AP PM Kisan Funds :  రైతులకు పెట్టుబడి సాయం చేసేందుకు కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం లబ్దిదారులు ఎప్పటికప్పుడు తగ్గిపోతూ వస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో సాయం అందుకునే రైతుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతూ వస్తోంది. ఈ పథకం ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసాకు లింక్ పథకం కావడంతో...  రైతుల్లో గందరగోళం ఏర్పడుతోంది. ప్రభుత్వం చెబుతున్న రూ. 13500 మొత్తం అందుకుంటున్న వారు రాను రాను తగ్గిపోతున్నారు. 


పీఎం కిసాన్ పేరుతో కేంద్రం రూ. ఆరు వేలు - రైతు భరోసా  పేరుతో రాష్ట్రం రూ. ఏడున్నర వేలు!


పీఎం కిసాన్ పేరుతో రైతులకు ఏటా మూడు సార్లు ఒక్కో సారి రూ.రెండు వేల చొప్పున   రూ.ఆరు వేలు రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేస్తున్నారు. అయితే ఈ పథకం లబ్దిదారులు ఎప్పటికప్పుడు తగ్గిపోతున్నారు. కేంద్రం ప్రభుత్వం విధిస్తున్న కొత్త కొత్త నిబంధనల వలన అన్నదాతలు చిన్నపాటి సర్కారీ సాయానికీ దూరమవుతున్నారు. సంవత్సరంలో నాలుగు మాసాలను ఒక పిరియడ్‌గా పేర్కొని ఒక్కో పిరియడ్‌కు రూ.రెండు వేల వంతున నగదు బదిలీ చేస్తున్నారు. ఏప్రిల్‌-జులై, ఆగస్టు-నవంబర్‌, డిసెంబర్‌-మార్చి ల్లో ఇస్తున్నారు.   


ఏపీలో అంతకంతకూ తగ్గిపోతున్న లబ్దిదారులు !


2021-22 చివరన డిసెంబర్‌-మార్చి కాలానికి ఆంధ్రప్రదేశ్‌లో 47,64,482 మందికి రూ.రెండు వేల చొప్పున ఇచ్చారు. ఈ ఆర్థిక సంవత్సరం 2022-23 తొలి కిస్తు ఏప్రిల్‌-జులై కి 46,62,768 మందికి  మాత్రమే లబ్దిదారులయ్యారు. అంటే లక్ష మందికిపైగా రైతులు పథకానికి దూరమయ్యారు. రెండు నెలల కిందట జమ చేసిన రెండో విడత నగదు కేవలం 42 లక్షల మందికే వచ్చింది.అంటే మరో  మరో  4 లక్షల  60 వేల మంది  లబ్ధి దారులు తగ్గిపోయారు. ఈ సారి ఈ కేవైసీ నిబంధన  పెట్టడంతో ఇంకా తగ్గిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ఏపీలో మొత్తం అర్హులైన రైతులు 60 లక్షల మంది పైనే ! 


ఆంధ్రప్రదేశ్‌లో పీఎం కిసాన్ పథకానికి అర్హులైన రైతులు  60 లక్షల మందికిపైనే ఉన్నారు.  దాదాపు 10-15 లక్షల మందికి అందట్లేదు.  కేవలం స్వంత భూమి కలిగిన రైతులకే సాయం చేస్తున్నారు.  రోజుకో షరతు పెట్టడంతోపాటు సాంకేతిక సమస్యల కారణంగా లక్షల మంది రైతులు లబ్ధి పొందలేకపోతున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. 
 
 రైతు భరోసా లబ్దిదారులకు చిక్కులు !


'వైఎస్‌ఆర్‌ రైతు భరోసా' పేరిట ప్రభుత్వం రూ. పదమూడున్నరవేలు ఇస్తున్నట్లుగా కేంద్రం నిధఉలతో కలిసి ప్రచారం చేసుకుంటోంది.   కేంద్రం రూ.6 వేలు, రాష్ట్రం రూ.7,500 కలిపి మొత్తం రూ.13,500 . కేంద్ర నిబంధనల వలన పిఎం కిసాన్‌ లబ్ధి లక్షలాది మంది రైతులకు అందట్లేదు. రాష్ట్రం ఇచ్చే రూ.7,500 మాత్రమే జమ అవుతున్నాయి. మిగిలిన మొత్తం .. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వకపోతూండటంతో రైతులు నష్టపోతున్నారు.