మేరకు సిద్ధరామయ్య తన కొత్త జట్టుతో కలిసి మే 20వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 


రైతు కుటుంబంలో పుట్టి తిరుగులేని రాజకీయ నాయకుడిగా..


సిద్ధరామయ్య సాధారణ రైతు కుటుంబంలో పుట్టి పెరిగారు. మైసూరు సమీపంలోని సిద్ధరామనహుండిలో 1948 ఆగస్టు 12వ తేదీన జన్మించారు. తల్లిదండ్రులు ఇద్దరూ చదువుకోలేదు. ఈయన రాష్ట్రంలో మూడో అతి పెద్ద సమాజిక వర్గమైన కురుబ (ఓబీసీ)కి చెందిన వారు. చిన్నప్పటి నుంచి చదువుపై ఎక్కువగా ఆసక్తి ఉన్న సిద్ధరామయ్య ఉన్నత చదువులు చదివారు. మైసూరులో న్యాయవాదిగా, న్యాయశాస్త్ర  అధ్యాపకుడిగా పని చేశారు. రైతు ఉద్యమాల్లో పాలుపంచుకుంటూ రైతు నాయకుడు నంజుండస్వామి ప్రియ శిష్యుడిగా మారిపోయారు. ఆయన స్ఫూర్తితోనే 1978లో తాలూకా బోర్డు సభ్యుడిగా ఎన్నికై తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తర్వాత తిరుగులేని నాయకుడిగా మారారు. 1963లో తొలిసారి చాముండేశ్వరి అసెంబ్లీ స్థానం నుంచి భారతీయ లోక్ దళ్ అభ్యర్థిగా పోటీ చేసి సంచలన విజయం సాధించారు. ఆ తర్వాత జనతా పార్టీలో చేరారు. అప్పటి సీఎం రామకృష్ణ హెగ్డే మాతృభాష పరిరక్షణ కోసం స్థాపించి కన్నడ కావలు సమితి తొలి అధ్యక్షుడిగా సమర్థంగా పని చేశారు.


Also Read: ప్రజల సంక్షేమమే ఫస్ట్ ప్రియారిటీ, కలిసికట్టుగా పని చేస్తాం - డీకే శివకుమార్


తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సిద్ధూ..


1985 ఎన్నిక్లలో గెలిచి హెగ్డే ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. 1989 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1992లో జనతాదళ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 1994ల ఎన్నికల్లో గెలిచి దేవెగౌడ నాయకత్వంలోని జనతాదళ్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పని చేశారు. దేవెగౌడ ప్రధాని పదవి చేపట్టడంతో 1996లో జేహెచ్ పటేల్ సీఎం అయ్యారు. అనంతరం సిద్ధరామయ్య ఉపముఖ్యమంత్రి పదవిలో వచ్చారు. జనతాదళ్ జేడీఎస్, జేడీయూగా చీలి పోవడంతో సిద్ధరామయ్య దేవెగౌడ నాయకత్వంలోని జేడీఎస్‌లో చేరి రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. 1999 విధాన సభ ఎన్నికల్లో ఓడిపోయారు. 2004లో ఏర్పడిన కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా పని చేశారు. అయితే దేవగౌడ తన తనయుడు కుమారస్వామిని ముందుకు తెచ్చేందుకు 2006లో పార్టీ నుంచి సిద్ధరామయ్యను సస్పెండ్ చేశారు. దీంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. 2008 ఎన్నికల్లో గెలిచి సీఎల్పీ నేతగా ఎన్నికయ్యారు. 1983 నుంచి ఇప్పటి వరకు సిద్ధరామయ్య మొత్తం 9 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక అయ్యారు. 


Also Read: కర్ణాటక సీఎం పదవిపై ఉత్కంఠకు తెర, సిద్దరామయ్యకే ఓటు వేసిన హైకమాండ్


సిద్ధరామయ్యకు కర్ణాటకలో మంచి మాస్‌ ఇమేజ్ ఉంది. దేవరాజ్ అరసు తర్వాత ఐదేళ్ల పాటు సీఎంగా పని చేసింది ఈయన ఒక్కరే. అహింద (బలహీన వర్గాల) సముదాయానికి ప్రతినిధిగా ఉండేందుకు ఇష్టపడే సిద్ధరామయ్య జనతా పరివార్ నుంచి 2006లో కాంగ్రెస్ లోకి వచ్చినా పార్టీ భావజాలాన్ని సులువుగానే ఒంటపట్టించుకున్నారు. జనతాదళ్ లోనూ డిప్యూటీ సీఎంగా, ఆర్థిక మంత్రిగా పని చేసి ఇప్పటి వరకూ 13 సార్లు బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. అలాగే 2013లో కాంగ్రెస్ పార్టీ 122 సీట్లతో ఘనవిజయం సాధించడంలో సిద్ధూ కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా అద్భుతమైన పథకాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. అధిష్టానం కూడా తాను చెబితే వినే స్థాయిలో ఉందటేనే సిద్ధూ పొజిషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. డీకే శివకుమార్ తో తనకు పోటీ ఉన్నప్పటికీ.. అంతా కలిసికట్టుగా పని చేసి పార్టీని గెలిపించడంలో సిద్ధరామయ్య ప్రముఖ పాత్ర పోషించారు. అదే ఆయనను మరోసారి సీఎంను చేసింది.