YSRCP BJP Alliance Rumours:   ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతున్న  ఢిల్లీ పర్యటన , ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాల అపాయింట్‌మెంట్‌లు ఎప్పుడూ అత్యంత ఆసక్తికరమైన రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి. ఇంత  వరకూ అపాయింట్ మెంట్ ఖరారైనట్లుగా స్పష్టత లేదు కానీ.. భేటీ ఉంటుందని వైఎస్ఆర్‌సీపీ వర్గాలంటున్నాయి.  అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా..  కేంద్ర పెద్దలకు తమపైనే ప్రత్యేక అభిమానం ఉందనే  సంకేతాలను కేడర్‌లోకి పంపడంలో వైఎస్సార్‌సీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ వస్తోంది.  క్షేత్రస్థాయి ప్రచారంలో  టీడీపీ, జనసేనలతో భాజపా కేవలం ఎన్నికల పొత్తు మాత్రమే పెట్టుకుంది, కానీ మోదీ-షాలకు జగన్ అంటేనే ప్రత్యేక ఇష్టం  అనే  భావనను నిలబెట్టే ప్రయత్నం నిరంతరం సాగుతుంటుంది.  కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదు చేసేందుకు జగన్‌కు మోదీ-షాలు అపాయింట్‌మెంట్ ఇస్తే ఏపీ రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయనేది ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

మోదీకి దగ్గర అనే భావన పెంచుకుంటున్న వైసీపీ

వైఎస్సార్‌సీపీ వ్యూహాన్ని లోతుగా పరిశీలిస్తే.. ఢిల్లీలో కేంద్ర పెద్దల భేటీ లభిస్తే దాన్ని వెంటనే కూటమిపై మైండ్ గేమ్ ఆడేందుకు ఉపయోగించుకుంటుంది.  తమ నేతపై కేంద్ర దర్యాప్తు సంస్థల కదలికలు మందగించడానికి, కూటమి ప్రభుత్వం పగటిపూట చేసే విచారణలకు కేంద్రం వద్ద మద్దతు లభించడం లేదని నిరూపించడానికి ఈ అపాయింట్‌మెంట్‌ను ఒక రుజువుగా చూపే అవకాశం ఉంది. జగన్ విజ్ఞప్తులను వినడానికి ప్రధాని లేదా హోంశాఖ మంత్రి సమయం కేటాయిస్తే.. చూశారా! కూటమి ఎన్ని ఆరోపణలు చేసినా కేంద్రం జగన్ మాటకే ప్రాధాన్యం ఇస్తోంది అని క్షేత్రస్థాయిలో జోరుగా ప్రచారం చేసుకోవడం ద్వారా సొంత కేడర్‌లో ధైర్యం నూరిపోసేందుకు  వైసీపీకి అవకాశం లభిస్తుంది.  ఇక కూటమి పరంగా చూస్తే.. ప్రధాని లేదా హోంశాఖ మంత్రి జగన్‌కు ముఖాముఖి సమయం ఇవ్వడం కూటమి శ్రేణుల్లో సాంకేతికంగా కొంత గందరగోళాన్ని సృష్టించే ముప్పు ఉందనేది కొట్టిపారేయలేని నిజం. ముఖ్యంగా టీడీపీ, జనసేన శ్రేణులు సుదీర్ఘ పోరాటం చేసి సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత, వైసీపీ శ్రేణులకు అంతర్గతంగా పొందే ఒక  నైతిక విజయం గా ఇది రూపాంతరం చెందే ప్రమాదం ఉంది. కూటమి ప్రభుత్వం చేపడుతున్న విచారణలు, అరెస్టులపై జగన్ ఇచ్చే వినతిపత్రాలు ఢిల్లీ స్థాయిలో చర్చనీయాంశమైతే, అది కూటమి ఐక్యత ,  ప్రభుత్వ ఇమేజ్‌పై స్వల్ప ప్రభావం చూపవచ్చనే ఆందోళన స్థానిక నేతల్లో వ్యక్తమవుతుంటుంది.

Continues below advertisement

కూటమిని బలహీనపరిచేలా బీజేపీ చేయకపోవచ్చు!

అయితే, ఢిల్లీ రాజకీయాల యంత్రాంగాన్ని డీకోడ్ చేస్తే.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం నరేంద్ర మోదీ, అమిత్ షాలు అంత సులభంగా విపక్షాల ట్రాప్‌లో పడే అవకాశాలు లేవని స్పష్టమవుతోంది. రాజకీయ వ్యూహకర్తగా అమిత్ షా వైఖరి ఎప్పుడూ స్పష్టంగా ఉంటుంది. ప్రాంతీయ పార్టీల అంతర్గత కలహాల్లో దూరి తమ మిత్రపక్షాలకు ఇబ్బంది కలిగించే రాజకీయాలకు వారు దూరంగా ఉంటారు. ప్రస్తుతం ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అత్యంత బలమైన మెజారిటీతో, చంద్రబాబు సీఎంగా, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా సుస్థిర పాలన అందిస్తోంది.  ఇటువంటి సమయంలో కూటమి ఐక్యతకు హాని కలిగించే లేదా మిత్రపక్షాల్లో అనుమానాలు రేకెత్తించే సంకేతాలను అధిష్టానం ఇవ్వాలనుకోదు.

అపాయింట్‌మెంట్ ఉండకపోవచ్చంటున్న కూటమి నేతలు

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాష్ట్రానికి చెందిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేదా మాజీ ముఖ్యమంత్రి సమయం కోరినప్పుడు, నిబంధనల ప్రకారం లేదా సాధారణ ప్రోటోకాల్ ప్రకారం వినతిపత్రాలు స్వీకరించడం కేంద్ర మంత్రుల విధి. అయితే, దాన్ని ప్రత్యేక రాజకీయ సంబంధంగా చిత్రీకరించే  వైసీపీ ప్రయత్నాలను అటు  బీజేపీ  జాతీయ వర్గాలు కూడా గమనిస్తూనే ఉన్నాయి. అందుకే ఒకవేళ అపాయింట్‌మెంట్ ఇచ్చినప్పటికీ, అది కేవలం ప్రజాస్వామ్యబద్ధమైన వినతుల స్వీకరణకే పరిమితమని, ఎన్‌డీయే భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేనలకు ఇచ్చే ప్రాధాన్యతలో ఎలాంటి మార్పూ ఉండదని  స్పష్టమైన సంకేతాలను బీజేపీ  ఇస్తోంది. మోదీ, షాలు ఇచ్చే సాధారణ అపాయింట్‌మెంట్‌ను  రాజకీయ ప్రచారానికి వాడుకోవాలని చూసినప్పటికీ, అది కూటమి పునాదులను కదిలించే స్థాయికి వెళ్లకపోవచ్చని    భావిస్తున్నారు. చంద్రబాబు రాజకీయ అనుభవం, పవన్ కళ్యాణ్ బీజేపీతో కొనసాగిస్తున్న దృఢమైన బంధం ముందు  జగన్ భేటీలు తాత్కాలిక సంచలనాలకే పరిమితమవుతాయి. ఎన్డీయే కూటమి తన పరిపాలనాజెండాతో ముందుకు సాగుతున్నంత కాలం, ఢిల్లీ భేటీల పేరుతో సాగే పొలిటికల్ మైండ్ గేమ్‌లు ఏపీ అసలు రాజకీయ సమీకరణాలను మార్చలేవని  ఎక్కువ మంది భావిస్తున్నారు.