తెలుగుదేశం పార్టీలో అన్ని జిల్లాలది ఓ లెక్క ...అనంతపురం జిల్లాది మరో లెక్క అన్నట్లుగా పరిస్థితి మారింది.  ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు అన్ని నియోజకవర్గాలలో తెలుగుదేశం  నాయకుల మధ్య సఖ్యత కొరవడింది. వర్గాలుగా విడిపోయి పార్టీ కార్యక్రమాలు సైతం విడివిడిగా చేసుకుంటూ తమ అనైక్యతను చాటుకుంటున్నారు. సత్యసాయి జిల్లా తెలుగుదేశం ఇన్చార్జి బి.కె పార్థసారథి కి సైతం స్థానిక నాయకురాలు సవితమ్మతో రెబెల్ పోరు తప్పడం లేదు. మడకశిరలో మాజీ ఎమ్మెల్యే ఈరన్న కు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కి అసలు పొసగడం లేదు. కళ్యాణ దుర్గం లో ఉమామహేశ్వర నాయుడు , హనుమంతరాయ చౌదరి వర్గాలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఎవరి వ్యూహాలలో వాళ్ళు ఉన్నారు. 


పొలిట్ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు ప్రాతినిథ్యం వహించిన రాయదుర్గం నియోజకవర్గంలో దీపక్ రెడ్డి రూపంలో వ్యతిరేకత ఎదురవుతోంది. తమకే టికెట్ కేటాయించాలంటూ దీపక్ రెడ్డి వర్గం జోరుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక పుట్టపర్తి నియోజకవర్గం లో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కి స్థానిక నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీనికి తోడు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా జేసీ ప్రభాకర్ రెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి కి వ్యతిరేకంగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. దీనికి జవాబుగా పల్లె రఘునాథ్ రెడ్డి సైతం జేసీ ప్రభాకర్ రెడ్డి పై విరుచుకుపడ్డారు. బహిరంగంగా విమర్శించుకుంటూ ఉన్నప్పటికీ తెలుగుదేశం కేంద్ర నాయకత్వం గానీ జిల్లా నాయకత్వం గాని ఈ విమర్శలకు అడ్డుకట్ట వేయడంలో పూర్తిగా విఫలమయ్యింది. ఐక్యత లేక గతంలో  నెగిటివ్ రిజల్ట్స్ అందుకున్నప్పటికీ కనీసం ఇప్పటికైనా గుణ పాఠాలు నేర్వలేదన్న విమర్శలు జోరందుకున్నాయి. నాయకుల మధ్య సఖ్యత లేకపోతే రానున్న సార్వత్రిక ఎన్నికల పరిస్థితి ఏంటని సామాన్య కార్యకర్తలు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. 


పలు నియోజకవర్గాలలో అభ్యర్థులను మార్చాలని జేసీ ప్రభాకర్ రెడ్డి గత రెండేళ్లుగా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. దీంతో సుమారు ఐదారు నియోజకవర్గాల నాయకులు ప్రభాకర్ రెడ్డి పై గుర్రుగా ఉన్నారు. ఇలా బహిరంగ విమర్శలు చేస్తున్నప్పటికీ వారిని కట్టడి చేయడంలో అగ్ర నాయకత్వం విఫలమైందన్న ఆరోపణలు లేకపోలేదు. మరోవైపు తెలుగుదేశం కేంద్ర కమిటీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన కార్యక్రమ ఏర్పాట్లపై నిర్వహించిన ప్రెస్ మీట్ లో సైతం పోలిట్‌ బ్యూరో  సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. జిల్లాకు చెందిన అగ్రనాయకులు అయిన పయ్యావుల కేశవ్,  పరిటాల సునీత ,  జెసి ప్రభాకర్ రెడ్డి ,  లాంటి వారు రాకపోవడం వెనుక సమన్వయ లోపమేనన్న విమర్శలు ఉన్నాయి. అధినేత రాకతో నైనా అగ్రనాయకుల మధ్య సమన్వయం కుదురుతుందన్న ఆశాభావం ఇప్పుడు కార్యకర్తల లో చిగురిస్తోంది.  


జిల్లాలోని అగ్ర నాయకుల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు చెరిపి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే అధినేత చంద్రబాబు రేపు ఉదయం అగ్ర నాయకులతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా నాయకుల వ్యవహార శైలిపై అధినేత వద్ద  ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదన్న వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.