Revant Vs Talasani :  తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ల మధ్య పిసుకుడు చాలెంజ్ ప్రారంభమయింది.   కాంగ్రెస్ యువ సంఘర్షణ‌ సభలో ప్రియాంకగాంధీ యూత్‌ డిక్లరేషన్ ప్రకటనపై స్పందించేందుకు మంగళవారం ప్రెస్ మీట్ పెట్టిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రేవంత్ రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు.  ‘‘ఓ పొట్టోడు ఎమ్మెల్యేలను, మంత్రులను అందరినీ వాడు, వీడు అని మాట్లాడుతుండు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందు.. పిసికితే పాణం పోతది’’’ అని పరోక్షంగా రేవంత్‌రెడ్డినుద్దేశించి తలసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడి్యాలో వైరల్ అయ్యాయి.                                   


తలసాని చేసిన కామెంట్లు దుమారం రేపడంతో . రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. తలసానిని దున్నపోతుతో పోల్చి తీవ్ర విమర్శలు చేశారు.  దున్నపోతులతో తిరిగిన దున్నపోతు తలసాని శ్రీనివాస్‌యాదవ్ అని, మొదట్నుంచి పశువుల పేడ పిసుక్కున్న అలవాటు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు ఉందని, అందుకే పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి  సెటైర్ వేశారు.   అరటిపండ్ల బండి దగ్గర మేక నమిలినట్టు గుట్కాలు నమిలే వ్యక్తులు కూడా తన గురించి మాట్లాడే వాళ్ళేనా అని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్ కు అంత పిసుకుడు కోరిక ఉంటే,ఎక్కడికి ఎప్పుడు రావాలో చెబితే తాను వస్తానని,అప్పుడు ఎవరు ఏం పిసుకుతారో అర్థమవుతుందని సవాల్ చేశారు.                                        


కేసీఆర్ కాళ్లు పిసికినట్టు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డిని పిసకటం అంటూ  మండిపడ్డారు.  మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. తాను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని అని పేర్కొన్న రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ జీవితకాలం కేసీఆర్ చెప్పులు మోసిన, కేటీఆర్ సంక నాకినా ఈ స్థాయికి రాలేరని తేల్చిచెప్పారు. ఇంకా ఏదైనా మోజుంటే, మోజు తీర్చుకోవాలంటే తాను వస్తానని రేవంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ కు తేల్చి చెప్పారు.                              


రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయడంతో తలసాని కూడా స్పందించే అవకాశం ఉంది. ఇద్దరూ ఒకప్పుడు టీడీపీలో కలిసి పని చేసిన వారే. 2014లో  ఇద్దరూ టీడీపీ నుంచి గెలిచారు. తర్వాత తలసాని టీఆర్ఎస్‌లో చేరి మంత్రి అయ్యారు. అప్పట్లో కూడా రేవంత్ రెడ్డి, తలసాని మధ్య ఘాటు విమర్శలు చోటు చేసుకునేవి. ఇప్పుడు మరోసారి..తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆయనను పిసికిస్తానని చేసిన వ్యాఖ్యలతో మరోసారి దుమారం ప్రారంభమయింది.