TS Politics :  గిరిజన రిజర్వేషన్ల రాజకీయం ఇప్పుడు తెలంగాణలో హైవోల్టేజ్‌కు చేరుతుంది. గత మూడు, నాలుగు రోజుల్లో ఈ రిజర్వేషన్ల చుట్టూ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి సత్యవతి రాథోడ్ కన్నీరు పెట్టుకున్నారు. రిజర్వేషన్లను కేంద్రం ఆమోదించకపోతే బీజేపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామని టీఆర్ఎస్ ప్రకటించింది. అడ్డగోలుగా జీవో జారీ చేసి సుప్రీంకోర్టులో స్టే వచ్చేలా చేసి గిరిజనుల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో అసలు గిరిజన రిజర్వేషన్లు పెరుగుతాయా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది. 


రాజ్యాంగపరంగా ఎలాంటి అడ్డంకులు లేవంటున్న టీఆర్ఎస్ !


తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఇచ్చిన హామీల్లో అత్యంత కీలకమైనవి గిరిజన రిజరవేషన్లు.  తెలంగాణ ఏర్పడిన తర్వాత గిరిజన జనాభా ఆరు నుంచి పదిశాతానికి వెళ్లింది. దీని ప్రకారమే గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచాలని శాసన సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఏడేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వానికి పంపింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర పడితే రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. అయితే కేంద్రం యాభై శాతానికి మించి  రిజర్వేషన్లు ఇవ్వకూడదన్న సుప్రీంకోర్టు నిబంధన ఉంది కాబట్టి తీర్మానాన్ని పట్టించుకోలేదు. రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దు అన్న ప్రతిబంధన లేదు. మన పక్కన ఉన్న తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నారని టీఆక్ఎస్ గుర్తు చేస్తోంది.  కేంద్ర ప్రభుత్వం   ఏడో షెడ్యూల్‌లో చేరిస్తే చాలని కేసీఆర్ అంటున్నారు.  రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు చెప్తూనే.. తప్పనిసరి పరిస్థితుల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించవచ్చన్నది. ఈ మేరకు తమిళనాడు 69% రిజర్వేషన్లు అమలు చేస్తున్నది. అదే విధానాన్ని తెలంగాణకూ వర్తింప చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. 


తెలంగాణ నుంచి ప్రతిపాదనే రాలేదని పార్లమెంట్‌లో చెప్పిన కేంద్రం ! 


జనాభా ప్రాతిపదికన గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచాలని 2017లోనే అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర హోంశాఖకు పంపింది. రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తెలంగాణ చేసిన బిల్లుకు కేంద్ర గిరిజన శాఖ మద్దతు తెలియజేస్తున్నదని కేంద్ర డిప్యూటీ సెక్రటరీ దిలీప్‌కుమార్‌ కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు. గిరిజనులకు 2011 లెక్కల ప్రకారం 9.08 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్‌ కల్పించాలని సూచించారు.కేంద్ర హోం శాఖ ఈ బిల్లులో కొన్ని అంశాలపై వివరణ కోరగా, 2018 ఏప్రిల్‌ 26న రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. మరుసటి రోజే కేంద్ర హోంశాఖ బిల్లుపై సమీక్షించింది.   కేంద్ర గిరిజన వ్యవహారాలశాఖ కూడా గిరిజనుల రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదన అంశం కేంద్రం పరిశీలనలో ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టంగా చెప్పింది. అయితే ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ‘ఎస్టీ రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదు’ అని ప్రకటించడంతో దుమారం రేగింది. ఆ సమాధానం ప్రకారం గిరిజన రిజర్వేషన్ల అంశం కేంద్రం వద్ద పెండింగ్‌లో లేదని అనుకోవచ్చు. 


కేంద్రం అనుమతి అవసరం లేదంటున్న బీజేపీ ! 
 
రాజ్యాంగంలోని ఆర్టికల్16(4) ప్రకారం రాష్ట్రంలో దళితులు, గిరిజనులు ఎంత శాతం ఉంటారో వారి జనాభా అంత శాతం రిజర్వేషన్ పెంచుకోవచ్చు.    తెలంగాణ ప్రభుత్వం 16 ఏప్రిల్​ 2017 న అసెంబ్లీలో తీర్మానం చేసిన ఎస్టీ రిజర్వేషన్ బిల్లులో అనేక లోపాలు ఉన్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే కేంద్రం పరిగణనలోకి తీసుకోలేదని అంటున్నారు.  రాజ్యాంగంలోని ఆర్టికల్‌16(4) ప్రకారం ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్‌ శాతం పెంచే అవకాశం ఉందని గుర్తు చేస్తున్నారు.  ఈడబ్ల్యూఎస్‌ 10 శాతం రిజర్వేషన్‌ అమలుకు లేని ఆటంకం గిరిజనుల విషయంలో ఎందుకు ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.  కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ల శాతం పెంచేందుకు ప్రత్యేకంగా మరోసారి తీర్మానం చేసి జీవో జారీ చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఎన్టీ రామారావు 127 జీవో ప్రకారం 4 శాతం ఉన్న రిజర్వేషన్లను 6 శాతానికి పెంచారు. అప్పుడు రాని న్యాయసమస్యలు ఇప్పుడు ఎలా వస్తాయని ప్రశ్నిస్తున్నాయి. కేసీఆర్ జారీ చేస్తున్న జీవోలన్నీ కేంద్రం అనుమతితోనే ఇస్తున్నారా అని ప్రశ్నిస్తున్నారు. 


రిజర్వేషన్లు దక్కకపోతే గిరిజనులు ఆగ్రహం ఎవరిపై చూపిస్తారు !?


రిజర్వేషన్ల కోసం గిరిజనులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ జీవో జారీ చేస్తున్నారు. ఆ జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే ఇవ్వడం సహజంగా జరుగుతుంది. ఎందుకంటే గత  సుప్రీంకోర్టు తీర్పులు అలాగే ఉన్నాయి. తాము చిత్తశుద్ధితో ప్రయత్నించామని టీఆర్ఎస్ చెప్పుకోవచ్చు. తమదాకా కేసీఆర్ రాలేదని కేంద్రం చెప్పుకోవచ్చు. కానీ గిరిజనలకు కావాల్సింది కారణాలు కాదు రిజర్వేషన్లు. అవి రాకపోతే వారి ఆగ్రహం ఎవరిపై  చూపిస్తారో మాత్ర అంచనా వేయడం కష్టం.