CPS Politics :  కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్‌)ను రద్దు చేసి, ఓల్డ్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఓపీఎ్‌స)ను అమలు చేస్తామని హిమాచల్ ప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ వర్కవుట్ అయింది. ఆ పార్టీకి అధికారం లభించింది. ఇప్పటికే రాజస్థాన్‌, పంజాబ్, చత్తీస్‌ఘడ్ ప్రభుత్వాలు కూడా సీపీఎస్ రద్దు చేస్తున్నట్లుగా ప్రకటించాయి.  కేంద్ర ప్రభుత్వం సీపీఎస్‌ ను రద్దు చేసి, ఓపీఎ్‌సను అమలు చేసుకునే అధికారం రాష్ట్రాలకే ఉంటుందని ప్రకటించింది.  రాజస్థాన్‌ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఓపీఎ్‌సను అమలు చేస్తామని ప్రకటించింది. దీంతో సీపీఎస్‌ ను రద్దు చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్న విషయం స్పష్టమైనట్లయింది.  


2004 నుంచి సీపీఎస్‌ అమలు...!


సీపీఎస్‌ సమస్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2004లో రాజుకుంది. అప్పట్లో తొలుత కేంద్ర ప్రభుత్వం ఓపీఎస్‌ స్థానంలో ఉద్యోగుల చందా(కాంట్రిబ్యూషన్‌) ఆధారిత ‘నేషనల్‌ పెన్షన్‌ స్కీమ్‌(ఎన్‌పీఎ్‌స)’ను అమల్లోకి తెచ్చింది. 2004 జనవరి 1 తర్వాత నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఇది వర్తిస్తుందని పేర్కొంది. నాటి ఉమ్మడి ఏపీలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కూ డా ఈ ఎన్‌పీఎస్‌ మాదిరిగానే రాష్ట్రంలో సీపీఎ్‌సను అమ లు చేయడానికి ముందుకొచ్చింది. ఈ మేరకు 2004 సెప్టెంబరు 1 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ సీపీఎ్‌సను వర్తింపజేస్తూ 2004 సెప్టెంబరు 22న జీవో నంబర్‌ 653ను జారీ చేసింది. ‘ఆంద్రప్రదేశ్‌ పెన్షన్‌ రూల్స్‌-1980’ను సవరిస్తూ సీపీఎస్‌ ను అమల్లోకి తెచ్చింది.  


ఓపీఎస్‌కు, సీపీఎస్‌కు ఇదీ తేడా...!


ఓపీఎస్‌ కింద.. ఉద్యోగి రిటైరయ్యాక ప్రతి నెలా సర్వీస్‌ పెన్షన్‌ అందేది. అంటే.. ఉద్యోగి రిటైరైన చివరి నెలలో ఉన్న వేతనంలో 50 శాతాన్ని సర్వీస్‌ పెన్షన్‌ కింద ప్రభుత్వం చెల్లించేది. ఒకవేళ పెన్షనర్‌ చనిపోతే.. అతని భార్యకు, ఆ తర్వాత వారిపై ఆధారపడే దివ్యాంగులైన, పెళ్లికాని పిల్లలకు పెన్షన్‌ అందేది. చివరి నెలలో రూ.50 వేల వేతనం ఉంటే... నెలకు రూ.25 వేల వరకు పెన్షన్‌ వచ్చేది. ఇది కుటుంబ పోషణకు, చరమాంకంలో పెన్షనర్లకు బాసటగా ఉండేది. కానీ, సీపీఎస్‌ లో ఈ సౌకర్యం లేదు. సీపీఎస్‌ అనేది ఉద్యోగి చందా ఆధారిత స్కీమ్‌. ఈ స్కీమ్‌ కింద ఉద్యోగుల మూలవేతనం, డీఏ(కరువు భత్యం)ల నుంచి ప్రతి నెలా 10 శాతం చొప్పున కట్‌ చేస్తారు. ప్రభుత్వం కూడా మరో 10 శాతం చందాను కలుపుతుంది. ఈ మొత్తాన్ని ఎన్‌పీఎ్‌స-ఎన్‌ఎ్‌సడీఎల్‌కు బదిలీ చేస్తారు. అక్కడ ఉద్యోగి ‘పర్మినెంట్‌ రిటైర్‌మెంట్‌ అకౌంట్‌ నెంబర్‌(ప్రాన్‌)’లో జమ చేస్తారు. దీనిని ఎన్‌ఎ్‌సడీఎల్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న బ్యాంకులకు కు బదిలీ చేసి, అక్కడి నుంచి షేర్‌ మార్కెట్‌లో పెట్టిస్తారు. ఉద్యోగి రిటైర్‌ అయిన తర్వాత అప్పటివరకు ప్రాన్‌లో జమ అయిన మొత్తం సొమ్ము నుంచి ఉద్యోగికి 60 శాతం చెల్లించేస్తారు. మరో 40 శాతం సొమ్మును షేర్‌ మార్కెట్‌లోనే కొనసాగిస్తూ వచ్చే లాభ నష్టాలతో కలిపి ఎంతో కొంత ప్రతి నెలా పెన్షన్‌ రూపంలో చెల్లిస్తారు. షేర్‌ మార్కెట్‌లో వచ్చే లాభ నష్టాల ఆధారంగా ఉద్యోగికి పెన్షన్‌ వస్తుంది. షేర్లు నష్టాల్లో కొనసాగితే పెన్షనర్‌ ఆ కాలమంతా మైన్‌సలోకి వెళుతున్నారు. పెన్షన్ అందడం లేదు.  


ఓపీఎస్‌తో ఎన్నో ప్రయోజనాలు...!


ఓపీఎస్‌ కింద నిశ్చింతగా సగం వేతనం వచ్చేదని, ఉద్యోగులు చెబుతున్నారు. రిటైరయ్యాక... కమ్యూటేషన్‌ కింద ఒక ఉద్యోగికి ఓపీఎ్‌సలో కొన్ని సంవత్సరాల మొత్తం పెన్షన్‌ను అడ్వాన్సుగా పొందే వీలుండేది. ఇంటి నిర్మాణం, పిల్లల పెళ్లిళ్లు, ఫీజుల కోసం ఈ అడ్వాన్సులను తీసుకోవచ్చు. ప్రభుత్వం పలు దఫాలుగా పెంచే డీఏ, పీఆర్సీ ఫిట్‌మెంట్‌లు పెన్షనర్లకూ వర్తిసాయి. కానీ, సీపీఎస్‌ ఉద్యోగులకు ఇవేవీ వర్తించవు. ఒకసారి ప్రభుత్వంతో బంధం తెగిపోయిన తర్వాత పెన్షన్‌ కోసం షేర్‌ మార్కెట్‌ హెచ్చుతగ్గులపైనే ఆధారపడాల్సి వస్తుంది. ఇక రిటైర్‌ అయిన ఓపీఎస్‌ ఉద్యోగులకు ఇచ్చే రూ.16 లక్షల గ్రాట్యుటీ కూడా సీపీఎస్‌ ఉద్యోగులకు లేకపోగా ఇటీవలే ఉద్యోగులు పోరాడి దీనిని సాధించుకున్నారు. ఇన్ని రకాలుగా నష్టం కలిగిస్తున్న సీపీఎ్‌సను రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. కాగా, సీపీఎస్‌ ను అమలు చేయడం, రద్దు చేసుకోవడం రాష్ట్రాల పరిధిలోని అంశమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 


సీపీఎస్ రద్దు చేస్తే రాష్ట్రాలపై భారం 
  
సిపిఎస్‌ రద్దు నేడు ఎన్నికల ఎజెండాగా మారింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగించుకున్న హిమాచల్‌ ప్రదేశ్‌, తాజాగా ఎన్నికల నగారా మోగిన గుజరాత్‌ రాష్ట్రాల్లో సిపిఎస్‌ రద్దు అంశాన్ని ఎజెండా పైకి తెచ్చారు ఉద్యోగులు. ఇప్పుడు దేశంలో ఓపిఎస్‌ అమలవుతున్న రాష్ట్రాల సంఖ్య ఐదుకు చేరింది. ఏడుకు చేరే దారి వెదకాలి. అలాగే 2023 మే, డిసెంబర్‌ నెలల మధ్య కర్ణాటక, తెలంగాణ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికలు ముందుకొస్తున్నాయి. 2022, 2023 ఎన్నికల్లో ఆశించిన విధంగా సిపిఎస్‌ రద్దుకు కట్టుబడిన ప్రభుత్వాలు వచ్చినట్లైతే, 2024 జాతీయ ఎన్నికల నాటికి సిపిఎస్‌ రద్దు విషయాన్ని ప్రధాన రాజకీయ పార్టీలు విస్మరించలేని ఒక అనివార్య పరిస్థతి ఏర్పడుతుందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.  


ఓపీఎస్ అమలుచేస్తే రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారుతుందనే  వాదన !


ఉద్యోగుల పాత పెన్షన్‌ విధానం (ఓపీఎస్‌) పునరుద్ధరణ వల్ల రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.  ప్రభుత్వాలపైన పెను భారం పడుతుందని, ఇది పన్ను చెల్లింపుదారులపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని నీతి ఆయోగ్‌ ఇప్పటికే అంచనావేసింది.  ఆర్థిక పరిపుష్టి, సుస్థిర వృద్ధిరేటు సాధించాల్సిన ఈ సమయంలో ఇలాంటి నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు గొడ్డలిపెట్టులా మారుతాయని నీతి ఆయోగ్ చెబుతోంది.  హిమాచల్‌ప్రదేశ్‌లో తాము గెలిస్తే ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని అధికార కాంగ్రెస్‌తోపాటు బీజేపీ హామీ ఇచ్చింది. జార్ఖండ్‌, పంజాబ్‌ కూడా ఓపీఎస్‌కు మారాలని నిర్ణయించాయి.  రాష్ర్టాలన్నీ తమ నిర్ణయాలను అమలుచేస్తే ప్రస్తుతానికి ప్రభుత్వాలు లాభపడినా, భవిష్యత్తులో గడ్డుకాలం తప్పదన్న అంచనాలున్నాయి. 


కారణం ఏదైనా సీపీఎస్ రద్దు ఇప్పుడు క్లిష్టమైన అంశం. .. ఓ వైపు రాజకీయ ప్రయోజనాలు..మరోవైపు రాష్ట్రాల ఆర్థిక ప్రయోజనాలు ఇందులో ముడిపడి ఉన్నాయి.