AP Govt Finance:   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై చాలా రోజులుగా చర్చ జరుగుతోంది.  అలవి మాలిన అప్పులు చేస్తున్నారని సంక్షేమం పేరుతో అనుత్పాదక వ్యయం చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయితే ఏపీ సర్కార్ మాత్రం పట్టించుకోవడం లేదు. తాము చేయాలనుకున్నది చేస్తోంది. కాగ్‌కు సరిగ్గా లెక్కలు చెప్పడం లేదన్న విమర్శలు కూడా వస్తున్నాయి. కారణం ఏదైతేనేం చాలా ఆలస్యంగా నాలుగు నెలల లెక్కలు తేలాయి . ఈ నాలుగు నెలల కాలంలో ఏపీ ఆదాయం.. ఖర్చులు చూస్తే.. మునిగిపోవడానికి సిద్ధంగా ఉన్న నౌకలా ఆర్థిక నిపుణులకు అనిపించడం ఖాయం. 


నాలుగు నెలల్లో ఆదాయం కన్నా రెట్టింపు వ్యయం 


ఆర్థిక సంవత్సరంలో తొలి నాలుగు నెలలు గడిచేసరికి ఆదాయం కన్నా వ్యయం దాదాపు రెట్టింపుగా నమోదైరది. ఇదే సమయంలో ఆదాయ, ద్రవ్య లోటు కూడా భారీగా పెరిగింది.  జులై నాటికి కాగ్‌ ప్రకటించిన నివేదికలో ఈ విషయాలు పేర్కొన్నారు. ఏడాది మొత్తానికి రూ.1.91 లక్షల కోట్లు ఆదాయం లభించాల్సి ఉండగా, నాలుగు నెలల్లో రూ.45,575 కోట్లు సమకూరింది. ఇది మొత్తం లక్ష్యంలో 23.83 శాతంగా ఉంది. గతేడాది 23.15 శాతం సమకూరింది. ఇదే సమయంలో వ్యయం మాత్రం ఏకంగా రూ.86,281 కోట్లుగా నమోదైంది. మొత్తం బడ్జెట్‌ అంచనాలో ఇది 36.11 శాతంగా ఉంది. ఇది గతేడాదితో పోల్చి చూస్తే దాదాపు సమానం. 


రెండింతలైన ఆదాయ లోటు !


ఆదాయ లోటు  బడ్జెట్‌ అంచనాకన్నా రెట్టిరపునకు పైగా నమోదైరది. బడ్జెట్‌లో రూ.17,036 కోట్లుగా అంచనా వేయగా, తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా రూ.37,849 కోట్లకు చేరిపోయింది. అరటే 220 శాతం లోటుగా ఉందని కాగ్‌ పేర్కొంది. ఇక ద్రవ్య లోటు కూడా అదే స్థాయిలో ఉంది. బడ్జెట్‌లో రూ.48,724 కోట్లుగా అంచనా వేయగా, నాలుగు నెలల్లోనే రూ.42,181 కోట్లకు చేరిపోవడం విశేషం. మొత్తం వ్యయంలో రెవెన్యూ వ్యయం రూ.83,064 కోట్లు కాగా, పెట్టుబడి వ్యయం కేవలం రూ.3,216 కోట్లుగా రికార్డయ్యిరది. ఇది మొత్తం అంచనాలో కేవలం 10.48 శాతం మాత్రమే .  పెట్టుబడి వ్యయం ఎక్కువ పెడితే.. తర్వాత అప్పులకు అదనపు పర్మషన్ వస్తుంది. లేకపోతే లేదు. 


ఐదు నెలల్లోనే రూ. యాభై వేల కోట్లకుపైగా అప్పు !


రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఏపీ సర్కార రూ.1000 కోట్ల రుణం తీసుకుంది. 12 సంవత్సరాలకు 7.71 శాతం వడ్డీతో సెక్యూరిటీ బాండ్లను వేలం వేసి ఈ రుణం తీసుకుంటోంది. వడ్డీ ఎక్కువగా ఉన్నప్పటికీ ఏపీ సర్కార్ తప్పని పరిస్థితుల్లో ఇలా అప్పు తీసుకుంది. అలాగే ఇప్పటి వరకూ ఈ ఆర్థిక ఏడాదిలో వివిధ సంస్థల నుంచి రూ.49,000 కోట్ల రుణాన్ని ఏపీ తీసుకుంది. దీనికి కార్పొరేషన్ల రుణాలు అదనం. అంటే ఈ ఏడాది ఇక ఏపీ ప్రభుత్వం ఎలాంటి అప్పులు చేయడానికి పర్మిషన్ లభించదు. ఇక అప్పులు పుట్టకపోతే ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతుంది. జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతుంది. 


కేంద్రం కరుణించకపోతే గడ్డు  పరిస్థితే !


కేంద్రంతో ఉన్న సన్నిహిత సంబంధాలతో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఢిల్లీలోనే ఎక్కువ కాలం ఉంది. అప్పులకు అదనపు పర్మిషన్ సాధించుకొస్తున్నారు. కానీ ఎంత కాలం కేంద్రం ఇలా చల్లటి చూపు చూస్తుందనేది కీలకమైన అంశంగా మారింది. కేంద్రం కూడా మా వల్ల కాదు అంటే అప్పుడు ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. పథకాలు కాదు కదా ఇప్పటి వరకూ చేసిన అప్పులు తీర్చడానికి కూడా కష్టమవుతుంది. అందుకే ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక నిపుణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.