Jaganannaku Chebudam : జగనన్నకు చెప్పుకుందాం అనే  వినూత్న కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించారు.  తొలిరోజే ప్రజల నుండి విశేష ఆదరణ లభిచింది. ప్రజలు పెద్ద ఎత్తున తమ సమస్యలను చెప్పుకునేందుకు ప్రయత్నించారు. ఒక దశలో ఫోన్‌ కాల్స్‌ కలవక ఫిర్యాదు దారులు ఇబ్బందులు పడ్డారు.    అందిన ఫిర్యాదులను శాఖల వారీగా వేరుచేసేందుకు సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రత్యేకంగా మోనటరింగ్‌ సెల్‌ ఏర్పాటు చేశారు. ఎంత వేగంగా స్పందిస్తే అంత ప్రజల మద్దతు పొందే అవకాశం ఉంది. అందుకే ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. 


వేగవంతమైన పరిష్కార ప్రక్రియ


అక్కడి నుండి వచ్చిన కాల్స్‌ వచ్చినట్లే సంబంధిత శాఖలకు అధికారులు స్పాట్‌లో బదలాయిస్తున్నారు. సామాన్య ప్రజల నుండి అందుకున్న ఫిర్యాదును సీఎం దగ్గర నుండి సంబంధిత శాఖ ప్రధాన కార్యదర్శికి, అక్కడ నుండి కమిషనర్‌కు, అక్కడ నుండి జిల్లా కలెక్టర్‌, మున్సిపల్‌ కమిషనర్లకు, అక్కడ నుండి మండలానికి, అక్కడ నుండి గ్రామ, వార్డు సచివాలయాలకు అత్యంత వేగంగా పంపేశారు. అందుకు సంబంధించి మెస్సేజ్‌ రూపంలో ఫిర్యాదు దారుడికి సమాచారం అందించారు. పిర్యాదు దారుడు చేసిన పిర్యాదుకు సంబంధించి పూర్తి సమాచారాన్ని క్షణాల్లో తెప్పించుకునేలా ఏర్పాట్లు చేశారు.  ఈ తంతంగం అంతా సీఎం జగన్‌ కూడా నేరుగా పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి సమస్యకు ఒక టైం బౌండ్‌ నిర్ణయించి ఆ సమయంలోగా దానిని పరిష్కరించాల్సి ఉంది.  


సంక్షేమ పథకాలు అందడం లేదనే ఫిర్యాదులు ఎక్కువే ! 


జగనన్నకు చెప్పుకుందామని వస్తున్న ఫిర్యాదుల్లో అత్యధికంగా రెవెన్యూ, పోలీస్‌, పెన్షన్లు వంటివాటిపైనే అధికంగా వచ్చినట్లు తెలుస్తోంది.  రెవెన్యూ, పోలీస్‌ శాఖలపై పెద్ద సంఖ్యలో ప్రజలు ఫిర్యాదులు చేశారని చెబుతున్నారు.    ఈ నంబర్‌కు కాల్‌ చేసిన కొంత మంది తమ ప్రాంతంలో రాజకీయ నేతల తీరుపై కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఐవీఆర్‌ఎస్‌ కాల్‌ రికార్డింగ్‌ అవుతుంది కాబట్టి తమ సమస్య తమ ప్రియతమ నేతకు తెలుస్తుందని భావించే వారు కాల్స్‌ చేసినట్లు తెలుస్తోంది. ఆది నుండి పార్టీ జెండా మోసిన తాము పార్టీకి దూరంగా ఉంటున్నామని, తమపై సొంత పార్టీవారే కేసులు పెట్టారని కొంత మంది, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని మరికొంత మంది ఇలా రకరకాలుగా ఫిర్యాదు చేసినట్లు చాలా జిల్లాల్లో పార్టీ నేతల మధ్య చర్చ జరిగింది. అయితే ఇది  పార్టీ పరమైన కార్యక్రమం కాదని అలాంటి కాల్స్ ను పరిగణనలోకి తీసుకోవడం లేదంటున్నారు. 
 
రాజకీయ విమర్శలకు చెక్ పెట్టేలా పరిష్కారాలు! 


జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించిన తొలి రోజే విపక్షాలు  విమర్శలు గుప్పించాయి. ఎక్కడ సమస్యలు లేవని ప్రత్యేకంగా చెప్పాలని టీడీపీ ప్రశ్నించింది. జగనన్నకు చెప్పుకోవడం అంటే చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లేనని బీజేపీ మండిపడింది.  సమస్య ఏదైనా తమ బాధను స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చెప్పుకునే అవకాశాన్ని మాత్రం ప్రజలు సద్వినియోగం చేసుకుంటారని.. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.  పనితీరుతోనే రాజకీయ విమర్శలకు చెక్ పెడతామంటున్నారు.