MIM Telangana :   తెలంగాణలో  విలీన దినోత్సవ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటి వరకూ ఈ విమోచన లేదా విలీన దినోత్సవాన్ని నిర్వహించడాన్ని  మజ్లిస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అనుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పుడు మజ్లిస్ కూడా షాక్ ఇచ్చింది. తాము స్వయంగా వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు.  ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మజ్లిస్ చీఫ్ ఓవైసీ లేఖ రాశారు. 



సెప్టెంబర్ 17న ఓల్డ్ సిటీలో భారీ తిరంగా ర్యాలీ చేపడుతామన్నారు.  తెలంగాణ విమోచనం కోసం హిందూ -ముస్లింలు కలిసిపోరాడారని ఒవైసీ గుర్తు చేశారు. వలసవాదం, భూస్వామ్యవాదం , నిరంకుశత్వానికి వ్యతిరేకంగా అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు చేసిన పోరాటాలు కేవలం ఒక భూభాగాన్ని "విముక్తి" చేయడానికి మాత్రమే కాదన్నారు. హైదరాబాద్ రాష్ట్ర ప్రజలపై దాడులకు తెగబడ్డ రజాకార్లు అప్పుడే పాకిస్థాన్కు వెళ్లిపోయారని చెప్పారు. భారత్లో భాగంగా ఉండాలనుకున్న వారే ఇక్కడ ఉన్నారని ఒవైసీ లేఖలో స్పష్టం చేశారు. 


సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని కేంద్రం నిర్ణయించిందని అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఈ అంశంపై కేంద్ర హోం  మంత్రి అమిత్ షా, సీఎం కేసీఆర్ కు లేఖలు రాసినట్లు చెప్పారు. సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం విలీమైన రోజు అని గుర్తు చేశారు. సెప్టెంబర్ 17ను ఎంఐఎం ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. హైదరాబాద్ సంస్థానం విలీనం కోసం తుర్రేబాజ్ ఖాన్, మగ్ధూం మోహిద్దీన్ వీరోచిత పోరాటం చేశారని.. వారి సేవలను మరిచిపోవద్దన్నారు.  సెప్టెంబరు 17ను పురస్కరించుకుని  పాతబస్తీలో బహిరంగ సభ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెలంతా పాల్గొంటారని తెలిపారు. సెప్టెంబరు 17న పాతబస్తీలో బైక్ ర్యాలీ నిర్వహిస్తామని...ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కేసీఆర్‌ను కూడా ఆహ్వానిస్తామని ఓవైసీ ప్రకటించారు. 


సెప్టెంబర్ 17ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించాలని లేఖలో ఓవైసీ కోరారు.  బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లల్లో సెప్టెంబర్ 17ను ఎందుకు అధికారికంగా నిర్వహించలేదని ప్రశ్నించారు. ఈ ఏడాది అధికారికంగా తెలంగాణ విమోచనా దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. టీఆర్ఎస్ కూడా ఆ మేరకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే టీఆర్ఎస్ ఇప్పటి వరకూ అధికారికంగా నిర్వహించకపోవడానికి..కారణం మజ్లిస్‌కు కోపం వస్తుందనేనని బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఈ ఆరోపణలకు..  మజ్లిసే స్వయంగా ఖండించినట్లయింది.  దీంతో వివాదానికి తెరపడినట్లే అనుకోవచ్చు.