AP Politics YSRCP Boycott Assembly:  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  విధానాలు మరోసారి హాట్ టాపిక్ అవుతున్నాయి.  రాష్ట్రంలో శాంతిభద్రతల క్షీణత,  రాజకీయ హింస , డీఎస్సీ నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ నిత్యం మీడియా, సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది.  అదే సమయంలో  పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వైసీపీ ఎంపీలు ఏపీ శాంతిభద్రతలపై వాయిదా తీర్మానాలు కూడా ఇస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాడేందుకు చట్టసభలు ప్రధాన వేదికలు. అయితే ఇక్కడ రాష్ట్ర అంశాలపై అసెంబ్లీలో చర్చించాల్సింది .. అక్కడ మాత్రం వైసీపీ ఆసక్తి చూపించడం లేదు.  

Continues below advertisement

రాష్ట్ర పరిధిలోని అంశం లా అండ్ ఆర్డర్ 

పార్లమెంటరీ నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం రాష్ట్రంలో శాంతిభద్రతల  వ్యవహారం అనేది పూర్తిగా రాష్ట్ర జాబితా  పరిధిలోని అంశం. పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం ఇచ్చినా, దానిపై   చర్చకు స్పీకర్ లేదా రాజ్యసభ ఛైర్మన్ అనుమతించే అవకాశాలు ఉండవు. మహా అయితే  జీరో అవర్ లో ఏదైనా మాట్లాడవచ్చు కానీ వైసీపీ ఎంపీలు ఏపీ శాంతిభద్రతల అంశాన్ని లేవనెత్తగలరు.  అయితే ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం గానీ, ప్రజా సమస్యలకు తగిన సమాధానం పొందడం గానీ ఏమాత్రం సాధ్యం కాదు. కానీ ఏపీ అసెంబ్లీలో వారికి ఆ చాన్స్ లభిస్తుంది.  రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికి, పాలకులను నిలదీయడానికి అత్యంత శక్తివంతమైన వేదిక శాసనసభ  . త్వరలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ ఈ సమావేశాలకు హాజరవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. అసెంబ్లీకి వెళ్లకుండా బహిష్కరించడం వల్ల తమ గొంతును సభలో వినిపించే సవర్ణ అవకాశాన్ని పార్టీ స్వయంగా చేతులారా జారవిడుచుకుంటోంది. గతంలో వైఎస్సార్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలకు ఇచ్చిన అవకాశాల కంటే, ప్రస్తుతం అసెంబ్లీలో ప్రభుత్వం మైక్ ఇస్తుందో లేదోనన్న సందేహాలు ఉన్నప్పటికీ.. సభకు వెళ్తేనే ప్రతిపక్షం పోరాటపటిమ ప్రజలకు స్పష్టంగా తెలుస్తుంది.

Continues below advertisement

ప్రభుత్వంపై అనేక ఆరోపణలు చేస్తున్న వైసీపీ 

ఇటీవలి కాలంలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ సవాలు విసురుతున్న అంశాలు కొల్లలుగా ఉన్నాయి. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ నిబంధనల నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, లా అండ్ ఆర్డర్ సమస్యలు, రాజకీయ వేధింపుల ఆరోపణల వరకు ప్రతి అంశంపైనా ప్రభుత్వాన్ని కట్టడి చేసేందుకు వైసీపీ వద్ద విస్తృతమైన సమాచారం ఉంది. ఈ అంశాలపై పాయింట్ బై పాయింట్ అసెంబ్లీ వేదికగా మంత్రులను, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను నిలదీస్తే పొందే మైలేజ్ ఎంతో ఎక్కువ. పార్లమెంట్‌లో వంద నిరసనల కంటే.. అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్ నిలబడి వేసే ఒక్క ప్రశ్న ప్రభుత్వానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యతను పెంచుతుంది.

జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లే ధైర్యం చేస్తారా? 

అయితే, జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్లే ధైర్యం చేస్తారా? లేక గతంలో లాగానే  ప్రతిపక్ష నేత  హోదా ఇవ్వలేదన్న నెపంతో అసెంబ్లీకి దూరంగా ఉంటారా? అన్నది ఆ పార్టీ నేతలుక ఇంకా క్లారిటీ లేదు.  ప్రతిపక్ష హోదా సాంకేతిక అంశం మాత్రమే. సభలోకి అడుగుపెట్టి ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై విరుచుకుపడితే, ప్రజల్లో జగన్ ఇమేజ్ , పొలిటికల్ క్రెడిబిలిటీ పెరుగుతుంది. మైక్ కట్ చేస్తే ప్రత్యక్షంగా ప్రజా క్షేత్రంలోనే సభా ఉల్లంఘనపై పోరాడవచ్చు. అలా కాకుండా సభను బహిష్కరిస్తే..  సభలో ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ధైర్యం లేకే పారిపోతున్నారు  అనే అధికార కూటమి ప్రచారానికి బలం చేకూరే ప్రమాదం ఉంది. పార్లమెంట్లో వాయిదా తీర్మానం  అనేది మీడియాలో రావడానికి ఉపయోగపడుతుంది.  అర్థవంతమైన, ఫలప్రదమైన చర్చ జరిగి, శాంతిభద్రతలపై స్పష్టత రావాలంటే వైఎస్సార్‌సీపీ తక్షణమే తన అసెంబ్లీ బహిష్కరణ వ్యూహాన్ని పునఃపరిశీలించుకోవాలి. రాబోయే వర్షాకాల సమావేశాల్లో జగన్ తన ఎమ్మెల్యేలతో కలిసి సభలోకి అడుగుపెట్టి, ప్రజాసమస్యలపై గళమెత్తితేనే అది నిజమైన ప్రజాస్వామ్య పోరాటమవుతుంది. మరి ఆ దిశగా ఆలోచిస్తారా?