Two States Financial Status :  తెలుగు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రాను రాను దిగజారిపోతోంది. ఏపీ అప్పులు చేసి మిణుకుమిణుకుమంటూడగా.. తెలంగాణకు అప్పలు దొరకక ఆ పరిస్థితి ఎదుర్కొంటోంది. రెండు తెలుగు రాష్ట్రాలకు అప్పులు.. వడ్డీల భారం అధికంగానే ఉంది. వచ్చే ఆదాయంలో అత్యధికం వడ్డీలకే కేటాయించాల్సి వస్తోంది. ఇలాంటి సమయంలో కేంద్రంతో  మంచి సంబంధాలు నెలకొల్పుకుని .. ఎలాగోలా అప్పులు తెచ్చుకుని బయటపడాలని ఏపీ ప్రయత్నిస్తూండగా...తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం.. కేంద్రంతో ఢీ అంటేఢీ  అనడానికి రెడీ అవుతున్నారు. తాడోపేడో తేల్చుకుంటానంటున్నారు. 


ఆదాయంలో అత్యధిక వడ్డీలకే !


తెలుగు రాష్ట్రాల  ఖజానాకు వస్తున్న ఆదాయంలో అధికభాగం చేసిన అప్పులకు చెల్లించాల్సిన వడ్డీలకే సరిపోతోంది ఏడాదికి ఏడాదీ వడ్డీల భారం పెరిగిపోతుండడంతో ఇతర కార్యక్రమాలకు నిధులు చాలడం లేదు.  రిజర్వ్‌బ్యాంకు ప్రకటించిన గణాంకాల ప్రకారం చూస్తే ఏపీ రాష్ట్ర ఆదాయంలో  అత్యధికభాగం వడ్డీలకు చెల్లించాల్సివస్తోంది. గత ఆరేళ్లలో వడ్డీలకు చెల్లించే మొత్తం రెట్టింపుకన్నా ఎక్కువగా రికార్డయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 22,740 కోట్ల రూపాయలను ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో వడ్డీగా చెల్లించాల్సి వస్తోంది. తెలంగాణ రాష్ట్ర వడ్డీల భారతం ఏపీతో పోలిస్తే కాస్త తక్కువే.  తెలంగాణ రూ. 17,584 కోట్ల రూపాయలను ఈ ఆర్థిక సంవత్సరంలో వడ్డీలుగా కట్టాల్సి వస్తోంది. రాష్ట్రాలు అవసరాల కోసం తీసుకునే అప్పుల్లో ఎక్కువ శాతం సెక్యూరిటీ బ్యాండ్లను తనఖా పెట్టడం ద్వారా బహిరంగ మార్కెట్‌ రుణాల నుంచి తీసుకుంటుండగా, విద్యుత్‌ బ్యాండ్లు, వేస్‌ అండ్‌ మీన్స్‌, నాబార్డ్‌ రుణాలు, జాతీయ సహకారాభివృద్ధి సంస్థ నుంచి, ఇతర బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలు ఉంటాయి. వీటిపై ప్రతి నెలా తప్పనిసరిగా వడ్డీలు చెల్లించాల్సి ఉంటుంది.   


అప్పుల గ్యారంటీలలోనూ రెండు తెలుగు రాష్ట్రాలే ముందు!


కార్పొరేషన్ల పేరుతో గ్యారంటీలు ఇచ్చి బ్యాంకులు.. ఇతర ఆర్థిక సంస్థల నుంచి అప్పులు చేయడం ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చే గ్యారంటీల్లో  తొలి స్థానంలో తెలంగాణ ఉండగా.. మూడో స్థానంలో ఏపీ ఉంది.  దేశం మొత్తంమీద అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి ఇచ్చిన గ్యారంటీల్లో ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలదే 64 శాతం . సొంత పన్నుల ఆదాయంలో 90 శాతం వరకు గ్యారంటీలు ఇచ్చుకోవచ్చునన్నది నిబంధన కాగా, గతేడాది దీనిని 180 శాతంగా పెంచుతూ  ఏపీ సొంత నిర్ణయం తీసుకుంది.  గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల విలువ ఏకంగా రూ. 91,330 కోట్లుగా ఉంది.  తెలంగాణ రూ. 1,05,006 కోట్లు రుణాలకు గ్యారంటీ ఇచ్చింది. 


అప్పుల కోసం ఇప్పటికీ అర్రులు చాస్తున్న తెలుగు రాష్ట్రాలు !


సెప్టెంబర్‌తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ 21, 173 కోట్ల రూపాయల అప్పు చేసింది. నిజానికి కేంద్రం అప్పులపై పూర్తి స్థాయిలో ఆంక్షలు విధించడం వల్లనే ఈ కొద్ది లోన్లు. లేకపోతే.. మరో ముఫ్ఫై వేల కోట్ల రుణం అదనంగా తీసుకునేవారు. గతంలో మంజూరైన కాళేశ్వరం రుణాలు కూడా ప్రస్తుతం ఆగిపోయాయి.అందుకే కేసీఆర్ కేంద్రంపై మండి పడుతున్నారు. కేంద్రం తీరు వల్ల 40వేలకోట్లు రావడం లేదని అంటున్నారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు పెట్టాలనుకుంటున్నారు. ఏపీలో అయితే.. . ఆరు నెలల్లో దగ్గర దగ్గర యాభై వేల కోట్లు అప్పు చేసింది. కేంద్రం.. ఏపీ విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు. ఏడాది మొత్తం 48వేల కోట్ల అప్పు చేస్తామని బడ్జెట్‌లో ఏపీ పెడితే.. ఆరు నెలలకే 49వేల కోట్ల అప్పు చేసింది. ఇంకా అదనపు అప్పుల కోసం కేంద్రం వద్ద గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. 


అప్పులు పుట్టకపోతే రెండు రాష్ట్రాలకూ సమస్యలే !


వస్తున్న ఆదాయంలో ఎక్కువ భాగం వడ్డీలకు.. తప్పని సరి చెల్లింపులకు పోతూండటంతో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి కూడా ప్రభుత్వాలు తంటాలు పడుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉద్యోగుల జీతాలు ఆలస్యమవుతున్నాయి. అయితే ఎప్పటికప్పుడు ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకు వచ్చి సర్దుబాటు చేస్తున్నారు. కేంద్రం దయతలిచి అప్పులకు పర్మిషన్ ఇస్తే.. రెండు తెలుగు ప్రభుత్వాలూ .. ఇబ్బందుల నుంచి గట్టెక్కుతాయి. లేకపోతే..  ఆర్థిక సంక్షోభంలో ఇరుక్కుపోతాయి. ఏపీ ప్రభుత్వం కేంద్రంతో.. సన్నిహితంగా ఉంటుంది. అందుకే అప్పులు దొరుకుతాయన్న భరోసాతో ఉంది. కానీ తెలగామ సర్కార్ అలా లేదు.  ఏం చేసినా కేంద్రం అప్పులకు పర్మిషన్ ఇవ్వదన్న ఉద్దేశంతో.. అసలు విషయాన్ని ప్రజల ముందు ఉంచాలని.. కేంద్రం వల్లే ప్రజలకు సమస్యలని చెప్పాలన్న ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.