Political Mileage via Digital Campaigns AP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు సరికొత్త చర్చకు దారితీశాయి. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల పూర్తిగా డిజిటల్ పాలిటిక్స్ వైపే మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది.  సొంత యాప్స్, టెక్నాలజీతో మన రాత మారిపోతుంది, కేడర్ అంతా డిజిటల్ వేదికలపై యాక్టివ్ కావాలి  అని జగన్ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం.. క్షేత్రస్థాయి రాజకీయాలను విస్మరించి క్యాడర్‌ను మభ్యపెట్టడమేనా  అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల నుండి వస్తున్నాయి. కేవలం డిజిటల్ ప్రచారం, సొంత యాప్‌ల సృష్టి ద్వారా ఒక ప్రాంతీయ పార్టీ ప్రతిపక్ష హోదాలో ఎంతవరకు మైలేజ్ సాధించగలదనే అంశంపై భిన్నాభిప్రాయాలువ్యక్తమవుతున్నాయి. 

Continues below advertisement

సూపర్ యాప్ ఆవిష్కరణ

ఆధునిక రాజకీయాల్లో సోషల్ మీడియా, డిజిటల్ ప్రచారాల ప్రాధాన్యత పెరిగిన మాట వాస్తవమే. అయితే, వైఎస్సార్‌సీపీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఎక్స్‌టర్నల్ ప్లాట్‌ఫారమ్‌లలో  వారి కంటెంట్‌కు ఆశించిన స్థాయిలో  రీచ్ రాకపోవడం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సోషల్ మీడియా యాక్టివిస్టులపై కేసులు, కఠిన నిబంధనల కారణంగా పాత తరహా ప్రచారం నెమ్మదించింది.   సాంప్రదాయ సోషల్ మీడియా సంస్థలు మన కంటెంట్‌ను నియంత్రించలేవని చెప్తూ.. పార్టీ కోసం ప్రత్యేకంగా సొంత యాప్‌లు, ఇన్-హౌస్ కమ్యూనికేషన్ టూల్స్ క్రియేట్ చేయడంపై జగన్ ఫోకస్ పెట్టారు. కానీ, ఈ డిజిటల్ గోడల మధ్య జరిగే ప్రచారం కేవలం  సొంత డబ్బా లాగా మారి, కేవలం వైఎస్సార్‌సీపీ అభిమానులకే పరిమితం అవుతుందే తప్ప, తటస్థ ఓటర్లలోకి చొచ్చుకెళ్లే అవకాశం చాలా తక్కువని   అభిప్రాయపడుతున్నారు.

Continues below advertisement

క్షేత్రస్థాయి పోరాటాలకు సపోర్టింగ్ టూల్ మాత్రమే 

రాజకీయాల్లో డిజిటల్ ప్రచారం అనేది ఎప్పుడూ క్షేత్రస్థాయి పోరాటాలకు ఒక  సపోర్టింగ్ టూల్  మాత్రమే కావాలి కానీ, అదే ప్రధాన ప్రత్యామ్నాయం కాలేదు. వైఎస్ జగన్ గతంలో అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం సుదీర్ఘమైన  పాదయాత్ర,  క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావడం. కానీ, ప్రస్తుత ప్రతిపక్ష హోదాలో వైఎస్సార్‌సీపీ రాజకీయాలు ఇంకా రోడ్ల మీదికి, ప్రజల మధ్యకు చేరడం లేదనేది బహిరంగ రహస్యం. ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో లాఠీ దెబ్బలు తింటూ, జైళ్లకు వెళ్తూ ధర్నాలు చేయకుండా.. కేవలం ఏసీ రూముల్లో కూర్చుని ట్వీట్లు , ప్రెస్ మీట్లు, యాప్‌లలో అప్‌డేట్లకు పరిమితం కావడం వల్ల మైలేజ్ రావడం కష్టమని సోషల్ మీడియా ట్రెండ్స్ చెబుతున్నాయి.

కార్యకర్తలు బయటకు రావడం తగ్గిపోయే ప్రమాదం

ఈ డిజిటల్ పాలిటిక్స్ వల్ల క్యాడర్ అంతర్గతంగా ఒక తప్పుడు భరోసాలో  ఉండిపోయే ప్రమాదం ఉంది.  యాప్‌లలో బటన్ నొక్కితే ప్రచారం జరిగిపోతుంది.. రాత మారిపోతుంది అని అధినేత చెప్పడం వల్ల.. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం నిలబడే సాధారణ కార్యకర్తల్లో కదలిక తగ్గుతుంది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ప్రజల కోసం రోడ్లపైకి వచ్చి పోరాడనప్పుడు, ప్రజల్లో ఆ పార్టీపై నమ్మకం సడలుతుంది. డిజిటల్ స్క్రీన్లపై కనిపించే గ్రాఫిక్స్, హాష్‌ట్యాగ్‌లు ఓట్లుగా మారవనే చేదు నిజం 2024 ఎన్నికల్లోనే స్పష్టమైంది. జనాల్లోకి వెళ్లకుండా కేవలం డిజిటల్ పోరాటాలకే ప్రాధాన్యత ఇస్తే.. అది కేవలం పార్టీ శ్రేణులను తాత్కాలికంగా మభ్యపెట్టడానికే ఉపయోగపడుతుంది.

ప్రజల్లో కలిసినప్పుడే అసలు ప్రయోజనం

డిజిటల్ మీడియా ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేయడం సులువే కానీ, నేరుగా ప్రజల కష్టాల్లో భాగస్వామ్యం కాకపోతే ఆ మైలేజ్ వల్ల లాభం శూన్యం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ తమ కోసం రోడ్డుపై నిలబడే నాయకుడినే గుర్తిస్తారు.  వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలు సైతం ఫీల్డ్ వదిలేసి కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం కావడం పార్టీ గ్రాఫ్‌ను మరింత దెబ్బతీస్తోంది. కొత్త యాప్‌ల ద్వారా కేడర్‌ను అనుసంధానించవచ్చు కానీ, అది జనాల్లోకి వెళ్లేందుకు కేవలం ఒక మార్గమే కావాలి.  డిజిటల్ వ్యూహాలు పార్టీ అంతర్గత సమన్వయానికి , అర్బన్ ఓటర్లను ఆకర్షించడానికి కొంతవరకు మేలు చేయవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి వైవిధ్యమైన రాజకీయ వాతావరణం ఉన్న రాష్ట్రంలో సొంత యాప్స్ పాలిటిక్స్  ఓట్ల రాతను మార్చలేవు. వైఎస్సార్‌సీపీ తిరిగి పుంజుకోవాలంటే డిజిటల్ స్క్రీన్లను దాటి, ప్రజల గడప తొొక్కాల్సిందే. క్షేత్రస్థాయి పోరాటాల నుంచి వచ్చే అసలైన పొలిటికల్ మైలేజ్‌కు, డిజిటల్ ప్రపంచంలో వచ్చే తాత్కాలిక వ్యూస్‌కు చాలా తేడా ఉంటుందనే విషయాన్ని గ్రహించకపోతే.. వైఎస్సార్‌సీపీ డిజిటల్ లూప్‌లోనే ఉండిపోయే ప్రమాదం ఉందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం.